అంతా నాలుగు రోజుల్లోనే.. | Sakshi
Sakshi News home page

అంతా నాలుగు రోజుల్లోనే..

Published Sun, Jul 26 2015 1:40 AM

Responded to ultimatum the opposition leader Jagan Mohan Sarkar

- ప్రతిపక్ష నేత జగన్‌మోహన్‌రెడ్డి అల్టిమేటంతో స్పందించిన సర్కార్
- బంద్ హెచ్చరికతో దిగొచ్చిన వైనం
విజయవాడ సెంట్రల్ :
మున్సిపల్ ఔట్‌సోర్సింగ్ కార్మికుల సమ్మె అంశంలో నాలుగు రోజుల్లోనే అద్భుతం జరిగింది. నాలుగు రోజుల్లో విధుల్లో చేరకుంటే కాంట్రాక్ట్ రద్దు చేస్తామంటూ ప్రభుత్వం డ్వాక్వా, సీఎంఈవై కాంట్రాక్టర్లకు ఈనెల 22న నోటీసులు జారీ చేసింది. దీనిపై వైఎస్సార్ సీపీ అధినేత, శాసనసభలో ప్రతిపక్ష నేత వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి తీవ్రంగా స్పందించారు.

నాలుగు రోజుల్లో సమస్యను పరిష్కరించకుంటే రాష్ట్రబంద్ తప్పదని ప్రభుత్వానికి ఈనెల 23వ తేదీన అనంతపురం జిల్లా కంబదూర్ మండలం తిమ్మాపురం నుంచి అల్టిమేటం ఇచ్చారు. జగన్ ఇచ్చిన భరోసా కార్మిక వర్గానికి ఊపిరులూదింది. 24న చేపట్టిన కలెక్టరేట్ల ముట్టడి విజయవంతం కావడానికి దోహదపడింది. దీంతో కంగుతిన్న సర్కార్ యూనియన్ నాయకుల్ని చర్చలకు ఆహ్వానించింది.
 
దిగిరాక తప్పలేదు
ఈనెల 17న బందరురోడ్డులోని గేట్‌వే హోటల్‌లో ట్రేడ్ యూనియన్ నాయకులు ముఖ్యమంత్రి చంద్రబాబును కలిశారు. కార్మికుల సమస్యల్ని పరిష్కరించాల్సిందిగా కోరగా, సీఎం ససేమిరా అన్నారు. కార్మికులకు ఇవ్వడానికి ప్రభుత్వం వద్ద డబ్బులు ఉండాలి కదా అంటూ వెటకారంగా మాట్లాడారు. ఈ నేపథ్యంలో కార్మికులు పోరాటాన్ని ఉధృతం చేశారు. వైఎస్సార్ సీపీ ట్రేడ్ యూనియన్ రాష్ట్ర అధ్యక్షుడు పి.గౌతమ్‌రెడ్డి పోరాటంలో కీలక భూమిక పోషించారు.
 
మెడలు వంచాం..
వైఎస్సార్ సీపీ అధినేత, ప్రతిపక్ష నేత వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి ఇచ్చిన రాష్ట్ర బంద్‌తో సర్కార్ దిగిరాక తప్పలేదు. మొండిపట్టు వీడి జీతాల పెంపుదలకు అంగీకరించింది. ప్రభుత్వం మెడలు వంచిన ఘనత జగన్‌కే దక్కుతుంది. కార్మికుల పోరాటానికి వైఎస్సార్ సీపీ మొదటి నుంచి వెన్నుదన్నుగా నిలిచింది. ఇది సమష్టి విజయం. ఇప్పటికైనా ముఖ్యమంత్రి చంద్రబాబు తీరు మార్చుకోవాలి. ఉద్యోగ, కార్మికుల సమస్యలపై సానుకూల ధోరణిలో వ్యవహరిస్తే మంచిది.
- బీఎన్ పుణ్యశీల, వైఎస్సార్ సీపీ ఫ్లోర్‌లీడర్

Advertisement

తప్పక చదవండి

Advertisement