సాక్షి, అనంతపురం : ప్రజల సమస్యలను ప్రత్యక్షంగా తెలుసుకునేందుకు ప్రతిపక్ష నేత వైఎస్ జగన్ మోహన్ రెడ్డి చేపట్టిన ప్రజాసంకల్పయాత్రకు అనంతపురం జిల్లా వాసులు బ్రహ్మరథం పడుతున్నారు. రాజన్న బిడ్డకు ఆత్మీయ స్వాగతం పలుకుతూ, ఆయన అడుగులో అడుగు వేస్తూ బాసటగా నిలుస్తున్నారు. 38వ రోజు వైఎస్ జగన్ పాదయాత్ర ధర్మవరం నియోజకవర్గంలో కొనసాగుతోంది. ఈ సందర్భంగా టీడీపీ పాలనలో తాము ఎదుర్కొంటున్న కష్టాలు, సమస్యలను ప్రజలు...జననేతకు దారి పొడవునా చెప్పుకుంటున్నారు. వారి సమస్యలు ఓపిగ్గా వింటూ నేనున్నానని భరోసా ఇస్తూ ముందుకు సాగుతున్నారు. వైఎస్ఆర్ సీపీ అధికారంలోకి వస్తే రాజన్న రాజ్యంలో కష్టాలన్నీ తొలగిపోతాయని వైఎస్ జగన్ ధైర్యం చెబుతున్నారు. ప్రజాసంకల్పయాత్రలో ఉన్న జగన్ను ఇవాళ గొర్రెల కాపర్లు కలుసుకున్నారు. 150 గొర్రెలు కొంటే 36కి పైగా చనిపోయాయని.. వారు తమ కష్టాలను చెప్పుకున్నారు. గొర్రెలు చనిపోతే ఇన్సూరెన్స్ అందడం లేదని తెలిపారు. వారి బాధలు విన్న వైఎస్ జగన్.. త్వరలో మంచి రోజులు వస్తాయని ధైర్యం చెప్పారు.
సోమవారం ఉదయం ఆయన దర్శనమల నుంచి పాదయాత్రను ప్రారంభించారు. ఈ సందర్భంగా స్థానికులు, గ్రామస్థులు, పార్టీ నేతలు, అభిమానులు, కార్యకర్తలు పాదయాత్రలో పాల్గొన్నారు. నడిమిగడ్డపల్లి క్రాస్, బిల్వంపల్లి, నేలకోట, బుడ్డారెడ్డిపల్లి, ఏలుకుంట్ల మీదగా తనకంటివారిపల్లి వరకూ ప్రజాసంకల్పయాత్ర కొనసాగుతుంది. దారిపొడువునా వైయస్ జగన్ ప్రజలతో మమేకం అవుతున్నారు. యాత్రలో భాగంగా వైఎస్ జగన్ తనను కలిసేందుకు వచ్చిన ప్రతి ఒక్కరిని ఆత్మీయంగా పలకరిస్తున్నారు. దారి పొడువునా పంట పొలాల్లోకి వెళ్లి కూలీలు, రైతుల సమస్యలు తెలుసుకుంటున్నారు. ఉద్యోగుల ఇబ్బందులు తొలగిస్తానని హామీ ఇస్తున్నారు. దేవుడి దయ, ప్రజల అండతో త్వరలో మన ప్రభుత్వం రాబోతుందని.. అధికారంలోకి రాగానే అన్నివర్గాల వారికి న్యాయం జరిగేలా చేస్తానని రాజన్న తనయుడు మాట ఇస్తున్నారు.