ఆమెకు తప్పని హింస | Sakshi
Sakshi News home page

ఆమెకు తప్పని హింస

Published Thu, Jan 30 2014 3:22 AM

She violence is wrong

హహింస నుంచి మహిళలకు రక్షణ కల్పించేందుకు కేంద్ర ప్రభుత్వం 2005లో చట్టాన్ని(43/2005) తీసుకొచ్చింది. జిల్లాలో ఈ చట్టం 2006 నుంచి అమలైంది. ఈ మేరకు గృహహింస నిరోధక చట్టం సెల్(డీవీసీ)ని జిల్లా స్త్రీ, శిశు అభివృద్ధి సంస్థ(ఐసీడీఎస్) జిల్లా కార్యాలయంలో ఏర్పాటు చేశారు.
 
 ఇందులో ప్రొటెక్టివ్ ఆఫీసర్‌గా ఐసీడీఎస్ పీడీ ముత్యాలమ్మ, లీగల్ కౌన్సిలర్‌గా న్యాయవాది జి. విజయలక్ష్మి, సోషల్ కౌన్సిలర్‌గా నర్మదతో పాటు ఒక డేటా ఎంట్రీ ఆపరేటర్, ఇద్దరు హోంగార్డులు విధులు నిర్వహిస్తున్నారు. గృహహింసకు గురై న్యాయం కోసం కొంతమంది నేరుగా పోలీస్‌స్టేషన్‌ను ఆశ్రయిస్తుండగా మరికొందరు పోలీస్‌స్టేషన్‌కు వెళితే పరువు పోతుందన్న భయంతో ఐసీడీఎస్ నిర్వహించే డీవీసీకి వస్తున్నారు. 2006 నుంచి ఇప్పటి దాకా డీవీసీకి 872 గృహహింస కేసులు వచ్చాయి.
 
 వీరికి కౌన్సెలింగ్ నిర్వహించగా 222 కేసులు రాజీకుదుర్చుకున్నాయి. 96 మంది తమ కేసులను ఉపసంహరించుకున్నారు. 402 కేసులు కోర్టుకు వెళ్లగా అందులో 270 పరిష్కారమయ్యాయి. 132 కేసులు పెండింగ్‌లో ఉన్నాయి. పెళ్లైన 50 ఏళ్లకు విడాకులు కావాలని పట్టుబట్టే వారితోపాటు వివాహమై మూడు నెలలు కాకముందే తాము విడిపోతామంటూ డీవీసీకి వస్తున్న వారూ ఉన్నారు. వీరే గాక వరకట్నం, రెండో వివాహం, భార్యాభర్తల మధ్య మనస్పర్థలు, అనుమానాలతో డీవీసీకి ఆశ్రయిస్తున్న వారు అధికంగా ఉన్నారు. అయితే అత్యధిక కేసుల్లో పోలీస్‌స్టేషన్‌లలోనే పంచాయితీ జరిపి ఇరువర్గాలను రాజీ చేసి పంపిస్తున్నారు. అక్కడ పంచాయితీ తెగకపోతేనే డీవీసీని ఆశ్రయిస్తున్నారు.
 
 ఎక్కడ చూసినా వేధింపులే..
  ఆదోని పట్టణంలో వన్, టూ, త్రీ పోలీస్ స్టేషన్‌లు ఉన్నాయి. వన్‌టౌన్‌లో మహిళా ఫిర్యాదులు 24 కాగా అందులో 19 గృహ హింస చట్టం కింద  నమోదయ్యాయి. టూ టౌన్‌లో 22 ఫిర్యాదుల్లో 14 గృహహింస కేసులు, త్రీటౌన్‌లో 13 మహిళా ఫిర్యాదులు రాగా అందులో 9 498-ఏ సెక్షన్ కింద కేసులు నమోదయ్యాయి.
 
  ఆళ్లగడ్డలో కోర్టుకు వెళ్లకుండా పోలీసులు, పెద్ద మనుషుల సమక్షంలో విడాకు పత్రాలు రాసుకున్న సంఘటనలు అత్యధికంగానే ఉన్నాయి.
 
