కాసులు రాల్చుతున్న ఇసుక | Sakshi
Sakshi News home page

కాసులు రాల్చుతున్న ఇసుక

Published Wed, Nov 25 2015 11:37 PM

కాసులు రాల్చుతున్న ఇసుక

జోరుగా అమ్మకాలు
రికార్డు స్థాయిలో ఖజానాకు పాతిక కోట్లు ఆదాయం
బడాబాబులకు కోరుకున్నంత సామాన్యులకు అందనంత
సంఘాలకు దక్కింది అంతంత

 
ఇసుక.. ఖజానాకు కాసుల వర్షం కురిపించింది. వేలం పాటలు నిర్వహించిన ప్పుడు కూడా ఇంత  ఆదాయం రాలేదు. గతంలో ఏనాడు నాలుగైదుకోట్లే మించి ఆదాయం వచ్చిన దాఖలాలులేవు. కేవలం పది నెలల కాలం ఒక్క విశాఖ జిల్లా నుంచే ఏకంగా పాతిక కోట్ల ఆదాయం ఖజానాకు చేరింది.
 
విశాఖపట్నం: ఇసుక రీచ్‌ల నిర్వహణ..అమ్మకాలను డ్వామా నుంచి గ్రామీణాభివృద్ధి శాఖకు అప్పగించి రెండేళ్లు కావస్తోంది. జిల్లాలో పదేళ్ల తర్వాత రీచ్‌లకు డీనోటిఫై చేసి ఏడాది కావస్తోంది. ప్రారంభించిన 25 రీచ్‌లలో 20 రీచ్‌ల్లో ఇసుక నిల్వలు అడుగంటాయి. మరో పక్క డిమాండ్‌ను దృష్టిలో పెట్టుకొని పొరుగు జిల్లాల నుంచి ఇసుకను ప్రత్యేకంగా రప్పించి మరీ డిపోల ద్వారా విక్రయాలు సాగిస్తున్నారు. ఒక పక్క ఇసుక కొరత.. మరో పక్క కొండెక్కిన ధరలతో సామాన్యులకు అందనంత దూరంలో ఇసుక రేణువులుంటే.. ఆరంభం నుంచి సిఫార్సులుంటేచాలు బడాబాబులకు కోరుకున్నంత ఇసుకవారి చెంతకు చేరుతూనే ఉంది. ఇలా వివాదాల నడుమ ఇసుక అమ్మకాలు మాత్రం జోరుగా సాగుతూనే ఉన్నాయి. అధికారిక లెక్కల ప్రకారం ఇప్పటివరకు ఇసుక అమ్మకాల ద్వారా ఖజానాకు రూ. పాతిక కోట్ల ఆదాయం వచ్చి చేరింది. జిల్లాలో డీనోటిఫై చేసిన 25 రీచ్‌ల్లో 4,47,605 క్యూబిక్‌మీటర్ల ఇసుక ఉంటుందని అంచనా వేశారు. ప్లెయిన్ ఏరియాలో 20 రీచ్‌ల ద్వారా 2,46,465 క్యూ.మీ. ఇసుకను వెలికి తీశారు.

ఏజెన్సీ పరిధిలోని నాలుగు ప్రధాన రీచ్ ల  ద్వారా 2,23, 818 క్యూ.మీ ఇసుకను వెలికి తీశారు. వీటి అమ్మకాల ద్వారా 13.50 కోట్ల ఆదాయం వచ్చింది. ఇంకా ప్లెయిన్ ఏరియాలో రీచ్‌ల వద్ద 27,621 క్యూ.మీ, ఏజెన్సీ ప్రాంత రీచ్‌ల వద్ద 36,492 క్యూ.మీ. ఇసుక కోసం పెండింగ్ ఆర్డర్లు ఉన్నాయి. ఆరిలోవ డిపో ద్వారా ఇప్పటివరకు 65వేల క్యూ.మీ, ఆనంద పురంలోని జిల్లా సమైక్య డిపో  ద్వారా మరో 75వేల క్యూ.మీ. ఇసుకను విక్రయించారు. ఇక సీజ్ చేసిన ఇసుకను పద్మనాభం వద్ద డిపో ద్వారా 8,995 క్యూ.మీ, కశింకోట వద్ద 48 క్యూ.మీ  స్టీల్‌ప్లాంట్ డిపో వద్ద 8వేల క్యూ.మీ. మేర అమ్మకాలు సాగించారు. ఈ అమ్మకాల ద్వారా రూ.12 కోట్ల ఆదాయం వచ్చింది.
 

Advertisement

తప్పక చదవండి

Advertisement