కలిసుంటే ఎవరికి నష్టం.. విభజిస్తే ఎవరికి లాభం? | Sakshi
Sakshi News home page

కలిసుంటే ఎవరికి నష్టం.. విభజిస్తే ఎవరికి లాభం?

Published Sun, Sep 15 2013 1:22 AM

కలిసుంటే ఎవరికి నష్టం.. విభజిస్తే ఎవరికి లాభం? - Sakshi

  • ఓట్లు, సీట్ల కోసమే కాంగ్రెస్ రాష్ట్రాన్ని విడగొట్టాలనుకుంటోంది: షర్మిల
  • రాష్ట్రాన్ని సమైక్యంగా ఉంచడమే మేలని శ్రీకృష్ణ కమిటీ చెప్పింది
  • తెలుగుగడ్డ మీద వైఎస్సార్ లాంటి సీఎం రాకూడదనే కాంగ్రెస్ కుతంత్రాలు
  • వైఎస్సార్ అంతటి సత్తా ఉన్న సీఎం లేకపోబట్టే రాష్ట్రానికి ఈ గతి పట్టింది
  • తెలుగుదేశం పార్టీ సహా ఐదు పార్టీలు విభజనకు అనుకూలమని చెప్తే..
  • వైఎస్సార్ సీపీ, సీపీఎం, ఎంఐఎం ఎప్పుడూ అనుకూలమని చెప్పలేదు
  • ఇప్పటికీ మించిపోయిందేమీ లేదు.. చంద్రబాబుకు ఏమాత్రం చిత్తశుద్ధి ఉన్నా.. తను తెలంగాణకు అనుకూలంగా ఇచ్చిన లేఖ వెనక్కు తీసుకోవాలి
  • తను రాజీనామా చేసి.. తన ఎమ్మెల్యేలు, ఎంపీలతో రాజీనామాలు చేయించాలి
  • ‘సమైక్య శంఖారావం’ నుంచి ‘సాక్షి’ ప్రత్యేక ప్రతినిధి: ‘‘విభజన విషయంలో యూపీఏ ప్రభుత్వం శ్రీకృష్ణ కమిటీని నియమించింది. నిపుణులతో కూడిన ఈ కమిటీ దాదాపు సంవత్సరం రోజులు కూలంకషంగా పరిశీలన చేసిన తరువాత రాష్ట్రాన్ని విభజించడం మంచిది కాదని, ఒక్కటిగా ఉంచడమే మంచి పరిష్కారమని చాలా స్పష్టంగా చెప్పింది. ఈ కమిటీ సూచనలను పక్కనపెట్టి ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ మన రాష్ట్రాన్ని ఎందుకు విభజించాలని అనుకుంటోంది? మన రాష్ట్రాన్ని విభజిస్తే ఎవరికి లాభం? తెలుగు జాతి అంతా ఒక్కటిగా ఉంటే ఎవరికి నష్టం? తెలుగు గడ్డ మీద వైఎస్సార్‌లాంటి ఇంకో ముఖ్యమంత్రి ఆవిర్భవిస్తే తట్టుకోలేని బలహీనత ఎవరికి ఉంది?’’ అని వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి సోదరి షర్మిల ప్రశ్నించారు. రాష్ట్రాన్ని సమైక్యంగా ఉంచాలనే డిమాండ్‌తో షర్మిల చేపట్టిన ‘సమైక్య శంఖారావం’ బస్సు యాత్ర శనివారం 12వ రోజు తూర్పు గోదావరి, విశాఖపట్నం జిల్లాల్లో సాగింది. కాకినాడ, పాయకరావుపేటలలో నిర్వహించిన ‘సమైక్య శంఖారావం’ సభలకు భారీ ఎత్తున తరలివచ్చిన ప్రజలను ఉద్దేశించి ప్రసంగించారు. ఈ ప్రసంగాల సారాంశం ఆమె మాటల్లోనే.. 
     
