'బంగారం వేలంపాటలను ఆపమని కోరాం' | Sakshi
Sakshi News home page

'బంగారం వేలంపాటలను ఆపమని కోరాం'

Published Wed, Jun 18 2014 8:10 PM

'బంగారం వేలంపాటలను ఆపమని కోరాం' - Sakshi

హైదరాబాద్: పంట రుణాల వసూలు చర్యలు నిలిపేయలేమని ఆంధ్రప్రదేశ్ సీఎం చంద్రబాబుకు బ్యాంకర్లు తేల్చిచెప్పారు. రైతులకు నోటీసులు, బంగారం వేలంపాటలను ఆపలేమని స్పష్టం చేశారు. పంటల రుణమాఫీపై రాష్ట్ర ప్రభుత్వం ఇంతవరకు స్పష్టత ఇవ్వలేదన్నారు. రుణమాఫీ ఏ సంవత్సరం నుంచి వర్తిస్తుందో చెప్పలేదని అన్నారు. ఈ మధ్యాహ్నం చంద్రబాబుతో బ్యాంకర్లు సమావేశమయ్యారు. రుణమాఫీపై విస్తృతంగా చర్చించారు. సర్కారు తకరారు ధోరణిని ఈ సమావేశంలో బ్యాంకర్లు ప్రస్తావించారు.

రైతులకు నోటీసులు జారీ, బంగారం వేలంపాటలను ఆపమని కోరామని, అది సాధ్యంకాదని బ్యాంకర్లు చెబుతున్నారని ఆంధ్రప్రదేశ్‌ వ్యవసాయశాఖ మంత్రి పత్తిపాటి పుల్లారావు తెలిపారు. రుణమాఫీపై స్పష్టత ఇస్తేనే నోటీసులు ఆపుతామన్నారని వెల్లడించారు. ఈ నెల 22 తరువాత రుణమాఫీపై పూర్తి స్పష్టత వస్తుందన్నారు. రిజర్వ్‌ బ్యాంక్‌, కేంద్ర ప్రభుత్వం రుణమాఫీకి అంగీకరించడంలేదని వాపోయారు. కాని హామీని అమలుచేస్తామని చెప్పారు. రుణాలు సక్రమంగా చెల్లించిన వారికి కూడా న్యాయం చేయాలనే అలోచన చేస్తున్నామని మంత్రి తెలిపారు.

Advertisement
Advertisement