రేషన్ మాఫియా! | Sakshi
Sakshi News home page

రేషన్ మాఫియా!

Published Sun, Jan 18 2015 3:20 PM

ration mafia

కర్నూలు: రేషన్ దుకాణాలను అధికార పార్టీ నాయకులు తన్నుకుపోతున్నారు. అధికారులపై తీవ్ర ఒత్తిడి తీసుకొచ్చి నిబంధనలను తోసిరాజని ఇష్టానుసారంగా తమ అనుయాయులకు కేటాయించుకుంటున్నారు. ఇదే అదనుగా రేషన్ మాఫియా చెలరేగిపోతోంది. పేదలకు దక్కాల్సిన సబ్సిడీ సరుకులను బ్లాక్‌మార్కెట్‌కు తరలిస్తున్నారు.

రాయితీ సరుకులను అక్రమంగా సేకరించి అధిక ధరలకు విక్రయిస్తూ సొమ్ము చేసుకుంటున్నారు. జిల్లా ఉన్నతాధికారులు ఉండే పట్టణ కేంద్రాల్లోనే యథేచ్ఛగా రేషన్ సరుకులు బ్లాక్‌మార్కెట్‌కు తరలిపోతున్నాయి. రేషన్ సరుకులను అక్రమంగా సేకరిస్తున్న రేషన్ మాఫియా ఇప్పుడు చౌకధరల దుకాణాలపై కన్నేసింది. భారీ మామూళ్లు ఇచ్చి ప్రజాప్రతినిధులు, అధికారులను తమ గుప్పెట్లోకి తీసుకుని ప్రజాపంపిణీ వ్యవస్థపై పెత్తనం చెలాయిస్తున్నారు. అందులో భాగంగానే ఇటీవల కర్నూలు జిల్లాలో దాదాపు 100కు పైగా చౌక ధరల దుకాణాలను నిబంధనలకు  విరుద్ధంగా కేటాయింపులు చేయడంలో ఈ మాఫియా సఫలీకతమైంది.

 ఇదీ అసలు కథ...

 కర్నూలు జిల్లా వ్యాప్తంగా 2,411 చౌకధరల దుకాణాలు ఉన్నాయి. అవకతవలకు పాల్పడిన కొం దరు రేషన్ డీలర్లను గతంలో ప్రభుత్వం సస్పెండ్ చేసింది. ఇలా ఆదోని, ఆలూరు, పత్తికొండ, డోన్, కోడుమూరు, బనగానపల్లె, నందికొట్కూరులో పలు చౌకధరల దుకాణాలపై 6ఎ కేసులు నమోదు చేశారు. వీటిని సమీపంలోని కొందరు డీలర్లకు అప్పగించారు. ఇప్పుడు వారిని ఆ బాధ్యతల నుంచి తప్పించి తాత్కాలిక ప్రాతిపదికన కొత్తవారికి అప్పగించారు. రేషన్ మాఫియా సిఫార్సు చేసిన వారికి వీటిని కేటాయించారు. అయితే రేషన్ దుకాణాలకు తాత్కాలిక కేటాయింపులు చేయవద్దని ఉత్తర్వులు ఉన్నాయి. వాటిని పక్కన పెట్టి ఇటీవల వంద మందికి అక్రమంగా దుకాణాలు కట్టబెట్టారు. ఈ వ్యవహారంలో పెద్ద ఎత్తున సొమ్ము చేతులు మారినట్లు ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. ఒక్కో రేషన్ దుకాణం కోసం రూ. లక్షలు వసూలు చేసినట్లు తెలుస్తోంది. ప్రజాప్రతినిధులకు ఈ మలికి అంటించినట్లు ఆరోపణలున్నాయి. రేషన్ మాఫియాకు అధికారులు, ప్రజాప్రతినిధులు ఇలా తలొగ్గితే ప్రజాపంపిణీ వ్యవస్థ పూర్తిగా భ్రష్టుపట్టే ప్రమాదం ఉంది. వాస్తవంగా చౌకధరల దుకాణాల కేటాయింపు అధికారం ఆర్డీవోలకు ఉంది. వీటికి నోటిఫికేషన్ ఇచ్చి రోస్టర్‌ను అనుసరించి భర్తీ చేయాల్సి ఉంటుంది. అంతేకానీ తాత్కాలిక ప్రాతిపదికన కేటాయించకూడదు. కానీ కర్నూలు జిల్లాలో పదుల సంఖ్యలో దుకాణాలను తాత్కాలిక ప్రాతిపదికన కేటాయిస్తూ ఆర్డీవోలు ఉత్తర్వులు ఇచ్చినట్లు సమాచారం. దీనికి కొత్త రంగు పులిమారు. 6ఎ కేసుల్లో ఉన్న ఈ ఐదు దుకాణాల నుంచి తమకు సరుకులు సక్రమంగా అందడంలేదని, దూరంగా వెళ్లి తెచ్చుకోవాల్సి వస్తోందని లబ్ధిదారుల నుంచి ఫిర్యాదులు అందినట్లు సృష్టించి, ఈ సాకుతో తాత్కాలిక ప్రాతిపదికన చౌకధరల దుకాణాలు కేటాయించారు. దీనిపై దుమారం రేగుతోంది.

