హన్మకొండ, న్యూస్లైన్ : సోనియాగాంధీ జన్మదిన వేడుకలు ఘనంగా నిర్వహించాలనుకున్న కాంగ్రెస్ పార్టీకి ఎదురుదెబ్బతగిలింది. సోమవారం సోనియా జన్మదిన వేడుకల సందర్భంగా వరంగల్ జిల్లా హన్మకొండలోని డీసీసీ భవన్లో మహిళలకు చీరలను పంపిణీ చేయాలని నిర్ణయించారు. ఇందుకోసం కార్యకర్తలు ఆదివారమే పలు కాలనీల్లో మహిళలకు చీరలకు సంబంధించిన కూపన్లను పంపి ణీ చేశారు. కూపన్ చూపెడితేనే చీరలు ఇస్తారని చెప్పారు. అనుకున్నట్లుగానే సోమవారం డీసీసీ భవన్లో మంత్రి సారయ్య చేతుల మీదుగా చీరల పంపిణీ మొదలుపెట్టారు.
అంచనాకు మించి మహిళలు రావడం.. అప్పటికే రెండు గంట లకు పైగా ఎదురుచూడడంతో.. కార్యక్రమం ప్రారంభం కాగానే ఒక్కసారిగా మం త్రి మీదకు ఎగబడి చీరలను లాక్కునే ప్రయత్నం చేశారు. దీంతో తోపులాట జరిగి పలువురు కిందపడిపోయారు. చిన్న పిల్లలను తీసుకుని వచ్చిన మహిళలు నాయకులపై తిట్ల పురాణం అందుకున్నారు. రూ. 100 చీర కోసం పనిపోగొట్టుకుని వచ్చామని నాయకులపై ఆగ్రహం వ్యక్తం చేశారు. దీంతో మంత్రి అసహనంతో వెళ్లిపోయారు. అనంతరం నగర నాయకులు కొందరికి చీరలను అందజేశారు.