టీడీపీ దురాగతాలపై పోరాడాలి | Sakshi
Sakshi News home page

టీడీపీ దురాగతాలపై పోరాడాలి

Published Mon, Aug 18 2014 1:50 AM

టీడీపీ దురాగతాలపై పోరాడాలి - Sakshi

నరసరావుపేట ఎమ్మెల్యే గోపిరెడ్డి

నరసరావుపేట వెస్ట్: మార్కెట్ యార్డు షాపుల్లోని వ్యాపారులు టీడీపీ ప్రభుత్వ దురాగతాలపై పోరాడాలని ఎమ్మెల్యే డాక్టర్ గోపిరెడ్డి శ్రీనివాసరెడ్డి సూచించారు. ఆర్టీసీ బస్‌స్టాండ్ ఎదురుగా మార్కెట్ యార్డుకు చెందిన షాపింగ్ కాంప్లెక్స్‌లోని షాపులను బలవంతంగా ఖాళీచేయించడంతో మనోవేదన చెందిన వ్యాపారి కుందురు కృష్ణారెడ్డి గుండెపోటుతో శనివారం మృతిచెందిన విషయం విదితమే. మూసివేసిన ఆయన షాపు వద్దకు వ్యాపారి కృష్ణారెడ్డి మృతదేహాన్ని తీసుకువచ్చి బంధువులు ధర్నా చేశారు. ఎమ్మెల్యే గోపిరెడ్డి వ్యాపారి కృష్ణారెడ్డి మృతదేహాన్ని సందర్శించి నివాళులర్పించారు.
 
కృష్ణారెడ్డి మరణం టీడీపీ దురాగతాలకు నిదర్శనమన్నారు. వీరంతా 30 ఏళ్లుగా  ఇదే చోట వ్యాపారాలు నిర్వహిస్తున్నారని, మరో రెండేళ్లు కొనసాగించాలని యార్డు కార్యవర్గం గత ఫిబ్రవరిలో తీర్మానం చేసిందన్నారు. ప్రభుత్వం మారగానే షాపులను చేజిక్కించుకునేందుకు అధికార టీడీపీ నాయకులు అడ్డదారిలో అధికారులను బెదిరించి వ్యాపారులను బలవంతంగా ఖాళీచేయించారని ఎమ్మెల్యే ధ్వజమెత్తారు. హైకోర్టు కూడా వ్యాపారులకే అనుకూలంగా తీర్పు ఇచ్చినట్లు తెలియవచ్చిందని, త్వరలో ఉత్తర్వులు వస్తాయన్నారు.
 
 పీడీఎం రాష్ట్ర కమిటీ సభ్యుడు నల్లపాటి రామారావు మాట్లాడుతూ వ్యాపారులందరూ కలిసికట్టుగా పోరాడాలని పిలుపునిచ్చారు. కృష్ణారెడ్డి మృతికి పీడీఎం తరపున జోహార్లు అర్పించారు. అక్కడి నుంచి కృష్ణారెడ్డి మృతదేహాన్ని కుమారుడు జగన్‌మోహనరెడ్డి,బంధువులు, శ్రీనివాసనగర్ వాసులు ఊరేగింపుగా శ్మశానవాటికకు తరలించి దహన కార్యక్రమాలు నిర్వహించారు.  పీడీఎం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి వై.వెంకటేశ్వరరావు, కౌన్సిలర్లు పాలపర్తి వెంకటేశ్వరరావు, మాగులూరి రమణారెడ్డి పాల్గొన్నారు.

Advertisement

తప్పక చదవండి

Advertisement