సాక్షి, హైదరాబాద్: ఎమ్మార్ ప్రాపర్టీస్ కేసులో నిందితుడిగా ఉన్న ఎన్.సునీల్రెడ్డికి సీబీఐ ప్రత్యేక కోర్టు శనివారం బెయిల్ మంజూరు చేసింది. హైదరాబాద్ వదిలి వెళ్లవద్దని, వ్యక్తిగత పూచీకత్తుతో పాటు రూ. 2 లక్షల చొప్పున ఇద్దరు వ్యక్తులు పూచీకత్తు ఇవ్వాలని సీబీఐ ప్రత్యేక కోర్టుల ప్రధాన న్యాయమూర్తి యు.దుర్గాప్రసాద్రావు షరతులు విధించారు. ఈ బెయిల్ పిటిషన్పై శనివారం తుది వాదనలు జరిగాయి. సునీల్రెడ్డి తరఫున న్యాయవాది శ్రీరామ్ వాదనలను కోర్టు పరిగణనలోకి తీసుకుని బెయిల్ మంజూరు చేసింది. అయితే.. అలాగే కోర్టు ముందస్తు అనుమతి లేకుండా హైదరాబాద్ విడిచి వెళ్లరాదని, ప్రత్యక్షంగా, పరోక్షంగా సాక్షులను ప్రభావితం చేయరాదని న్యాయమూర్తి యు.దుర్గాప్రసాద్రావు స్పష్టం చేశారు.
కోర్టు విచారణకు క్రమం తప్పకుండా హాజరుకావాలని ఆదేశించారు. సునీల్రెడ్డి ఈ షరతులను ఉల్లంఘిస్తే బెయిల్ను రద్దు చేయాలని సీబీఐ ఎప్పుడైనా కోరవచ్చని న్యాయమూర్తి ఉత్తర్వుల్లో పేర్కొన్నారు. సునీల్రెడ్డికి బెయిల్ ఇస్తే సాక్షులను ప్రభావితం చేస్తారని సీబీఐ ఆరోపించినా.. అందుకు సరైన ఆధారాలు చూపలేదని న్యాయమూర్తి చెప్పారు. ఈ కేసులో నిందితులంతా ఇప్పటికే బెయిల్పై విడుదలైనందున సునీల్రెడ్డి బెయిల్ పొందేందుకు అర్హుడని స్పష్టం చేశారు.