54 మంది విద్యార్థులపై సస్పెన్షన్‌ వేటు

19 Sep, 2017 02:05 IST|Sakshi
54 మంది విద్యార్థులపై సస్పెన్షన్‌ వేటు
‘నూజివీడు’ ట్రిపుల్‌ఐటీ యాజమాన్యం నిర్ణయం
 
నూజివీడు: క్రమశిక్షణ ఉల్లంఘించి తోటి విద్యార్థులపై దాడికి తెగబడిన నూజివీడు ట్రిపుల్‌ఐటీ విద్యార్థులపై యాజమాన్యం కొరడా ఝుళిపించింది. 54 మంది విద్యార్థులపై సస్పెన్షన్‌ వేటు వేస్తూ నిర్ణయం తీసుకుంది. గతనెల 29వ తేదీ అర్ధరాత్రి కొందరు ఇంజినీరింగ్‌ విద్యార్థులు కలిసి ఇన్‌ఫార్మర్‌లుగా పనిచేస్తున్నారనే అక్కసుతో 12మంది తోటి విద్యార్థులను హాస్టల్లోని తమ గదులకు పిలచి చితకబాదిన సంగతి తెలిసిందే. దీనిపై యాజమాన్యం.. విచారణ జరిపి దాడికి పాల్పడిన విద్యార్థులపై చర్యలు తీసుకుంది.

వివరాలను నూజివీడు ట్రిపుల్‌ఐటీ డైరెక్టర్‌ ఆచార్య వీరంకి వెంకటదాసు సోమవారం విలేకర్లకు తెలిపారు. కొందరు విద్యార్థులు ఇన్‌ఫార్మర్‌లుగా వ్యవహరిస్తూ ఫ్యాకల్టీకి ప్రతి విషయాన్ని చేరవేస్తున్నారని వారిపై  అక్కసు పెంచుకుని దాడికి పాల్పడినట్లుగా తేలిందని  పేర్కొన్నారు. ర్యాగింగ్‌ అనేదే ట్రిపుల్‌ఐటీలో లేదన్నారు. ఈ సంఘటనపై ఈనెల ఒకటిన కమిటీ నియమించామని, కమిటీ సిఫార్సుల మేరకు చర్యలు తీసుకున్నామన్నారు. ఈ సంఘటనకు ప్రధాన కారణమైన ఇంజినీరింగ్‌ చివరి సంవత్సరం చదువుతున్న ఆరుగురు విద్యార్థులను శాశ్వతంగా సస్పెండ్‌ చేశామని, వీరు యాజమాన్యం అనుమతి తీసుకుని పరీక్షలు మాత్రం రాసుకోవచ్చన్నారు. 
మరిన్ని వార్తలు