 అంతా బహిరంగమే...

 జిల్లాలో ప్రతీ నెలా రేషన్ దుకాణాల నుంచి బియ్యాన్ని సేకరించి, ఇతర ప్రాంతాలకు తరలిస్తున్నా.. కిరోసిన్‌ను ఆటోలకు, లారీలకు అధిక ధరలకు బహిరంగంగా విక్రయిస్తున్నా మాఫియా ఆగడాలను అడ్డుకునేవారే లేరు. కర్నూలు నగరంలోనూ, జాతీయ రహదారిపైనా ఇదే పరిస్థితి. రేషన్ బియ్యంను డీలర్ల నుంచి కిలో రూ. 10 కొనుగోలు చేస్తూ, వీరు మాత్రం బయట రూ. 15 నుంచి రూ. 20 వరకు విక్రయిస్తున్నారు. ఇలా ప్రతీ నెలా రూ. లక్షల్లో సంపాదిస్తున్నారు. కిరోసిన్‌ది ఇదే పరిస్థితి. దీనికి ప్రజాప్రతినిధుల సహకారం తీసుకుంటున్నారు. రేషన్ డీలర్లు విధిగా వారి వద్ద ఉన్న సరుకులను రేషన్ మాఫియాకే విక్రయించాలని, లేకపోతే కేసులు పెట్టిస్తామని బెదిరింపులకు పాల్పడుతున్నారు. పేదలకు చెందాల్సిన బియ్యం, కిరోసిన్‌ను బోగస్ కార్డులు, తూకాల్లో తేడాలతో కొందరు డీలర్లు మిగుల్చుకుంటున్నారు. వీటిని రేషన్ మాఫియాకు విక్రయిస్తున్నారు. ఇదంతా కళ్లెదుటే జరుగుతున్నా అధికారయంత్రాంగం పట్టించుకోవడం లేదు. రేషన్ దుకాణాల్లో తనిఖీలు కూడా చేయడం లేదు.

 తూకాల్లో తేడా..?

 రేషన్ దుకాణాల్లో సరుకులు సరైన తూకంతో అందించడంలేదని లబ్ధిదారులు ఆరోపిస్తున్నారు. చాలా దుకాణాల్లో ప్రతీనెలా 3 క్వింటాళ్ల వరకు బియ్యం మిగుల్చుకుంటున్నారని ఆరోపణలు ఉన్నాయి. మిగతా సరుకులది అదే పరిస్థితి. కర్నూలు, నందికొట్కూరు, బనగానపల్లె తదితర చోట్ల రేషన్ దుకాణాల నుంచి ప్రతీనెలా సరుకులను సేకరించడానికి మాఫియా ప్రాంతాలను పంచేసుకున్నారు. ఇటు డీలర్లు, మాఫియా చేసేది అక్రమమైనా అధికార యంత్రాంగం మాత్రం వారిచ్చే మామూళ్లు తీసుకుంటూ నిద్ర మత్తులో జోగుతోంది.
 
 
 

Advertisement
Advertisement