24న రాహుల్ పర్యటన | Sakshi
Sakshi News home page

24న రాహుల్ పర్యటన

Published Fri, Jul 10 2015 2:49 AM

Rahul gandhi tour on 24th

అనంతపురం అర్బన్ : ఏఐసీసీ ఉపాధ్యక్షుడు రాహుల్‌గాంధీ ఈ నెల 24న జిల్లాలో పర్యటించనున్నట్లు పీసీసీ అధ్యక్షుడు రఘువీరారెడ్డి తెలిపారు. నల్లమాడ నుంచి ఓడీచెరువు వరకు పాదయాత్ర నిర్వహిస్తారని వెల్లడించారు. గురువారం నగరంలోని మడకశిర భవన్‌లో రఘువీరా డీసీసీ అధ్యక్షుడు కోటా సత్యనారాయణతో కలిసి రాహుల్ పర్యటన వివరాలను వెల్లడించారు.
 
  రాహుల్ దేశవ్యాప్తంగా పర్యటిస్తూ గ్రామీణ పరిస్థితులు, రైతులు, డ్వాక్రా మహిళలు, ఉపాధి కూలీల కష్టాల గురించి తెలుసుకుంటున్నారని, అందులో భాగంగా జిల్లాకు వస్తున్నారని తెలిపారు. పాదయాత్రతో పాటు జిల్లాలో ఆత్మహత్య చేసుకున్న రైతు, చేనేత కుటుంబాలతో  ఒకచోట మాట్లాడి.. వారికి ఆర్థికసాయం అందజేస్తారన్నారు. డ్వాక్రా మహిళలు, ఉపాధి హామీ కూలీల కష్టాలను కూడా తెలుసుకుంటారన్నారు. వలస కుటుంబాల్లో మిగిలిన పిల్లలు, వృద్ధులతోనూ మాట్లాడతారన్నారు.
 
 ఫోజులు కాదు.. నీరివ్వాలి
 ప్రాజెక్టులకు నీరు తేకుండా వాటి వద్ద నిలబడి ఫొటోలకు ఫోజులివ్వడం చంద్రబాబుకు అలవాటని రఘువీరా విమర్శించారు. హంద్రీ -నీవా విషయంలోనూ ఇదే కనిపిస్తోందన్నారు. ‘ఈ ప్రాజెక్టు పూర్తి చేసి ఈ ఏడాది ఆగస్టుకు జిల్లాకు నీరు ఇవ్వడంతో పాటు చిత్తూరు జిల్లాకూ తీసుకెళతామని చెప్పారు.
 
 ఇప్పటి వరకు ఇంచు పనులు జరగలేదు. ఇప్పుడేమో వచ్చే ఏడాదికి ఇస్తామంటున్నారు. ఈ ఏడాదిలో ప్రభుత్వం చేసింది హంద్రీ-నీవాకు అనంత వెంకటరెడ్డి పేరును తొలగించడమొక్కటే. పేర్లు మార్చినా, వేరే పేర్లు పెట్టుకున్నా వచ్చే నష్టమేమీ లేదు. జిల్లాకు నీరిస్తే చాల’ని హితవు పలికారు. సమావేశంలో మాజీ ఎమ్మెల్యే నాగరాజరెడ్డి, పార్టీ నగర అధ్యక్షుడు దాదాగాంధీ, ఐఎన్‌టీయూసీ జిల్లా అధ్యక్షుడు కేవీరమణ, ఇతన నాయకులు పాల్గొన్నారు.

Advertisement

తప్పక చదవండి

Advertisement