     మంచి పనులతో ఓట్లు సంపాదించుకోలేకే..
     ‘‘మంచి పనుల ద్వారా ఓట్లు, సీట్లు సంపాదించుకునే సత్తా కాంగ్రెస్‌కు ఉండి ఉంటే.. ఈరోజు రాష్ట్రానికి ఈ గతి పట్టి ఉండేది కాదు. మంచి పనుల ద్వారా ఓట్లు, సీట్లు సంపాదించుకోలేని ఈ పార్టీ.. చెడు చేసైనా సరే వాటిని సంపాదించుకోవాలని, కేవలం స్వార్థ రాజకీయాల కోసమని రాష్ట్రాన్ని విభజించడానికి పూనుకొంది. రాజశేఖరరెడ్డి బతికే ఉంటే.. మన రాష్ట్రానికి ఈ గతి పట్టి ఉండేది కాదని సాక్షాత్తూ ప్రధాన మంత్రి సహా కోట్లమంది ప్రజలు అభిప్రాయపడుతున్నారు. ఒక్క రాజశేఖరరెడ్డి మాత్రమే విభజన అనే గొడ్డలికి అడ్డంగా నిలబడి మన రాష్ట్రాన్ని విడిపోకుండా కాపాడారు. ఎవరికి అన్యాయం జరిగినా సరిదిద్దాలి.. అసలు అన్యాయం ఎందుకు జరిగిందో తెలుసుకోవాలని రోశయ్య కమిటీని వేశారు. 2009లో టీఆర్‌ఎస్, టీడీపీ పొత్తు కుదుర్చుకున్నా, నాలుగు పార్టీలు కలిసి ఏకధాటిగా యుద్ధం చేసినా రాజశేఖరరెడ్డి ఒకే ఒక్కడిగా నిలబడి ఒంటి చేత్తో పోరాటం చేశారు. గెలిచి మన రాష్ట్ర ప్రజలకు కావాల్సింది సంక్షేమం, అభివృద్ధే తప్ప విభజన, ప్రత్యేక రాష్ట్రం కాదని నిరూపించారు. ఇప్పుడు అంత సత్తా ఉన్న సీఎం లేకపోబట్టే రాష్ట్రానికి ఈ గతి పట్టింది.
     
     గారడీ ముఖ్యమంత్రి: ఇప్పుడూ ఉన్నారండి ఒక ముఖ్యమంత్రి.. పని తక్కువ, ప్రచారం ఎక్కువ చేసుకునే ముఖ్యమంత్రి కిరణ్ కుమార్‌రెడ్డి. రాజశేఖరరెడ్డి ఈయన్ను స్పీకర్‌గా చేయకపోతే అసలు ఈయన సోనియా కంటికి కనిపించి ఉండేవారు కాదు. ముఖ్యమంత్రి అంతకంటే అయ్యుండేవారు కాదు. ఆ కృతజ్ఞత కిరణ్‌కుమార్‌రెడ్డికి లేదు. అధికారంలోకి వచ్చిన మొదటి రోజు నుంచీ రాజశేఖరరెడ్డి పథకాలకు తూట్లు పెట్టారు, ప్రతి ఉద్దేశాన్నీ విమర్శించారు. ప్రతి పన్నూ పెంచుకుంటూనే పోయారు. పేదవాడు పాపం బతుకు భారమై.. అప్పులపాలైపోయి అల్లాడిపోతుంటే తనకు పట్టనట్టే ఉన్నారు. ఈ కాంగ్రెస్ పార్టీ మన రాష్ట్రాన్ని చీలుస్తుందన్న సంగతి కిరణ్ కుమార్‌రెడ్డికి ఎప్పుడో తెలుసు.. అయినా అడ్డు చెబితే పదవి ఎక్కడ ఊడిపోతుందేమోనని అడ్డు కూడా చెప్పలేదు. ఆఖరికి దిగ్విజయ్ సింగ్ ప్రకటన చేసే వరకూ ఆ విషయాన్ని గోప్యంగా ఉంచారు. జూలై నెలలోనే ఈయన రాజీనామా చేసేసి ఉంటే.. విభజన ప్రక్రియ మొదలు పెట్టిన రోజే ఆగిపోయేది. కానీ ఈయనకు పదవి మీద ఉన్న మోజు అంతటిది. సొంతంగా కష్టపడి సంపాదించుకున్న పదవి కూడా కాదది. అనుకోకుండా వచ్చిన పదవి కదా.. అందుకే దాన్ని వదులుకోవాలంటే.. ప్రాణాలు వదులుకున్నంత కష్టంగా ఉంది. ఢిల్లీలో ఒక మాట చెప్తారు.. ఇక్కడ ఒక మాట చెప్తారు.. అంతా గారడీచేస్తారని కాంగ్రెస్‌వాళ్లే ఆయన గురించి చెప్తారు. ముఖ్యమంత్రి హోదాలో ఉండి కూడా తెరచాటున రాజకీయం చేస్తానంటారు ఈ సీఎం. పదవిలో ఉండి.. ధైర్యంగా ముందడుగు వేసి ఏమీ చేయలేని ఈ వ్యక్తి తెరచాటు రాజకీయం చేస్తారట.. దాన్ని నమ్మి కాంగ్రెస్ వాళ్లు ఈయనకు భజన చేస్తారట!
     
