ప్రతిష్టాత్మకంగా ‘బడి పిలుస్తోంది’ | Sakshi
Sakshi News home page

ప్రతిష్టాత్మకంగా ‘బడి పిలుస్తోంది’

Published Thu, Jul 24 2014 12:28 AM

special programs from 25th of this month to august 2nd

కర్నూలు విద్య: ప్రభుత్వ ఆదేశాల మేరకు ‘బడి పిలుస్తోంది’ కార్యక్రమాన్ని ప్రతిష్టాత్మకంగా నిర్వహించనున్నట్లు సర్వశిక్ష అభియాన్(ఎస్‌ఎస్‌ఏ) ప్రాజెక్టు ఆఫీసర్ మురళీధర్‌రావు తెలిపారు. బుధవారం ఆయన తన చాంబర్‌లో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో మాట్లాడుతూ విద్యా హక్కు చట్టం ప్రకారం 6 నుంచి 14 సంవత్సరాల వయస్సు బడి ఈడు పిల్లలందరినీ పాఠశాలల్లో చేర్పించడమే ఈ కార్యక్రమం ఉద్దేశమన్నారు.

ఈ ఏడాది మే నెల వరకు జిల్లాలో 5,192 మంది బడి ఈడు పిల్లలు పాఠశాలలకు వెళ్లడం లేదని గుర్తించామన్నారు. 2014-5 విద్యా సంవత్సరంలో పాఠశాలలు పునఃప్రారంభమైన రోజు నుంచి ఆయా శాఖల అధికారుల సహకారంతో ఈనెల 19వ తేదీ వరకు 4,548 మంది పిల్లలను పాఠశాలల్లో చేర్పించామన్నారు. మిగిలిన 644 మంది పిల్లలను బడి పిలుస్తోందిలో భాగంగా ఈనెల 25 నుంచి ఆగస్టు 2వ తేదీ వరకు రోజు వారీ ప్రత్యేక కార్యక్రమాలతో పాఠశాలల్లో చేర్పించేందుకు చర్యలు చేపడతామన్నారు.

కార్యక్రమాన్ని అనంతపురం జిల్లాలో ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు.. జిల్లాలో ఉప ముఖ్యమంత్రి కేఈ క్రిష్ణమూర్తి శుక్రవారం సునయన ఆడిటోరియంలో ప్రారంభిస్తారన్నారు. కార్యక్రమాన్ని జయప్రదం చేసేందుకు జిల్లా స్థాయిలో కమిటీ ఉంటుందన్నారు. చైర్మన్‌గా జిల్లాలోని సీనియర్ మంత్రి, వైఎస్ చైర్మన్‌గా కలెక్టర్, సభ్యులుగా జెడ్పీ చైర్మన్, ఎంపీ, ఎమ్మెల్యే, ఎమ్మెల్సీలు, డీఈఓ, అసిస్టెంట్ లేబర్ అధికారి.. కన్వీనర్‌గా సర్వశిక్ష అభియాన్ పీఓ వ్యవహరిస్తారన్నారు. మండల స్థాయిలో ఎంఈఓ అధ్యక్షతన కార్యక్రమాలు నిర్వహిస్తామన్నారు.

Advertisement

తప్పక చదవండి

Advertisement