జిల్లాలో విద్యాభివృద్ధికి రూ.213 కోట్లు | Sakshi
Sakshi News home page

జిల్లాలో విద్యాభివృద్ధికి రూ.213 కోట్లు

Published Wed, Feb 19 2014 2:09 AM

Rs.213 crore to education development in district

ఒంగోలు ఒన్‌టౌన్, న్యూస్‌లైన్ : జిల్లాలో 2014-15 ఆర్థిక సంవత్సరంలో రాజీవ్ విద్యామిషన్ (ఆర్‌వీఎం) ద్వారా విద్యాభివృద్ధి కార్యక్రమాలు చేపట్టేందుకు 213.25 కోట్ల రూపాయలతో వార్షిక కార్యాచరణ ప్రణాళిక రూపొందించారు. ఈ మొత్తంలో రాజీవ్ విద్యామిషన్ ద్వారా పాఠశాలల అభివృద్ధికి 191.73 కోట్ల రూపాయలు, 37 కస్తూరిబా గాంధీ విద్యాలయాల (కేజీబీవీల) నిర్వహణకు 21.52 కోట్ల రూపాయలు ప్రతిపాదించారు. గతానికి భిన్నంగా ఈ ఏడాది జిల్లాలోనే వార్షిక కార్యాచరణ ప్రణాళికను రూపొందించారు. గతంలో ఈ ప్రణాళికను హైదరాబాద్‌లోనే తయారు చేసి అక్కడే సమర్పించి వచ్చేవారు.

 అయితే, ఈ ఏడాది జిల్లాలోనే ప్రణాళికను రూపొందించి కలెక్టర్ ఆమోదంతో రాష్ట్రంలోనే మొట్టమొదటిసారిగా రాజీవ్ విద్యామిషన్ రాష్ట్ర ప్రాజెక్టు డెరైక్టర్ (ఎస్‌పీడీ)కి సమర్పించినట్లు జిల్లా విద్యాశాఖాధికారి, రాజీవ్ విద్యామిషన్ ప్రాజెక్టు అధికారి డాక్టర్ ఏ రాజేశ్వరరావు, రాజీవ్ విద్యామిషన్ ఏఎస్‌వో ఎన్.అంజిరెడ్డి తెలిపారు. ఈ ప్రణాళికను ఎస్‌పీడీ కార్యాలయంలో ఆమోదించాల్సి ఉంది. కేంద్ర ప్రభుత్వం రాష్ట్ర ప్రణాళికను ఆమోదించిన అనంతరం జిల్లాకు నిధులు కేటాయిస్తారు. రాజీవ్ విద్యామిషన్ ద్వారా పాఠశాలల అభివృద్ధికి కేటాయించిన నిధుల్లో సింహభాగం.. అంటే 44.77 కోట్ల రూపాయలు సివిల్ వర్కులకు కేటాయించారు.

 ఈ మొత్తంలో ప్రహరీల నిర్మాణానికి 27.22 కోట్లు, ప్రాథమిక పాఠశాలల ప్రధానోపాధ్యాయులకు ప్రత్యేకంగా హెచ్‌ఎం గదులు నిర్మించేందుకు 3.96 కోట్లు, శిథిలావస్థలో ఉన్న భవనాల మరమ్మతులకు 3.56 కోట్లు, పట్టణ ప్రాంతాల్లో మరుగుదొడ్ల నిర్మాణానికి 1.26 కోట్లు, తాగునీటికి కోటి, ప్రాథమికోన్నత పాఠశాలల హెచ్‌ఎం గదుల నిర్మాణాలకు 5.44 కోట్లు, మరమ్మతులకు 46 లక్షల రూపాయలు కేటాయించారు.