     ఇదిగో చంద్రబాబు రాసిచ్చేసిన లేఖ: మన ఖర్మకొద్దీ పాలక పక్షం ఇలా ఏడిస్తే.. ప్రధాన ప్రతిపక్ష నాయకుడు చంద్రబాబు తెలంగాణ ఇచ్చేసుకుంటే ఇచ్చేసుకోండి అని బ్లాంక్ చెక్‌లా లేఖ ఇచ్చేసి మొసలి కన్నీరు కారుస్తున్నారు. (చంద్రబాబు నాయుడు కేంద్రానికి పంపిన లేఖ చూపిస్తూ) ఇది అదే. 18 అక్టోబర్ 2008న రాశారు. దీంట్లో ముఖ్యమైన పాయింట్ ఏమిటంటే.. ‘తెలుగుదేశం పార్టీ తరఫున మేం అందరం కూర్చొని చర్చించుకున్నాం. మా కోర్‌కమిటీ మీటింగ్‌లో మేం అంగీకరించిన విషయం ఏమిటంటే.. తెలంగాణ రాష్ట్రం ఏర్పడాల్సిందే. తెలంగాణను ఇచ్చేయాల్సిందే’ అని చంద్రబాబు స్వయంగా కేంద్రానికి రాసిచ్చిన లేఖ ఇది. కాంగ్రెస్ పార్టీ ఈ రోజు మన రాష్ట్రాన్ని విభజించే సాహసం చేస్తోందంటే దానికి కారణం చంద్రబాబు ఆ విభజనకు పలికిన మద్దతే. హత్య చేసి ఆ శవం మీదే పడి వెక్కివెక్కి ఏడ్చినట్టు చంద్రబాబు.. తెలంగాణకు అనుకూలంగా లేఖనిచ్చేసి మొసలి కన్నీళ్లు కారుస్తూ ప్రజలను మభ్యపెట్టే ప్రయత్నం చేస్తున్నారు. ఎన్టీఆర్ తెలుగు వారి ఆత్మగౌరవాన్ని కాపాడటం కోసం తెలుగుదేశం పార్టీని స్థాపిస్తే ఈ చంద్రబాబు.. దాన్ని తెలుగు ద్రోహుల పార్టీగా మార్చేశారు. మీ రాష్ట్రాన్ని చీల్చుతున్నామని దిగ్విజయ్‌సింగ్ ప్రకటన చేస్తే ఈయన ప్రెస్‌మీట్ పెట్టి.. కోట్ల మంది ప్రజలకు జరుగుతున్న అన్యాయం గురించి ఒక్క మాట కూడా మాట్లాడకుండా రూ.4 లక్షల కోట్లకు హైదరాబాద్‌ను అమ్మకానికి పెట్టేశారు. తెలుగుదేశం పార్టీ సహా ఐదు పార్టీలు ఈ విభజనకు అనుకూలంగా ఉన్నామని చెప్తే... వైఎస్సార్ కాంగ్రెస్ , సీపీఎం, ఎంఐఎం విభజనకు అనుకూలం అని ఎప్పుడూ చెప్పలేదు. ఇప్పటికీ మించిపోయిందేమీ లేదు.. చంద్రబాబుకు ఏమాత్రం చిత్తశుద్ధి ఉన్నా, ఏమాత్రం నిజాయితీ ఉన్నా తాను కూడా విభజనకు వ్యతిరేకం అని ఈ మూడు పార్టీల పక్షాన నాలుగో పార్టీగా నిలబడాలి. తను రాజీనామా చేసి.. తన ఎమ్మెల్యేలు, ఎంపీలతో రాజీనామాలు చేయించాలి. తెలంగాణకు అనుకూలంగా తను ఇచ్చిన లేఖ వెనక్కి తీసుకోవాలి.
     
