మంత్రి అనుచరులా..మజాకా! | Sakshi
Sakshi News home page

మంత్రి అనుచరులా..మజాకా!

Published Tue, Oct 16 2018 11:21 AM

Red Sand  Mafia in TDP leaders - Sakshi

మహానంది: ఎర్రమట్టి మాఫియాతో ప్రజలకు ముప్పు పొంచి ఉంది. మంత్రి అఖిలప్రియతో పాటు ఆమె తండ్రి దివంగత భూమా నాగిరెడ్డి స్టిక్కర్లతో ఉన్న వాహనాలు అతివేగంగా వెళ్తూ ప్రజలను భయభ్రాంతులకు గురిచేస్తున్నాయి. మహానంది మండలం గాజులపల్లి అంకిరెడ్డిచెరువు వద్ద తాజాగా ఎర్రమట్టి రవాణా చేస్తున్న నేపథ్యంలో మంత్రి అఖిలప్రియ స్టిక్కర్లతో ఉన్న వాహనాలు ఇక్కడ హల్‌చల్‌ చేస్తున్నాయి. రెండురోజులుగా వీటిలో కొందరు అక్కడా ఇక్కడా తిరుగుతూ భయాందోళనలు çసృష్టిస్తున్నారు. 

ఆదివారం సాయంత్రం రెండు స్కార్పియోల్లో కొందరు హారన్స్‌ మోగిస్తూ అతివేగంగా వెళ్లడం విమర్శలకు దారితీసింది. ఈ క్రమంలోనే గాజులపల్లె మెట్ట వద్ద ఓ చిన్నారి రోడ్డు దాటుతుండగా ప్రమాదం త్రుటిలో తప్పింది. అలాగే గ్రామానికి చెందిన ఎమ్మెల్యే వర్గీయుడి ఇంటి ముందుకు రాగానే.. హారన్‌ కొడుతూ వేగంగా వెళుతుండటం పట్ల విమర్శలు వ్యక్తమయ్యాయి.  మంత్రి అండదండలు ఉన్నాయన్న ధైర్యంతోనే ఇలా చేశారని గ్రామస్తులు చర్చించుకుంటున్నారు. అదే వాహనంలో సోమవారం సైతం అటూ ఇటూ తిరుగుతూ తాము మంత్రి మనుషులమని మరోసారి ప్రజలకు తెలిసేలా ప్రవర్తించారు. 

Advertisement
Advertisement