సీఎం సమర్థుడు కాడా? | Sakshi
Sakshi News home page

సీఎం సమర్థుడు కాడా?

Published Sat, Jan 4 2014 2:19 AM

shabbir ali doubts on kiran kumar reddy capability

సాక్షి, హైదరాబాద్: ముఖ్యమంత్రి కిరణ్‌కుమార్‌రెడ్డి సమర్థతపై శాసనమండలిలో ఆసక్తికర చర్చ జరిగింది. శుక్రవారం రెండోసారి మండలి సమావేశాలు వాయిదా పడిన అనంతరం మంత్రులు పార్థసారథి, ఎమ్మెల్సీ షబ్బీర్‌అలీల మధ్య లాబీల్లో ముచ్చట్లు మొదలయ్యాయి. శ్రీధర్‌బాబు శాఖ ఎందుకు మార్చాల్సివచ్చిందని షబ్బీర్‌ప్రశ్నించగా... వాణిజ్య పన్నుల శాఖ రాబడి ఇటీవల త గ్గిపోయిందని, అందుకే సమర్థుడైన శ్రీధర్‌బాబుకు అప్పగించారని పార్థసారథి చెప్పారు. రాబడి పెంచే సమర్థుడు శ్రీధర్‌బాబు అయితే, ఇప్పటివరకు ఆ శాఖ ఉంచుకున్న సీఎం అసమర్థుడా? అని షబ్బీర్ ప్రశ్నించారు.
 
 మధ్యలో కలుగజేసుకున్న ఎమ్మెల్సీ పొంగులేటి... శాఖ మార్పు ప్రధానం కాదని, ఎప్పుడు మార్చారన్నది ముఖ్యమన్నారు. ఈ చర్యతో అటు సీఎం, ఇటు శ్రీధర్‌బాబు గ్రాఫ్‌లు బీభత్సంగా పెరిగిపోయాయని, ఇద్దరూ సన్నిహిత మిత్రులే కనుక మార్చుకుని ఉంటారని పార్థసారథి చెప్పారు. అలాంటిదేం లేదని, శ్రీధర్‌తో సీఎం మాట్లాడడం లేదని షబ్బీర్ చెప్పారు. ఇటీవల రాష్ట్రపతి ఎట్‌హోం విందు ఇచ్చినప్పుడు కూడా నువ్వు హుషారు ఎక్కువ చేస్తున్నావని శ్రీధర్‌బాబునుద్దేశించి సీఎం వ్యాఖ్యానించారని, తర్వాత శ్రీధర్‌బాబు ఫోన్ చేసినా లిఫ్ట్ చేయడం లేదని తెలిపారు.   అంతకుముందు పార్థసారథి మాట్లాడుతూ సీమాంధ్రకు రాజధానిని కూడా చూసుకున్నామని, విజయవాడ దగ్గర్లో నందిగామ, ఇబ్రహీంపట్నం, గుంటూరు పరిసర ప్రాంతాల్లో దాదాపు 45వేల ఎకరాల భూమి అందుబాటులో ఉందని తెలిపారు.
 

Advertisement
Advertisement