విశాఖ: సీమాంధ్ర జిల్లాల్లో సమైక్య సెగలు మిన్నంటాయి. తెలంగాణ నోట్ ను కేంద్ర మంత్రి మండలి ఆమోదించడంతో సమైక్యవాదులు నిరసన కార్యక్రమాలు తీవ్రతరం చేశారు. ఇందులో భాగంగా గాజువాకలో సమైక్య కార్మికులు కదం తొక్కారు. ఈ కార్యక్రమనికి కేంద్ర, రాష్ట్ర కార్మిక సంఘ నేతలు భారీగా హాజరైయ్యారు. సమైక్యాంధ్రకు మద్దతుగా పోరాటం ఉధృతం చేయాలని కార్మిక సంఘ నేతల నిర్ణయించారు. కేంద్ర, రాష్ట్ర పరిశ్రమలను దిగ్బంధించి కేంద్రంపై ఒత్తిడి తీసుకురావాలని తీర్మానించారు. ఇదిలా ఉండగా పశ్చిమ గోదావరి జిల్లా తణుకులో చీర్ల రాదయ్య ఆధ్వర్యంలో భారీ ర్యాలీ నిర్వహించారు. ఏఐసీసీ అధ్యక్షురాలు సోనియా గాంధీ , కేంద్రమంత్రుల దిష్టిబొమ్మలు దహనం చేశారు. తణుకు ఎన్హెచ్ 16పై రాస్తారోకో నిర్వహించడంతో భారీగా వాహనాలు నిలిచిపోయాయి.
తెలంగాణ రాష్ట్ర ఏర్పాటుకు కేంద్ర కేబినెట్ ఆమోదం తెలపడాన్ని నిరసిస్తూ సీమాంధ్ర ప్రాంతంలో నిర్వహిస్తున్న బంద్ తీవ్ర ఉద్రిక్తత పరిస్థితులకు దారితీసింది. శుక్రవారం మొత్తం 13 జిల్లాల్లో నిరసన ప్రదర్శనలు, రాస్తారోకోలతో అట్టుడికిపోతున్నాయి. జనజీవనం పూర్తిగా స్తంభించిపోయింది. కొన్ని జిల్లాల్లో ఉద్యమకారులు కాంగ్రెస్ పార్టీ కార్యాలయాలు, నాయకుల క్యాంప్ ఆఫీసులపై దాడులు చేశారు. ఇళ్లను ముట్టడించేందుకు ప్రయత్నించారు. మరికొన్ని చోట్ల రాజీవ్ గాంధీ విగ్రహాలను ధ్వంసం చేశారు. పలు చోట్ల పోలీస్ వాహనాలను తగులబెట్టారు. పరిస్థితిని అదుపు చేసేందుకు పోలీసులు లాఠీచార్జ్ చేశారు.