సమైక్యం..వైఎస్సార్సీపీ లక్ష్యం | Sakshi
Sakshi News home page

సమైక్యం..వైఎస్సార్సీపీ లక్ష్యం

Published Fri, Oct 18 2013 12:20 AM

samaikyanhdra is ysrcp target

 కల్లూరు, న్యూస్‌లైన్:
 సమైక్యాంధ్ర కోసం తుది వరకు పోరాడుతామని వైఎస్‌ఆర్ కాంగ్రెస్ పార్టీ జిల్లా కన్వీనర్ గౌరు వెంకటరెడ్డి అన్నారు. గురువారం స్థానిక మాధవీనగర్‌లోని పార్టీ కార్యాలయం వద్ద అర్బన్ కన్వీనర్ మాజీ కార్పొరేటర్ పెరుగు పురుషోత్తంరెడ్డి ఆధ్వర్యంలో ఆటో ర్యాలీని ఆయన ప్రారంభించారు. ఈ సందర్భంగా  మాట్లాడుతూ.. సమైక్యాంధ్ర కోసం పోరాడే వారికి రాజకీయ భవిష్యత్ ఉంటుందన్నారు. రాష్ట్రాని నష్టం కలిగించే వాళ్లకు తగిన బుద్ధిచెప్పేందుకు ప్రజలు సిద్దంగా ఉన్నారని వివరించారు.
 
  కాంగ్రెస్, టీడీపీ ప్రజాప్రతినిధులు ఢిల్లీలో ఒక మాట, రాష్ట్రంలో మరొక మాట చెబుతూ ప్రజలను మోసగిస్తున్నారని మండిపడ్డారు. పార్టీ ఆధ్వర్యంలో హైదరాబాద్‌లో జరిగే సమైక్య శంఖారావం బహిరంగ సభకు సమైక్యవాదులు అధిక సంఖ్యలో తరలిరావాలని పిలుపునిచ్చారు. సమైక్య శంఖారావం సభకు అనుమతి ఇవ్వకుండా అడ్డుకోవాలని అధికార పార్టీ చూసిందన్నారు. ఎవరు ఎన్ని అడ్డంకులు సృష్టించినా సమైక్య శంఖారావం విజయవంతమవుతుందన్నారు. సమైక్య ఉద్యమాలకు వెన్నుపోటు పొడిస్తే సహించేది లేదన్నారు. కార్యక్రమంలో పార్టీ నాయకులు సంజన్న,బిదురుకోట శివుడు, మద్దయ్య,  పాతపాడు శ్రీనాథ్, జరపట అంజి, మద్దయ్య, ముర్తుజావలి, మధు, రాజు, సుంకన్న తదితరులు పాల్గొన్నారు.

Advertisement
Advertisement