     అప్పుడే రాజీనామాలు చేసుంటే: కాంగ్రెస్ మన రాష్ట్రాన్ని చీల్చుతున్నామని సంకేతాలు పంపించిన వెంటనే వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీకి చెందిన ఎమ్మెల్యేలు రాజీనామాలు చేశారు. గౌరవాధ్యక్షురాలు విజయమ్మ, అధ్యక్షులు జగన్‌మోహన్‌రెడ్డి కూడా రాజీనామాలు చేశారు. తమ వంతు పోరాటంగా నిరాహార దీక్షలు చేశారు. లేఖల మీద లేఖలు రాసి ఇది అన్యాయం.. మా రాష్ట్రాన్ని విడగొట్టొద్దని ఈ రోజు వరకు పోరాటం చేస్తూనే ఉన్నారు. కానీ ఎంత మంది టీడీపీ, కాంగ్రెస్‌కు చెందిన ఎంపీలు, ఎమ్మెల్యేలు రాజీనామాలు చేశారు? వైఎస్సార్ సీపీ ఎమ్మెల్యేలందరూ రాజీనామా చేసిన రోజే వీరంతా రాజీనామా చేసి ఉంటే.. రాష్ట్ర విభజన ప్రక్రియ ఎప్పుడో ఆగిపోయేది.’’
     
     ఎన్జీవోలకు అండగా ఉంటాం
     ‘‘రైతులు, కార్మికులు, ఉద్యోగస్తులు, వ్యాపారులు, విద్యార్థులు, మహిళలు సైతం ఈ రోజు తమ పనులు మానుకొని ఆందోళనలు చేస్తుంటే ఈ కాంగ్రెస్ పార్టీ పట్టనట్టే చూస్తోంది. మరీ ముఖ్యంగా ఎన్జీవో సభ్యులైతే ఊరు ఊరునా ఉద్యమాలు చేస్తున్నారు. ఒకవైపేమో వారి ఆవేదనకు కారణమైన ఈ కిరణ్ సర్కారు వారిని వేధిస్తోంది. ఇంకోవైపేమో వారికి జీతాలు కూడా ఇవ్వను అంటోంది. పాపం ఆ ఎన్జీవోలకు ఈ ప్రభుత్వం జీతాలు ఇవ్వకపోయినా వారి ఇళ్లలో వారికి, పిల్లలకు ఎంత ఇబ్బంది కలుగుతున్నా వారి ఉద్యమ స్ఫూర్తి ఈరోజు వరకు చెక్కు చెదరలేదు. నిజంగా ఆ ఎన్జీవో సంఘాలు, సభ్యుల కృషిని, త్యాగాన్ని వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ మనస్ఫూర్తిగా అభినందిస్తోంది. ఆ ఎన్జీవో సంఘాల సభ్యులకు.. ఉద్యమంలో పాలుపంచుకుంటున్న వారందరికీ వెంటనే జీతాలు ఇవ్వాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తోంది. ఈ ప్రభుత్వం వారికి జీతాలు ఇవ్వకపోయినా ఇంకొన్ని నెలల్లోనే వైఎస్సార్ కాంగ్రెస్ అధికారంలోకి రావడం ఖాయం. జగన్‌మోహన్‌రెడ్డి ముఖ్యమంత్రి అవ్వడం కూడా ఖాయం. జగన్‌మోహన్‌రెడ్డి ప్రభుత్వం ఏర్పడిన తరువాత వారికి జీతాలు ఇవ్వడమే కాకుండా వారిని గౌరవిస్తూ ఒక నెల బోనస్ కూడా ఇస్తుందని జగనన్న తరఫున మేం మాట ఇస్తున్నాం. ఒక్కజీతాల విషయంలోనే కాదు, ప్రతి విషయంలోనూ ఆ ఎన్జీవో సంఘాల సభ్యులకు వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అండగా నిలబడుతుందని మాట ఇస్తున్నాం.’’                    -షర్మిల
     

     

Advertisement
Advertisement