మండలి చైర్‌పర్సన్‌గా ప్రతిభాభారతి? | Sakshi
Sakshi News home page

మండలి చైర్‌పర్సన్‌గా ప్రతిభాభారతి?

Published Thu, Jun 4 2015 3:56 AM

మండలి చైర్‌పర్సన్‌గా ప్రతిభాభారతి?

సాక్షి, హైదరాబాద్: ఆంధ్రప్రదేశ్ శాసనమండలి చైర్‌పర్సన్‌గా కావలి ప్రతిభాభారతిని నియమించాలని తెలుగుదేశం పార్టీ యోచిస్తోంది. ప్రస్తుతం కాంగ్రెస్‌కు చెందిన  చక్రపాణి మండలి చైర్మన్‌గా ఉన్నారు. ఆయన ఎమ్మెల్సీ పదవీకాలం 2017 వరకు ఉంది. మండలిలో ప్రస్తుతం తగినంత బలం లేకపోవడంతో తెలుగుదేశం అధికారంలోకి వచ్చి ఏడాదయినా ఆయన్నే కొనసాగిస్తున్నారు.

తాజాగా ఎమ్మెల్యేల కోటాలో మండలికి ఎన్నికలు జరగటం, త్వరలో స్థానికసంస్థల కోటాలో ఎన్నికలు జరగనుండటం, గవర్నర్ కోటాలో నలుగురు టీడీపీ నేతలు ఎమ్మెల్సీలుగా నియమితులు కానుండటంతో ఆ పార్టీకి మండలిలో సంఖ్యాబలం పెరగనుంది. దీంతో తమ పార్టీకి చెందిన వ్యక్తిని చైర్‌పర్సన్‌గా నియమించుకోవాలని టీడీపీ భావిస్తోంది.

దీన్లో భాగంగానే గతంలో శాసనసభ స్పీకర్‌గా పనిచేసిన ఎస్సీ సామాజికవర్గానికి చెందిన ప్రతిభాభారతిని నియమించాలని పార్టీ సూచనప్రాయంగా నిర్ణయించినట్లు తెలిసింది. వచ్చే మండలి సమావేశాల్లో చైర్మన్ మార్పు ప్రక్రియకు శ్రీకారం చుట్టే అవకాశం ఉంది.  ప్రతిభాభారతి ఇటీవలే ఎమ్మెల్యేల కోటాలో.. పాలడుగు వెంకట్రావు మృతితో ఏర్పడిన ఖాళీని భర్తీ చేసేందుకు జరిగిన ఎన్నికల్లో ఎమ్మెల్సీగా ఎన్నికయ్యారు.

Advertisement
Advertisement