Sakshi News home page

'అచ్చం కిషోర్‌కుమార్ పాడినట్టే ఉందన్నారు'

Published Thu, Jul 31 2014 8:46 AM

జిత్‌మోహన్ మిత్రా

అది 1954.. గోదావరి గట్టున ఉన్న మున్సిపల్ ఉన్నత పాఠశాలలో ఫోర్‌‌త ఫారం (నేటి తొమ్మిదో తరగతి) చదువుతున్న ఓ విద్యార్థి ‘‘బైజు బావరా’’ అనే  హిందీ సినిమాలోని రఫీ గానం చేసిన ‘ఓ దునియాకే రఖ్‌వాలే’ పాటను పాఠశాల వేదికపై పాడాడు. దానికి చప్పట్లతో విశేష స్పందన లభించింది. అప్పటి నుంచి ఆయన పాటను వదల్లేదు. పాట ఆయనను వదల్లేదు... అలా ప్రారంభమైన ఆయన పాటల ప్రస్థానం వచ్చే ఆగస్టుతో 60 వసంతాలు పూర్తి చేసుకోనుంది. ఆయనే శ్రీపాద జిత్‌మోహన్ మిత్రా... నగరవాసులకు పరిచయం అక్కర్లేని గళం ఆయన సొత్తు. నేటి వరకు 206 సినిమాల్లో నటించిన ఈ కళాపిపాసి గోదావరి నీళ్లకు... చిన్ననాటి స్నేహితుల చెలిమికి దూరం కాలేక రాజమండ్రిలోనే స్థిరపడ్డారు. నటుడిగా, గాయకుడిగా రాణిస్తున్న ఈయన వయస్సు 72 సంవత్సరాలైతే, సినీ రంగంలో ప్రవేశించి 45 ఏళ్లు. ఆగస్టు మూడో తేదీన జిత్ స్వరగాన షష్ట్యబ్ది ఉత్సవాలు జరగనున్నాయి. ఈ నేపథ్యంలో ఆయన తన గాన, సినీ ప్రస్థానాలను ‘సాక్షి’కి ఇలా ఆవిష్కరించారు..
 
 
రాజమండ్రి  : రాజమండ్రిలో 1942 మార్చి మూడో తేదీన జన్మించా. మా నాన్నగారు శ్రీపాద కృష్ణమూర్తి శాస్త్రి వృత్తి రీత్యా ప్లీడరు గుమాస్తా. ప్రవృత్తి రంగస్థల నటుడు. అన్నయ్య శ్రీపాద పట్టాభికి సినీప్రముఖులతో సన్నిహిత సంబంధాలు ఉండేవి. మరో అన్నయ్య శ్రీపాదకుమార శర్మకు చిన్ననాటి నుంచి నాటకరంగంపై ఆసక్తి. ఇక నేను గాయకుడిగా మారడానికి మా ఇంటి గోడపక్కనే ఉన్న రామా థియేటర్ (నేటి నాగదేవి)నే చెప్పుకోవాలి.
 
 అప్పట్లో అందులో హిందీ సినిమాలు ఆడేవి. వాటిలో  పాటలు విని, సాధన చేసేవాడిని.. అలా హిందీపాటలపై ఆసక్తి పెరిగింది. నా పన్నెండో ఏట 1954లో బైజు బావరా సినిమాలో రఫీ గానం చేసిన ‘ఓ దునియాకే రఖ్‌వాలే’ పాటను పాఠశాల వేదికపై పాడాను. ఆ పాటకు మంచి ప్రతిస్పందన వచ్చింది. 1956 నుంచి ప్రఖ్యాత హిందీగాయకుడు కిషోర్‌కుమార్ అభిమానినయ్యాను. నా పాటలు విన్న కొందరు ‘అచ్చం కిషోర్‌కుమార్ పాడినట్టే ఉన్నాయి’ అని మెచ్చుకునేవారు. 1974లో హైదరాబాద్ రవీంద్రభారతిలో ‘ఫ్రెండ్స్ సర్కిల్’ సభ్యులు నన్ను ‘ఆంధ్రా కిషోర్ కుమార్’ బిరుదుతో సత్కరించారు.
 
