శ్రీకాకుళం, న్యూస్లైన్: మహానేత వైఎస్సార్ తనయ షర్మిల చేపట్టిన బస్సు యాత్ర ముగింపు సభ ఈ నెల 16వ తేదీ సాయంత్రం 4 గంటలకు శ్రీకాకుళం పట్టణంలో జరగనున్నట్టు నరసన్నపేట ఎమ్మెల్యే, వైఎస్సార్ సీపీ శాసనసభ పక్ష ఉప నేత ధర్మాన కృష్ణదాస్ చెప్పారు. జిల్లా పార్టీ కార్యాల యంలో గురువారం ఆయన విలేకరులతో మాట్లాడుతూ గతంలో 3,111 కిలోమీటర్ల పాదయాత్ర జరిపిన షర్మిల ప్రస్తుతం సమైక్యాంధ్ర ఉద్యమంలో ప్రజలను చైతన్యపరిచేందుకు, పార్టీ విధివిధానాలను తెలిపేందుకు బస్సు యాత్ర చేపట్టారన్నారు.
రాజాం, ఎచ్చెర్ల, టెక్కలి, శ్రీకాకుళం నియోజకవర్గాల్లో బస్సు యాత్ర ఉంటుందని, రెండు సభలు జరిగే అవకాశం ఉందని తెలిపారు. సభలు ఎక్కడెక్కడ జరుగుతాయన్న విషయమై పార్టీ ముఖ్యులతో చర్చించి ఈ నెల 14న ఖరారు చేస్తామన్నారు. వైఎస్సార్ సీపీ నేత తమ్మినేని సీతారాం మాట్లాడుతూ షర్మిల బస్సుయాత్రను విజయవంతం చేయాలని కోరారు.
సమావేశంలో పార్టీ జిల్లా కన్వీనర్ ధర్మాన పద్మప్రియ కృష్ణదాస్, యువజన విభాగం జిల్లా కన్వీనర్ హనుమంతు కిరణ్కుమార్, మహిళా విభాగం జిల్లా కన్వీనర్ బొడ్డేపల్లి పద్మజ, శ్రీకాకుళం జిల్లా నియోజకవర్గ సమన్వయకర్తలు వై.వి.సూర్యనారాయణ, వరుదు కళ్యాణి, టెక్కలి సమన్వయకర్త దువ్వాడ శ్రీనివాస్, ఆమదాలవలస నియోజకవర్గ సమన్వయకర్త కిల్లి రామ్మోహనరావు, పార్టీ నేతలు అందవరపు సూరిబాబు సంపతి రావు రాఘవరావు, ధర్మాన ఉదయ్భాస్కర్, ఎన్ని ధనుంజయ, శిమ్మ వెంకట్రావు, చింతాడ గణపతి, నక్క రామకృష్ణ తదితరులు పాల్గొన్నారు.