ప్రొఫెసర్ లక్ష్మి దంపతుల అరెస్ట్ | Sakshi
Sakshi News home page

ప్రొఫెసర్ లక్ష్మి దంపతుల అరెస్ట్

Published Tue, Nov 15 2016 1:23 AM

ప్రొఫెసర్ లక్ష్మి దంపతుల అరెస్ట్ - Sakshi

- మూడు రోజులుగా బెంగళూరులోని స్నేహితుడి ఇంట్లో మకాం
- పక్కా సమాచారంతో దాడిచేసి పట్టుకున్న ప్రత్యేక పోలీస్ బృందం
 
 సాక్షి, గుంటూరు/ బెంగళూరు: డాక్టర్ సంధ్యారాణి ఆత్మహత్య కేసులో నిందితురాలిగా ఉన్న ప్రొఫెసర్ లక్ష్మితో పాటు ఆమె భర్త డాక్టర్ విజయసారథిని పోలీసులు సోమవారం బెంగళూరులో అదుపులోకి తీసుకున్నారు. మూడు రోజులుగా బెంగ ళూరులోని ఓ స్నేహితుడి ఇంట్లో ఉన్నట్లు  సమాచారం అందుకున్న ప్రత్యేక పోలీస్ బృందం దాడి చేసి వీరిని అరెస్టు చేసింది. సోమవారం అర్థరాత్రికి వీరిని గుంటూరు తీసుకువచ్చే అవకాశం ఉంది. కాగా, లక్ష్మి దంపతులు పోలీసులకు దొరక్కుండా 22 రోజుల పాటు ఐదు రాష్ట్రాలు చుట్టేశారు. పోలీసు శాఖలోని ఓ ఉన్నతాధికారితో పాటు, ఓ రిటైర్డ్ జడ్జి, అధికార నేతల సలహా మేరకే బెరుుల్ వచ్చే వరకూ పోలీసులకు దొరకకూడదని వీరు నిర్ణరుుంచుకున్నట్లు సమాచారం.

గత నెల 24న సంధ్యారాణి మృతిచెందగా, ఆ రోజు రాత్రి లక్ష్మి దంపతులు గుంటూరుకు చెందిన ఓ వ్యాపారి ఏర్పాటు చేసిన ట్రావెల్స్ కారులో మొదట ప్రకాశం జిల్లాకు వెళ్లి, అటు నుంచి తమ కుమారుడు చదువుకుంటున్న పాండిచ్చేరి వెళ్లి అక్కడ ఓ లాడ్జిలో బస చేశారు. ఆ తర్వాత చెన్నై, తిరుపతి వెళ్లిన వీరు.. తమ కుమారుడిని తిరిగి పాండిచ్చేరికి పంపించేశారు. ఇక అటు నుంచి మహారాష్ట్రలోని షిరిడీ, శనిసింగనాపూర్, షోలాపూర్ వంటి పుణ్యక్షేత్రాలు తిరిగి చివరకు హైదరాబాద్ చేరుకున్నట్లు పోలీసులు గుర్తించారు. అరుుతే హైదరాబాద్‌లో వీరి జాడ కనిపెట్టలేక పోయారు. అక్కడి నుంచి మంత్రాలయం, మహానంది వంటి క్షేత్రాలకు వెళ్లినట్లు పోలీసులకు సమాచారం అందడంతో కొన్ని బృందాలను  పంపారు. మరోవైపు ఆమె భర్త, ఏపీ మెడికల్ కౌన్సిల్ వైస్ చైర్మన్ డాక్టర్ విజయసారథికి గతంలో రెండు సార్లు బైపాస్ సర్జరీ జరిగింది. అలాగే మానసిక ఒత్తిడి, యూరిన్‌లో రక్తం పడుతుండటంతో ఆయన మార్గంమధ్యలో పలు ఆస్పత్రుల్లో చికిత్స పొందుతూ ప్రయాణిస్తున్నట్లు పోలీసుల విచారణలో తేలింది.

 సినీఫక్కీలో అరెస్ట్ : ఈ క్రమంలో లక్ష్మి దంపతులు బెంగళూరుకు చేరుకున్న విషయాన్ని తెలుసుకున్న పోలీసులు.. కర్ణాటక డీజేపీ ఓం ప్రకాశ్‌తో పాటు బెంగళూరు నగర పోలీస్ కమిషనర్‌కు సమాచారం అందించారు.ఆ దంపతులు ఏటీఎం ద్వారా ఎక్కడ డబ్బులు డ్రా చేసినా పోలీస్ అధికారుల సెల్‌కు మెసేజ్ వచ్చేలా బ్యాంకు అధికారుల సహకారం తీసుకున్నారు. బెంగళూరులోని జయనగర్‌లో ఓ స్నేహితుడి ఇంట్లో మూడ్రోజులుగా ఉన్న వీరు డబ్బులు డ్రా చేయాలని స్నేహితుడి కుమారుడికి ఏటీఎం కార్డు ఇచ్చి పంపారు. అలా డబ్బు డ్రా చేయగానే పోలీసు అధికారి సెల్‌కు మెసేజ్ రావడంతో వారు వెంటనే ఏటీఎం సెంటర్ లొకేషన్ కనిపెట్టి ఆ ఏరియా పోలీసులను అలర్ట్ చేసి.. అతన్ని వెంబడించి  అతను ఇంట్లోకి వెళ్లగానే పోలీసులు ఆ గృహాన్ని చుట్టుముట్టి దాడి చేశారు. లక్ష్మి దంపతులు అక్కడే ఉండటంతో అదుపులోకి తీసుకున్నారు.ఓ పోలీసు ఉన్నతాధికారి లక్ష్మి దంపతులకు తమ కదలికలను ఎప్పటికప్పుడు చేరవేసినట్లు పోలీసులు అనుమానిస్తున్నారు. దీనికి తోడు అధికార నేతల అండదండలు కూడా పుష్కలంగా ఉండటంతో చివరకు వీరిని పట్టుకోవడానికి పోలీసులకు 22 రోజులు పట్టింది.
 
 సెలవడిగితే శాడిజం చూపేది
 గుంటూరు వైద్య కళాశాల ప్రిన్సిపల్‌కు పీజీ విద్యార్థుల లేఖ
 
 సాక్షి, గుంటూరు: ‘మొగుడితో గడపడానికైతే టైం ఉంటుందా’ అంటూ చెప్పలేని అసభ్య పదజాలంతో సంధ్యారాణిని ప్రొఫెసర్ లక్ష్మి వేధించేదని, ఆమె వల్లే డాక్టర్ సంధ్యారాణి మృతి చెందిందని, అదే విభాగంలో పీజీ చదువుతున్న వైద్య విద్యార్థులు గుంటూరు ప్రభుత్వ వైద్య కళాశాల ప్రిన్సిపాల్‌కు లేఖ రాశారు. డాక్టర్ సంధ్యారాణి మృతిచెందిన నాలుగు రోజులకే అంటే గత నెల 27న 23 మంది పీజీ వైద్య విద్యార్థులు ఈ లేఖలో తమ ఆవేదనను, సంధ్యారాణికి జరిగిన అన్యాయం గురించి వివరించారు. సంధ్యారాణిని ఉద్దేశించి లక్ష్మి చేసిన పరుష వ్యాఖ్యలను వారు అందులో ప్రస్తావించారు.

Advertisement
Advertisement