 1979లో ముంబ యిలో కిషోర్ కుమార్‌ను కలిశాను. ఆ సమయంలో ప్రముఖ దర్శకుడు కె. విశ్వనాథ్ హిందీలో సర్‌గమ్ (తెలుగులో సిరిసిరి మువ్వ) చిత్రానికి దర్శకత్వం వహిస్తున్నారు. కిషోర్‌కుమార్ సన్నిధిలో ఆయన ఫంతూష్ సినిమా కోసం పాడిన ‘దుఃఖీ మన్ మేరే’ పాటను పాడి వినిపించాను. అది నా జీవితంలో మరచిపోలేని అనుభూతి. నా పాటలు ఇన్ని ఉండగా ఈ విషాద గీతమే ఎందుకు పాడావని కిషోర్ నన్ను అడిగారు. ఆ పాటంటే నాకు ప్రాణమన్నాను. 1970లో, 44 ఏళ్ల వెనుక జిత్‌మోహన్ ఆర్కెస్ట్రా స్థాపించి ఎన్నో సంగీత కార్యక్రమాలను నిర్వహిస్తున్నాను.  
 
 ‘అక్కినేని నటించిన బందిపోటు సినిమాలో నాకో వేషం వచ్చింది...’
 గోదావరి తీరంలో ఏ సినిమా నిర్మాణం జరిగినా, మా కుటుంబ సహాయ సహకారాలు తప్పనిసరిగా ఉండేవి. 1969లో బాపు, రమణలు బుద్ధిమంతుడు సినిమాలో నాకో అవకాశం ఇచ్చారు. అక్కినేని సూచనపై నాకు ఓ డైలాగ్ కూడా ఇచ్చారు. అదే సంవత్సరం అక్కినేని నటించిన బందిపోటు సినిమాలో కూడా నాకో వేషం ఇచ్చారు. ఆ రెండు సినిమాల్లో ఎడిటింగ్‌లో నా పాత్ర మాయమైంది. దాంతో నిరుత్సాహానికి గురయ్యాను. 1975లో బాపురమణల ముత్యాలముగ్గులో ఓ కీలకపాత్రను ధరించడంతో నా సినీప్రస్థానం ప్రారంభమైంది. కె.విశ్వనాథ్ సిరిసిరిమువ్వ, శంకరాభరణం, జంధ్యాల దర్శకత్వం వహించిన ఆనందభైరవి, మల్లెపందిరి... ఇలా ఎన్నో సినిమాల్లో నటించాను. కన్నడం, ఒడియా, తమిళ్, భోజ్‌పురి... ఇలా ఎన్నో భాషల్లోనూ మెప్పించాను. ఈ సినిమాలన్నీ గోదావరమ్మ ఒడిలో పురుడు పోసుకున్నవే...
 
 ‘ఈ గడ్డను వదిలి వెళ్లలేక...’
 ఆ రోజుల్లో హైదరాబాద్, చెన్నై, ముంబయి నగరాల నుంచి ఆహ్వానాలు అందుకున్నా. కానీ ఈ గడ్డను వదులుకోవడం నాకు ఇష్టం లేదు. 60 ఏళ్లుగా ప్రజలు నా పాటలు వింటున్నారు. ఇది ఓ రికార్డు. ఇంతకు మించిన తృప్తి నాకు లేదు. గత ఏడాది రాష్ట్ర ప్రభుత్వం నన్ను ఉగాది పురస్కారంతో సత్కరించింది. కె.విశ్వనాథ్, డాక్టర్ సి.నారాయణరెడ్డి వంటి ప్రముఖుల చేతుల మీదుగా సత్కారాలు అందుకున్నాను. రాఖీ సినిమాలో ఎన్టీఆర్ పాటకు సంగీత దర్శకత్వం వహించాను. భగవంతుడు నాకు ఇచ్చిన శక్తి మేరకు పాడుతూనే ఉంటాను.

Advertisement
Advertisement