  నంద్యాలలో రాము, అరుణ ప్రేమించి, పెళ్లి చేసుకున్నారు. పెద్దలు కూడా వీరి పెళ్లికి అంగీకరించారు. కాని కొద్దినెలల తర్వాత, అరుణ ఎలాంటి కట్నం తేలేదని, తమ సామాజిక వర్గం కాదని వివాదం రేపడంతో దంపతుల మధ్య విభేదాలు వచ్చాయి. దీంతో అరుణ పోలీస్ స్టేషన్‌ను ఆశ్రయించగా, వరకట్నం వేధింపుల చట్టం 498ఏ కేసు పెడతామని పోలీసులు చెప్పారు.  దంపతులను, వారి కుటుంబ సభ్యులను పిలిపించి అధికారులు కౌన్సెలింగ్ నిర్వహించడంతో విభేదాలు తొలిగిపోయి మళ్లీ ఒక్కటయ్యారు.
 
  అదనపు కట్నం కోసం భర్త సంజీవరాయుడు, అత్త లక్ష్మమ్మ, మామ లక్ష్మన్న వేధిస్తున్నారని ఆలూరు మండలం మొలగవళ్లి గ్రామానికి చెందిన సావిత్రమ్మ గతేడాది ఆగస్టు 9వ తేదీన ఆలూరు పోలీస్‌స్టేషన్‌లో ఫిర్యాదు చేసింది. తూతూ మంత్రంగా కేసును నమోదు చేసుకుని, సావిత్రమ్మను వేధిస్తున్న భర్త, మామ, అత్తలను రిమాండ్‌కు పంపారు. అదేవిధంగా  మొలగవళ్లి గ్రామానికి చెందిన గీతకు సంతానం లేదంటూ భర్త భీమప్ప వేధించేవాడు. దీంతో గతేడాది సెప్టెంబర్ 5వ తేదీన ఆమె  కిరోసిన్ పోసుకుని నిప్పంటించుకుంది. అప్పట్లో ఆ కేసును కూడా ఆలూరు పోలీసులు ఆలస్యంగా కేసు నమోదు చేసుకున్నారు. బాధితురాలు మృతిచెందిన తర్వాత భర్త భీమప్ప, ఆయన కుటుంబ సభ్యులను రాజీ చేసి కేసు లేకుండా చేశారన్న ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి.
 
  జొహరాపురం గ్రామానికి చెందిన సాలియాబేగం తన భర్త ప్రభుత్వ ఉద్యోగి అయిన ఇలియాస్‌పై వేధింపుల కేసు నమోదు చేసింది. పోలీసులు ఆ కేసులో నిర్లక్ష్యం వహించారు. చివరకు ఆమె కుటుంబ సభ్యులతో కలిసి జిల్లా ఎస్పీని ఆశ్రయించింది. తప్పని పరిస్థితుల్లో ఆస్పరి పోలీసులు గతేడాది సాలియాబేగం ఇచ్చిన ఫిర్యాదు మేరకు భర్తను అరెస్ట్ చేశారు.
  క్రిష్ణగిరి మండలంలో ఫ్యాక్షనిస్టులే శాసనకర్తలుగా వ్యవహరిస్తున్నారు. మండలంలో 36 గ్రామాలు ఉండగా 26 గ్రామాలలో ఫ్యాక్షన్ ఉంది.  వర్గ నాయకులు జోక్యంతో చట్టాలు నీరు గారుతున్నాయి.
 
  పత్తికొండలో పోలీసుల రికార్డుల ఆధారంగా 28 వేధింపుల కేసులు నమోదయ్యాయి. వీటిలో 18 కేసులు కోర్టు ద్వారా పరిష్కారం అయ్యాయి. గ్రామ పెద్దల సమక్షంలో మరికొందరు రాజీ పడ్డారు. మరో 10 కేసులు రికార్డులలోనే నడుస్తున్నాయి. ఇక్కడ పోలీస్‌సుల కంటే ముందుగా కుల సంఘాలు, దళారులు, నా యకులు ప్రత్యక్షం అవుతున్నారు. బాధితులకు అండగా నిలవాల్సిన వారే నిర్లక్ష్యం చేయడంతో మహిళలు కష్టాల నుంచి గట్టెకలేక పోతున్నారు.
 

Advertisement
Advertisement