జగన్‌కు ఫస్ట్‌ ఎయిడ్‌ నిర్వహించిన డాక్టర్‌ స్వాతి ఆవేదన! | Sakshi
Sakshi News home page

రిపోర్టు పేరుతో దుష్ప్రచారం

Published Sun, Oct 28 2018 5:04 AM

Propaganda in the name of report - Sakshi

సాక్షి ప్రతినిధి, విశాఖపట్నం: తనపై కొన్ని మీడియా సంస్థలు దుష్ప్రచారం చేస్తున్నాయని ప్రతిపక్ష నేత వైఎస్‌ జగన్‌కు విశాఖ ఎయిర్‌పోర్టులో ఫస్ట్‌ ఎయిడ్‌ నిర్వహించిన అపోలో మెడికల్‌ సెంటర్‌ డాక్టర్‌ కె.లలితాస్వాతి ఆవేదన వ్యక్తం చేశారు. ‘జగన్‌పై అటాక్‌ చేశారు.. వెంటనే రావాలని ఎవరో యువకులు పరుగుపరుగున రావటంతో స్టెతస్కోపు, బీపీ మెషీన్‌ పట్టుకుని వెంటనే అక్కడికి వెళ్లా. జగన్‌ ధరించిన తెల్ల చొక్కా మొత్తం రక్తసిక్తం కావడంతో భయపడ్డా.. ఆయన ఓపిగ్గా జాగ్రత్త తల్లీ.. అని చెప్పారు. నేను సీఐఎస్‌ఎఫ్‌ సిబ్బంది నుంచి ఫస్ట్‌ ఎయిడ్‌ లోషన్‌ తీసుకుని ఫస్ట్‌ ఎయిడ్‌ మాత్రమే చేశా. ఎటువంటి ట్రీట్‌మెంట్‌ చేయలేదు. సుమారుగా 0.5 సెంటీమీటర్‌  మేర కత్తి దిగిందని రిపోర్టులో ఇచ్చా.

గాయం లోతు అంతకన్నా ఎక్కువ ఉండవచ్చనే భావించా. రిపోర్టు కూడా పోలీసులు వచ్చి వెంటనే కావాలని ఒత్తిడి చేస్తే హడావుడిలో రాసిచ్చేశా. కానీ ఆ రిపోర్ట్‌ను పట్టుకుని కొన్ని చానెళ్లు,  నాయకులు తప్పుడు ప్రచారానికి దిగారు’ అని డాక్టర్‌ స్వాతి ఆవేదన వ్యక్తం చేశారు. కాగా, తాను ఫ్రెండ్‌తో ఫోన్‌లో మాట్లాడుకున్న విషయాలను కూడా రికార్డ్‌ చేసి చానెళ్లలో తమకు అనుకూలంగా చూపించారని స్వాతి పేర్కొన్నారు. 0.5 సెం.మీ.పైన కత్తి గాయమైనప్పటికీ.. ఆ కత్తికి విష రసాయనాలు ఏమైనా ఉన్నాయేమోనని మరింత లోతు చేసి కుట్లు వేస్తారు. హైదరాబాద్‌లో డాక్టర్లు అదే చేశారు. కానీ నేనేదో పక్కాగా 0.5 సెంటీమీటర్‌ మాత్రమే గాయమైందని ధృవీకరించినట్టుగా వక్రీకరించారు..’అని స్వాతి వాపోయారు.

Advertisement
Advertisement