రూ. 5లక్షలు విలువ చేసే గుట్కా స్వాధీనం | Sakshi
Sakshi News home page

రూ. 5లక్షలు విలువ చేసే గుట్కా స్వాధీనం

Published Sat, Jun 20 2015 2:32 AM

Rs. 5 million worth of quid seized

ఆమదాలవలస : మండలంలోని కొత్తరోడ్ సమీపంలో శుక్రవారం రాత్రి ఆమదాలవలస సీఐ డి.నవీన్‌కుమార్ ఆధ్వర్యంలో నిర్వహించిన దాడుల్లో సుమారు రూ. 5లక్షలు విలువ చేసే గుట్కా బండిల్స్‌ను ఎస్‌ఐ కె.గోవిందరావు, పోలీసు సిబ్బంది పట్టుకున్నారు.
 
 వివరాలు ఇలా ఉన్నాయి. నరసన్నపేటకు చెందిన జామి సంతోష్, శ్రీకాకుళం మండలం గురుగుబెల్లికి చెందిన వారణాసి కృష్ణ, ఆమదాలవలసకు చెందిన గుడ్ల హరిప్రసాద్ ఒడిశా నుంచి శ్రీకాకుళానికి ప్రైవేటు బస్సులో సుమారు ఐదు లక్షలు విలువ చేసే 17 బండిల్స్ గుట్కాను తరలిస్తున్నారు. ఆమదాలవలస సీఐకు వచ్చిన సమాచారం ప్రకారం ఆయన నిఘా వేసి ఒడిశా నుంచి వచ్చిన బస్సును గమనించి కొత్తరోడ్ సమీపంలో ఆ సరుకును దింపించి వారిని అదుపులోకి తీసుకున్నామని సీఐ తెలిపారు. పట్టుపడ్డ సరుకును, వ్యక్తులను ఫుడ్ ఇన్‌స్పెక్టర్‌కు అప్పగిస్తామని సీఐ చెప్పారు. పట్టుపడ్డ బండిల్స్‌ను ప్రయివేటు ఆటోలలో ఆమదాలవలస పోలీస్‌స్టేషన్‌కు తరలించి స్టేషన్‌లో ఉంచామని సీఐ తెలిపారు.
 
 అదే విధంగా శ్రీకాకుళం ఫుడ్ ఇన్‌స్పెక్టర్ ఎస్.ఈశ్వరి ఆధ్వర్యంలో ఆమదాలవలస పట్టణంలో శుక్రవారం నిర్వహించిన దాడుల్లో రెండు దుకాణాల్లో సుమారు రూ. 17వేలు విలువ గల గుట్కాలను పట్టుకున్నామని తెలిపారు. ఆ దుకాణాల్లో అక్రమ నిల్వలు ఉన్నట్లు వచ్చిన సమాచారం మేరకు దాడులు నిర్వహించామని ఆమె తెలిపారు. నిల్వలున్న వ్యాపారులను శ్రీకాకుళం జేసీ కోర్టులో హాజరు పరుస్తామని వివరించారు.
 

Advertisement
Advertisement