సాక్షి, నంద్యాల: కత్తులతో హల్చల్ చేసిన టీడీపీ నేత అభిరుచి మధును ఎందుకు అరెస్ట్ చేయలేదని నంద్యాల వైఎస్సార్ సీపీ అభ్యర్థి శిల్పా మోహన్ రెడ్డి తనయుడు రవికిశోర్ రెడ్డి ప్రశ్నించారు. సూరజ్ గ్రాండ్ హోటల్ ప్రాంతంలో గురువారం జరిగిన ఘటనలో మాజీ ఎమ్మెల్సీ శిల్పా చక్రపాణిరెడ్డి సహా 8 మందిపై పోలీసులు కేసులు నమోదు చేయడాన్ని ఆయన తప్పుబట్టారు. వైఎస్సార్ సీపీ నేతలు లొంగిపోవాలని ఒత్తిడి చేయడంతో నంద్యాల టుటౌన్ పోలీస్ స్టేషన్ వద్ద ఆయన పోలీసులతో మాట్లాడారు. రౌడీషీటర్లను వదిలి వైఎస్సార్ సీపీ నాయకులను టార్గెట్ చేయడం దుర్మార్గమని రవికిశోర్ రెడ్డి పేర్కొన్నారు.
తాజాగా పోలింగ్ ముగిసిన మరుసటి రోజే గురువారం మాజీ ఎమ్మెల్సీ శిల్పా చక్రపాణి రెడ్డిపై అధికార పార్టీకి చెందిన అభిరుచి మధు ఏకంగా వేట కొడవలితో హత్యాయత్నం చేశాడు. మధు గన్మ్యాన్ శిల్పాను లక్ష్యంగా చేసుకుని రెండు రౌండ్లు కాల్పులు జరిపారు. నంద్యాల నడిరోడ్డులో కార్లతో అటకాయించి మరీ.. చక్రపాణి రెడ్డిపై హత్యాయత్నానికి పాల్పడిన వైనం మొత్తం సీసీ కెమెరాల్లో రికార్డు అయింది. ఈ తతంగమంతా పోలీసుల కళ్లెదుటే జరిగింది. రౌడీషీటర్గా ఉన్న అధికార పార్టీకి చెందిన అభిరుచి మధును పోలీసులు కనీసం వారించే ప్రయత్నం జరగకపోవడంతో పోలీసు యంత్రాంగం మొత్తం అధికార పార్టీకి కొమ్ముకాసే విధంగానే వ్యవహరించిందన్న అభిప్రాయం వ్యక్తమవుతోంది.