 ప్రణాళికలోని అంశాలు ఇవీ...
  జిల్లాలోని 2,63,840 మంది విద్యార్థులకు రెండు జతల యూనిఫాంలు ఉచితంగా పంపిణీ చేసేందుకు 10.55 కోట్ల రూపాయలు కేటాయిస్తూ ప్రతిపాదించారు. 1,36,666 మంది బాలికలకు 5.46 కోట్లు, ఎస్సీ బాలురు 46,442 మందికి 1.85 కోట్లు, ఎస్టీ బాలురు 10,188 మందికి 40.75 లక్షలు, దారిద్య్రరేఖకు దిగువనున్న బాలురు 70,544 మందికి 2.82 కోట్ల రూపాయలు ప్రతిపాదించారు.
  రెగ్యులర్ ఉపాధ్యాయులు, కాంట్రాక్టు ఉపాధ్యాయుల జీతాలకు 61.52 కోట్ల రూపాయలు
  మండల విద్యా వనరుల కేంద్రాల అభివృద్ధికి, రిసోర్సు పర్సన్లు, సీడబ్ల్యూఎస్‌ఎస్ రిసోర్స్ పర్సన్లు, డేటా ఎంట్రీ ఆపరేటర్లు, టీఎల్‌ఎం గ్రాంటుకు 10.56 కోట్లు, పాఠశాలల సముదాయాల అభివృద్ధికి, క్లస్టర్ కో ఆర్డినేటర్ల జీతాలకు 4.30 కోట్ల రూపాయలు
  పాఠ్య పుస్తకాలు, నోట్ పుస్తకాల కొనుగోలుకు 5.34 కోట్ల రూపాయలు
 పాఠశాలల నిర్వహణ గ్రాంటుగా 2.32 కోట్లు, మూడు తరగతులున్న 2,484 పాఠశాలలకు 1.24 కోట్లు, మూడు కంటే అదనంగా తరగతి గదులున్న 1,079 పాఠశాలలకు 1.08 కోట్ల రూపాయలు
  పాఠశాల గ్రాంటుగా 2.21 కోట్లు, 3,236 ప్రాథమిక పాఠశాలలకు 1.62 కోట్లు, 849 ప్రాథమికోన్నత స్థాయి పాఠశాలలకు 59.43 లక్షలు
  ఉపాధ్యాయ గ్రాంటుగా 68.62 లక్షలు, ఈ మొత్తంలో ప్రాథమిక పాఠశాలల్లో పనిచేస్తున్న 9,180 మంది టీచర్లకు ఒక్కొక్కరికి 500 చొప్పున 46 లక్షలు, ప్రాథమికోన్నత స్థాయి పాఠశాలల్లో పనిచేస్తున్న 4,544 మంది టీచర్లకు 23 లక్షలు
  ప్రత్యేక అవసరాలు గల పిల్లలకు 3.35 కోట్లు, ఈ మొత్తంతో ఫిజియోథెరపీ శిక్షణ  కేంద్రాలు, ఉపకరణాల పంపిణీ, ఇతర కార్యక్రమాల నిర్వహణ
  బాలికా విద్య కార్యక్రమాలకు 20 లక్షలు, విద్యాహక్కు చట్టంపై శిక్షణ, అవగాహన కార్యక్రమాలకు 15 లక్షలు
  బడి బయట ఉన్న పిల్లలకు శిక్షణ ఇచ్చి వారిని రెగ్యులర్‌గా పాఠశాలల్లో చేర్పిం చేందుకు ఆర్‌ఎస్‌టీసీలు, ఎన్‌ఆర్‌ఎస్‌టీసీ లు, దూర ప్రాంతాల నుంచి పాఠశాలలకు హాజరయ్యే పిల్లలకు రవాణా ఖర్చులు చెల్లించేందుకు 5.38 కోట్ల రూపాయాలు
  ప్రాజెక్టు నిర్వహణకు 3 శాతం నిధులు (4.73 కోట్ల రూపాయలు)
  కస్తూరిబా గాంధీ బాలికా విద్యాలయాల నిర్వహణకు 21.52 కోట్ల రూపాయలు
  విద్యార్థినులకు మెస్ చార్జీలు, ఇతర వసతులకు ఒక్కొక్కరికి నెలకు 900 చొప్పున 4.80 కోట్లు, ఒక్కొక్కరికి 50 చొప్పున నెలవారీ స్టైఫండ్ చెల్లించేందుకు 26.64 లక్షల రూపాయలు
  కాంట్రాక్టు రెసిడెన్షియల్ టీచర్లు, స్పెషలాఫీసర్ల జీతాలు చెల్లించేందుకు 8.42 కోట్ల రూపయాలు
  బాలికలకు వైద్య ఖర్చులకు 33 లక్షలు, యూనిఫారాలు పంపిణీ చేసేందుకు 66 లక్షల రూపాయలు కేటాయిస్తూ ప్రతిపాదించారు.

Advertisement

తప్పక చదవండి

Advertisement