న్యాయం చేయండి సారూ.. | Sakshi
Sakshi News home page

న్యాయం చేయండి సారూ..

Published Tue, Jan 19 2016 1:09 AM

Sir do justice ..

అర్బన్, రూరల్ ఎస్పీలకు ఫిర్యాదుల వెల్లువ

గుంటూరు ఈస్ట్: న్యాయం చేయాలంటూ పలువురు బాధితులు సోమవారం అర్బన్, రూరల్ ఎస్పీలను ఆశ్రయించారు.  అర్బన్ ఎస్పీ సర్వ శ్రేష్టత్రిపాఠి  జిల్లా పోలీసు కార్యాలయంలోని తన చాంబర్‌లో గ్రీవెన్స్ నిర్వహించారు. మొత్తం 48 మంది నుండి ఫిర్యాదులు స్వీకరించారు. పరిశీలించి న్యాయం చేస్తామని బాధితులకు హామీ ఇచ్చారు. రూరల్ ఎస్పీ నారాయణ నాయక్ తన  కార్యాలయంలో  గ్రీవెన్స్ నిర్వహించారు. బాధితుల నుంచి ఫిర్యాదులు స్వీకరించారు. పలు సమస్యలకు స్పందించి సంబంధిత అధికారులకు ఫోన్‌లో ఆదేశాలు ఇచ్చారు.

ఇతరుల స్థలం అమ్మాడు...
రామన్నపేట యామిని టవర్స్‌లో నివాసముంటున్న జల్లెపల్లి రామకోటేశ్వరరావు తన ప్లాట్లుగా వెంచర్ మ్యాప్‌లో చూపించి పోరంబోకు స్థలాలు, ఇతరుల వెంచర్‌లలోని స్థలాలు అమ్మాడు. గత ఏడాది మేలో ఎస్పీ గ్రీవెన్స్‌లో ఫిర్యాదు చేసాం. ఎస్పీ ఆదేశాల మేరకు తాడికొండ పోలీసులు రామకోటేశ్వరావుని పిలిపించగా తప్పు ఒప్పుకున్నాడు. కానీ ఇప్పటి వరకూ ప్లాటు కానీ, డబ్బుకానీ ఇవ్వడం లేదు.  న్యాయం చేయాలి.    
 - వి.శ్రీనివాసరావు, ఉపాధ్యాయుడు, పెదపలకలూరు జెడ్పీ హైస్కూల్
 
 తనఖా పెడితే..అమ్ముకున్నాడు
 పాత గుంటూరులోని  లంకపోతుల ఉమామహేశ్వరరెడ్డి వద్ద రూ.9 లక్షలు అప్పు తీసుకుని రూ.5 లక్షలు తిరిగి చెల్లించాను.  మొదటి నుండి వడ్డీ కడుతూనే ఉన్నాను.  ఇప్పుడు మిగిలిన రూ.4 లక్షలు చెల్లిస్తామంటే డబ్బు తీసుకోక పోగా తనఖా పెట్టిన 160 గజాల స్థలం అమ్ముకున్నాడు.  న్యాయం చేయండి సారూ..
            -షేక్ అబ్దుల్ హఫీజ్, గుంటూరువారి తోట
 

Advertisement
Advertisement