ఇసుక ఇక్కట్లు | Sakshi
Sakshi News home page

ఇసుక ఇక్కట్లు

Published Thu, Oct 16 2014 1:12 AM

ఇసుక ఇక్కట్లు - Sakshi

 కొవ్వూరు:కొవ్వూరు మండలం వాడపల్లిలో డ్వాక్రా సంఘాల ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న ర్యాంపు నుంచి ఇసుక రవాణాకు బుధవారం మార్గం సుగమమైంది. ఈనెల 10న గనులు, మహిళా, శిశు సంక్షేమ శాఖ మంత్రి పీతల సుజాత ఈ ర్యాం పును లాంఛనంగా ప్రారంభించారు. లారీలను సమకూర్చకపోవడంతో ఇప్పటివరకూ ఇసుక రవాణా మొదలుకాలేదు. ఈ పరిస్థితుల నేపథ్యంలో ‘బుకింగే.. డెలివరీ లేదు’ శీర్షికన బుధవారం ‘సాక్షి’లో కథనం ప్రచురితం కావడంతో అధికారులు ఐదు లారీలను పురమాయించారు. దీంతో ర్యాంపు నుంచి ఇసుక రవాణాకు అవకాశం ఏర్పడింది.
 
 అందాకా.. ఆగాల్సిందే
 ఇసుక రవాణాకు అధికారులు ఏర్పాట్లు చేసినప్పటికీ కొనుగోలుదారులకు ఇప్పట్లో ఇసుక అందే పరిస్థితి కనిపించడం లేదు. ఆర్‌డ బ్ల్యూఎస్, పంచాయతీరాజ్ శాఖల ఆధ్వర్యంలో చేపట్టిన పనుల నిమిత్తం 200 యూనిట్ల ఇసుకను ఆయూ శాఖల అధికారులు కలెక్టర్ ద్వారా బుక్ చేసుకున్నారు. దీంతోపాటు వివిధ శాఖల ఆధ్వర్యంలోనూ అనేక పనులు చేపట్టనున్నారు. ఆయూ పనులకు ఇసుకను తరలించిన తరువాతే ప్రైవేటు వ్యక్తులకు కేటాయిస్తామని అధికారులు చెబుతున్నారు. జిల్లావ్యాప్తంగా బుధవారం సాయంత్రానికి సుమారు 500 యూనిట్ల (250 లారీలు) ఇసుక కోసం ప్రైవేటు వ్యక్తులు మీ సేవా కేంద్రాల్లో సొమ్ము చెల్లించారు. గడచిన ఐదు రోజుల నుంచి ఇప్పటివరకు ర్యాంపు నుంచి కేవలం 70 యూనిట్ల ఇసుక మాత్రమే సేకరించారు. డిమాం డ్‌కు తగినట్టుగా తవ్వకాలు సాగడం లేదు.
 
 ఒకటే ర్యాంప్
 జిల్లాలో గోదావరి తీరం వెంబడి 16 ఇసుక ర్యాంపుల్ని తెరిచేందుకు కేంద్రం నుంచి పర్యావరణ అనుమతులు రావాల్సి ఉంది. అప్పటివరకు ర్యాంపులు అందుబాటులోకి వచ్చే అవకాశం లేదు. ఈ నేపథ్యంలో వాడపల్లి సమీపంలో గోదావరి మధ్యన గల గోంగూరతిప్పలంకలో సిల్టు తొలగింపు పేరిట ప్రభుత్వం ఇసుక తవ్వకాలు చేపట్టింది. ఇక్కడి నుం చి 1.60 లక్షల క్యూబిక్ మీటర్ల ఇసుకను సేకరించాలని నిర్ణయించారు. వాగుల నుంచి సేకరించిన ఇసుక నిర్మాణాలకు అనువైనది కాదు. ఈ దృష్ట్యా గోదావరి ఇసుకకు భారీగా డిమాండ్ ఉంది. ఈ కారణంగానే నిర్మాణాలు చేపట్టిన వారంతా గోదావరి ఇసుక కోసం ఎదురుచూస్తున్నారు. అయితే, ర్యాంపులో నెలకొన్న పరిస్థితుల దృష్ట్యా ఎంత వేగంగా సేకరించినా మీ సేవ కేంద్రాల్లో సొమ్ము చెల్లించిన వారికి ఈనెలాఖరుకైనా ఇసుక అందుతుందనే నమ్మకం కలగటం లేదు.
 
 ఆరు రోజులు.. ఆరు యూనిట్లు
 ప్రభుత్వం డ్వాక్రా సంఘాల ఆధ్వర్యంలో వాడపల్లిలో ప్రతిష్టాత్మకంగా ప్రారంభించిన ఇసుక ర్యాం పునకు ఆదిలోనే హంసపాదు ఎదురైంది. ఈనెల 10న మంత్రి పీతల సుజాత చేతుల మీదుగా ఆరు యూనిట్ల ఇసుకను విక్రయించారు. ఆ తరువాత ఒక్క యూనిట్ కూడా బయటకు పంపించలేదు. ఇక్కడ ఇసుక తవ్వకాలు మందకొడిగా సాగుతున్నాయి. 11, 12 తేదీల్లో హుదూద్ తుపాను కారణంగా తవ్వకాలు చేపట్టలేదు. సోమవారం ఏడు పడవలతో 21 యూనిట్లు, మంగళవారం 14 పడవలతో 42 యూనిట్లు సేకరించారు. మొత్తంగా ఇప్పటివరకు 69 యూనిట్లు (34 లారీలు) ఇసుక సేకరిం చగా, ఆరు యూనిట్లు మాత్రమే విక్రయించారు.
 
 సీసీ కెమెరాలేవీ
 ఇసుక ర్యాంపుల్లో సీసీ కెమెరాలు ఏర్పాటు చేసి వాటిని జీపీఆర్‌ఎస్‌తో అనుసంధానం చేస్తామని అధికారులు ప్రకటించారు. వాడపల్లి ర్యాంపులో నేటికీ వాటిని ఏర్పాటు చేయలేదు. ప్రభుత్వ పనుల నిమిత్తం బుధవారం నుంచి ఇసుక తరలిస్తున్నప్పటికీ అది పారదర్శకంగా సాగుతుందో లేదోననే అనుమానాలు తలెత్తుతున్నాయి. మరోవైపు ర్యాం పులో విద్యుత్ సదుపాయం లేదు. తాత్కాలికంగా సమీపంలో ఉన్న విద్యుత్ స్తంభం నుంచి అనధికారికంగా వైరు లాగి రాత్రిపూట లైట్లు వెలిగిస్తున్నారు.
 
 స్థానికులకు ఊరట
 క్యూబిక్ మీటరు ఇసుక రూ.650 చొప్పున ధర నిర్ణరుుంచారు. ర్యాంపు నుంచి ట్రాక్టర్‌పై ఐదు కిలోమీటర్లలోపు, లారీపై 10 కిలోమీటర్లలోపు ఇసుక రవా ణా చేస్తే చార్జీలు చెల్లించాల్సిన అవసరం లేకుండా మినహాయింపు ఇచ్చారు. ఈ నేపథ్యంలో స్థానికుల నుంచి యూనిట్ ఇసుకకు లోడింగ్‌తో కలిపి రూ.2,055 చొప్పున తీసుకుంటున్నారు.
 

Advertisement
Advertisement