నిలువు దోపిడీ! | Sakshi
Sakshi News home page

నిలువు దోపిడీ!

Published Sun, Jan 3 2016 3:23 AM

నిలువు దోపిడీ! - Sakshi

ప్రైవేటు ట్రావెల్స్ ఇష్టారాజ్యం
ప్రయాణికులపై  అదనపు బాదుడు
సంక్రాంతి నేపథ్యంలో బస్ చార్జీల పెంపు
ఒక్కో టికెట్‌పై రూ.400 నుంచి రూ.800 వరకు దోపిడీ
చోద్యం చూస్తున్న అధికార యంత్రాంగం

 
 ప్రత్తిపాడు: ప్రయాణికులను నిలువునా దోచుకునేందుకు ప్రైవేట్ ట్రావెల్స్ సిద్ధమయ్యాయి. సంక్రాంతి నేపథ్యంలో హైదరాబాద్ టిక్కెట్‌ల ధరలను ఇష్టారాజ్యంగా పెంచేసిన నిర్వాహకులు అడ్డగోలుగా డబ్బులు దండుకుంటున్నారు. అధికార యంత్రాంగం కళ్లు తెరవకపోవడంతో ప్రయాణికుల జేబుకు చిల్లు పడక తప్పడం లేదు. ఒక్కో టిక్కెట్‌పై అదనంగా వందల రూపాయలు వసూలు చేస్తూ ప్రయాణికుల నడ్డి విరుస్తున్నారు.

 సాధారణ రోజుల్లో గుంటూరు నుంచి హైదరాబాద్‌కు నాన్ ఏసీ బస్సుకు ఫేర్ రూ.450, ఏసీ బస్సుకు రూ.500, స్లీపర్ ఏసీ బస్సుకు రూ.850 ఉంటుంది.  హైదరాబాద్ నుంచి గుంటూరుకు నాన్‌ఏసీ రూ.400, ఏసీ రూ.500, స్లీపర్ ఏసీ 800 రూపాయలు టికెట్ ధర ఉంటుంది. కానీ సంక్రాంతి నేపథ్యంలో ఈ టిక్కెట్ వెలను ఆయా ప్రైవేట్ ట్రావెల్స్ యాజమాన్యాలు అమాంతంగా పెంచేశాయి. ఒక్కో టిక్కెట్‌పై అదనంగా రూ. 400 నుంచి రూ.1000 వరకు రేటును పెంచేశాయి. ఆయా ట్రావెల్స్ వారి ఆన్‌లైన్ వెబ్‌సైట్‌లలో పెంచిన ధరలను ప్రదర్శిస్తున్నాయి.

 హై ‘ధర’..
 గుంటూరు నుంచి హైదరాబాద్‌కు. హైదరాబాద్ నుంచి గుంటూరుకు ప్రస్తుతం ఉన్న టిక్కెట్ ధరలు, సంక్రాంతికి ముందుకు, సంక్రాంతి తరువాత ఉన్న టిక్కెట్ ధరల వివరాలు సుమారుగా ఇలా ఉన్నాయి.. ఒక్కో ట్రావెల్స్ ఒక్కో రకంగా వారి వారి ధరలను కొంచెం అటు ఇటుగా ఇదే విధంగా నిర్ణయించాయి.

 పట్టించుకోని ప్రభుత్వం..
 రాష్ట్రంలోని నలుమూలల నుంచి లక్షల మంది ప్రజలు బతుకుదెరువు నిమిత్తం హైదరాబాద్‌లో నివసిస్తుంటారు. కొందరు స్వగ్రామాల నుంచి వెళ్లి హైదరాబాద్‌లో స్థిరపడిన వారూ ఉంటారు. తెలుగునాట పెద్ద పండుగైన సంక్రాంతికి స్వగ్రామాలకు రావడం సహజం. దీంతో సంక్రాంతి సమయంలో సగం హైదరాబాద్ ఖాళీ అవుతుంది. ఈనేపథ్యంలో ఒక్కసారిగా ప్రజలకు సంక్రాంతి సెలవులకు స్వగ్రామాలకు పయనమయ్యే అవకాశాలు ఉండటంతో ట్రావెల్స్ యాజపమాన్యాలు దోపిడీకి తెరలేపాయి.
 
 వీకెండ్ పేరిట ‘ప్రత్యేక’ దోపిడీ..
 సంక్రాంతి, దీపావళి వంటి పెద్ద పండుగల సందర్భంలోనే కాకుండా ప్రతి వీకెండ్‌లోనూ బస్ ఫేర్‌లో తేడా ఉంటోంది. హైదరాబాద్, బెంగళూరు వంటి నగరాల్లో పనిచేసే సాఫ్ట్‌వేర్ ఉద్యోగులు శని, ఆదివారాల్లో సెలవు కావడంతో ఇళ్లకు వస్తుంటారు. శుక్రవారం సాయంత్రం డ్యూటీ ముగించుకుని స్వగ్రామాలకు బయలుదేరతారు. రెండు రోజులు గడిపి ఆదివారం రాత్రికి పని ప్రదేశాలకు తిరుగుపయనమవుతారు. దీనిని అదనుగా తీసుకుని శుక్రవారం హైదరాబాద్, బెంగళూరు నుంచి ఇతర ప్రాంతాలకు వెళ్లే బస్ ఫేర్‌ను, ఆదివారం ఆయా నగరాలకు వెళ్లే సర్వీసుల టికెట్ ధరలు రూ.200 నుంచి రూ.400 పెంచేస్తున్నారు. దీని వల్ల సామాన్య ప్రయాణికులు ఆయా రోజుల్లో తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. ఇలా ప్రయాణికుల నుంచి ప్రైవేట్ ట్రావెల్స్ యాజమాన్యాలు దోచుకుంటున్నా అధికార యంత్రాంగం కిక్కురుమనడం లేదు.


 

Advertisement
Advertisement