ప్రియుడు మోసం చేశాడని.. | Sakshi
Sakshi News home page

ప్రియుడు మోసం చేశాడని..

Published Sun, Feb 22 2015 2:33 AM

suicide case

ఉరి వేసుకొని ఆత్మహత్య చేసుకున్న యువతి  ప్రేమిస్తున్నానని వెంటపడ్డాడు. పెళ్లి చేసుకుంటానని నమ్మబలికాడు. చెప్పాపెట్టకుండా  వే రే అమ్మాయితో పెళ్లికి సిద్ధపడ్డాడు. అలా ఎందుకు చేస్తున్నావని నిలదీసిన ప్రియురాలిని ‘నీ చావు నీవు చావుపో’ అంటూ కఠినంగా మాట్లాడాడు. తీవ్ర వేదనకు గురైన ఆ యువతి ఆత్మహత్యకు పాల్పడింది.
 
 
 ఎర్రగుంట్ల:  ప్రేమించి మోసం చేశాడని ఓ యువతి ఇంటిలో ఎవరూ లేని సమయంలో ఉరి వేసుకొని ఆత్మహత్య చేసుకుంది. మృతురాలి తల్లిదండ్రులు, పోలీసులు తెలిపిన వివరాల మేరకు.. చిలంకూరులోని గుంత బజారు కాలనీలో నివాసముంటున్న అలమూరు దస్తగిరి, దస్తగిరమ్మకు ఇద్దరు కూతుర్లు. వారిలో పెద్ద అమ్మాయి దస్తగిరమ్మ, చిన్నమ్మాయి ఇమాంబీ. దస్తగిరి డ్రైవరుగా పని చేసుకుంటూ మరో పక్క కూడలిలో కూరగాయల అంగడి పెట్టుకొని జీవనం సాగిస్తున్నారు. పెద్దామ్మాయి దస్తగిరమ్మ నంద్యాలలోని బీటెక్ చదువుతుండగా, చిన్నమ్మాయి ఇమాంబీ ఎర్రగుంట్లలోని ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో బీకాం ప్రథమ సంవత్సరం చదువుతుంది. ఇమాంబీ కళాశాలకు పోతుండగా అదే గ్రామానికి చెందిన నల్లమేకల ఉత్తమకుమార్‌రెడ్డి(ఉత్తమారెడ్డి) వెంట పడుతూ వేధించాడు. ఈ తరుణంలో ప్రేమించి పెళ్లి చేసుకుంటానని నమ్మించాడు. ఎనిమిది నెలలుగా అమ్మాయి చుట్టూ తిరిగాడు. తరుచూ ఫోన్ చేస్తుండేవాడు.
 
 మరో అమ్మాయితో
 వివాహం కుదరడంతో...
 అయితే శనివారం మరో అమ్మాయితో అనంతపురంలోని పెళ్లికి పూనుకొని మార్చి 7,8 తేదీల్లో వివాహం ఖాయం చేసుకున్నారు. శనివారం ఇమాంబీకి ఫోన్ చేశాడు. ‘నీ చావు నీవు చావు అని, నాకు వివాహం కుదిరిందని చెప్పాడ’ని మృతురాలి బంధువులు తెలిపారు. ఇమాంబీ ఇంటిలో తల్లిదండ్రులు ఎవరూ లేని సమయంలో దూలానికి ఉరి వేసుకొని ఆత్మహత్య చేసుకుంది. మధ్యాహ్నం కూరగాయల అంగడి నుంచి తల్లి దస్తగిరమ్మ ఇంటికి వచ్చింది. తలుపులు వేసి ఉండడం గమనించింది.
 
  కిటికిలో నుంచి చూడగా కూతురు ఉరి వేసుకొని వేలాడుతూ ఉండడం గమనిచింది. వెంటనే పక్కనే ఉన్న స్థానికులను పిలిచి తలుపులు పగలగొట్టి లోనికి పోయి వేలాడుతున్న ఇమాంబీని కిందకు దించారు. అప్పటికే మృతి చెందినది. తల్లిదండ్రులు బోరుమని విలపించారు. ఇమాంబీ మృతికి కారకుడైన ఉత్తమకుమార్‌రెడ్డిని పట్టుకొని పోలీసులకు అప్పగించారు. సంఘటన స్థలాన్ని ఎస్‌ఐ భానుమూర్తి సందర్శించారు. తల్లి దస్తగిరమ్మ ఇచ్చిన ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్‌ఐ తెలిపారు.
 

Advertisement
Advertisement