విశాఖపట్నం: నగరంలో ఘోర రోడ్డు ప్రమాదం సంభవించింది. మితిమీరిన వేగంతో వెళ్తున్న కారు అదుపుతప్పి రోడ్డు పక్కన ఉన్న చెట్టును ఢీకొట్టిన ఘటనలో ముగ్గురు మృతిచెందగా.. మరొకరి పరిస్థితి విషమంగా ఉంది. ఈ ప్రమాదం నగరంలోని విశాలాక్షినగర్లో ఆదివారం తెల్లవారుజామున చోటుచేసుకుంది.
మాధవధార, నాయుడుతోట, దసపల్లహిల్స్కు చెందిన నలుగురు స్నేహితులు శశాంక్ అనువాజ్, వంశీ భోగరాజు, కృష్ణ బెహ్రా, జయకిరణ్ కలిసి కారులో ప్రయాణిస్తుండగా ఈ ప్రమాదం జరిగింది. ఈ ఘటనలో కారు నుజ్జు నుజ్జు కావడంతో.. నలుగురు అందులో ఇరుక్కుపోయారు. స్థానికుల సాయంతో సమాచారం అందుకున్న పోలీసు, ఫైర్ సిబ్బంది సంఘటనా స్థలానికి చేరుకొని కట్టర్ల సాయంతో వారిని బయటకు తీశారు. అప్పటికే శశాంక్ అనువాజ్, వంశీ భోగరాజు మృతిచెందారు. మిగతా ఇద్దరిని ఆస్పత్రికి తరలిస్తుండగా.. ఒకరు మృతిచెందారు. మద్యం సేవించడంతో పాటు మితిమీరిన వేగం వల్లే ఈ ప్రమాదం జరిగినట్లు పోలీసులు అంటున్నారు.