నవ పరిశోధకులు | Sakshi
Sakshi News home page

నవ పరిశోధకులు

Published Fri, Dec 19 2014 3:43 AM

నవ పరిశోధకులు - Sakshi

ఏ దేశ అభివృద్ధి అయినా శాస్త్ర సాంకేతిక రంగాలపై ఆధారపడి ఉంటుంది. ఇందుకనుగుణంగా భావి ఇంజినీర్లు సరికొత్త ఆవిష్కరణలకు తెరతీస్తున్నారు. మదనపల్లె సమీపంలోని మిట్స్, ఎస్‌వీటీఎం ఇంజినీరింగ్ కళాశాలల విద్యార్థులు వివిధ పరిశోధనలతో తమ గమనాన్ని చాటుకుంటున్నారు.           - కురబలకోట

సమాజ ప్రగతికి ఇవే మూలం       
ప్రతిభ చాటుతున్న ఇంజినీరింగ్ విద్యార్థులు

గుండెజబ్బును ఇట్టే పసిగట్టవచ్చు..
గుండెజబ్బుతో చాలామంది సతమతం అవుతున్నారు.  ఇలాంటి జబ్బును పెద్దగా ఖర్చు లేకుండానే ఇట్టే పసిగట్టే యంత్రాన్ని ఎస్‌వీటీఎం ఇంజినీరింగ్ విద్యార్థి హరినాథ్ కనుగొన్నారు. సెల్‌ఫోన్, సిమ్‌కార్డు, ఏఆర్‌ఎం, మైక్రో కంట్రోలర్ పరికరాన్ని చేశారు. ఎంబెడెడ్ టెక్నాలజీతో జీఎస్‌కు అనుసంధానం చేశారు. ఈ పరికరాన్ని ఏ వ్యక్తికి తాకించినా హృదయ స్పందనలు తెలిసిపోతాయి. సెల్‌ఫోన్‌కు సందేశం పంపిస్తుంది. సెల్‌లో కూడా కన్పిస్తుంది. ఈప్రాజెక్టు కింద దీన్ని తయారు చేయడం ఆరు వేలు దాకా అవుతుంది. కార్పొరేట్ ఆస్పత్రులకు వెళ్లకుండానే ముందుగా గుండెజబ్బులు కనిపెట్టి తగు జాగ్రత్తలు తీసుకోవచ్చు.  

- గుండెజబ్బులు కనుగొనే ప్రాజెక్టు గురించి చూపుతున్న హరినాథ్
 
బ్యాంకు లాకర్ సేఫ్
ఇటీవల కాలంలో దొంగలు ఎక్కువగా బ్యాంకులను కొల్లగొడుతున్నారు. వివిధ సెక్యూరిటీ విధానాలున్నా పూర్తిగా అరికట్టలేకపోతున్నారు. ముఖ్యంగా లాకర్లును తెరచి సొమ్ము దోచుకెళుతున్నారు. ఫేస్ రికగ్జైజింగ్, లోకలెజైషన్ సిస్టమ్ ద్వారా లోపాలను సరి చేసి ప్రాజెక్టును రూపొందించారు మదనపల్లె సమీపంలోని అంగళ్లు ఎస్‌వీటీఎం ఎంటెక్ విద్యార్థి పి.హేమలత.  దీని ద్వారా లాకర్లలోని సొమ్ము దొంగల చేతికి చిక్కకుండా  రెండు విధాలుగా రక్షణ కల్పించవచ్చు.

ఒకటి లాకర్ యజమాని ముఖాన్ని గుర్తించడం.. రెండోది శబ్దగ్రహణం. హెచ్‌ఎఆర్‌ఆర్ ఆల్లారిథం సాయంతో కొన్ని ముఖ కవళికలను పొందుపరుస్తారు. తర్వాత ఎప్పుడు అక్కడికి వెళ్లినా ముఖాన్ని గుర్తిస్తుంది. దీన్ని డేటాబేస్‌లో సరిపోల్చుతుంది. రెండు కలిస్తే జీఎస్‌ఎం ద్వారా మెసేజ్ పంపుతుంది. అప్పడు మనం మెసేజ్‌లో వచ్చిన దాన్ని పలికితే లాక్ తెరుచుకుంటుంది. దొంగలు తెరవాలన్నా సాధ్యం కాదు. ఇలాంటివి బ్యాంక్ లాకర్స్, లై బ్రరీల్లో వాడుతారు.

 - ప్రాజెక్టు గురించి వివరిస్తున్న హేమలత
 
చక్కెర శాతం లేని బియ్యం
ముందు కాలంలో దంపుడు బియ్యం తిని ఆరోగ్యంగా ఉండేవారు. ఇప్పడు బియ్యానికి పాలిష్ పెట్టడం, రసాయనిక ఎరువుల వల్ల విటమిన్లు లోపం వ్యాధులకు దారి తీస్తోంది. మిట్స్ ఎంటెక్ విద్యార్థి పి. మేఘశ్యామ్ డిజైన్ అండ్ ఫ్యాబ్రికేషన్ ఆఫ్ ప్యాడీ ప్రాజెక్టులో తక్కువ ఖర్చుతో వడ్లను బియ్యంగా మార్చవచ్చు. నూకలు కూడా కావు. ఈయంత్రం నుంచి వచ్చిన బియ్యానికి పాలిషింగ్ కూడా ఉండదు. ఈ బియ్యంతో రక్తంలో చక్కెర నిల్వలు నియంత్రించవచ్చు. మధుమేహ వ్యాధిగ్రస్తులకు ఉపయోగం. దీని ద్వారా రైతులు తక్కువ ఖర్చుతో ఎక్కువ ఆధాయం పొందవచ్చు.     
   
- వడ్లను బియ్యంగా మార్చే మిషన్‌తో మేఘశ్యామ్
 
నాణ్యమైన ఇంజెక్షన్ సిరంజీలు
సాధారణంగా ఇంజెక్షన్ సిరంజీలు ప్లాస్టిక్ ఉత్పత్తుల్లో తరచూ లోపాలు తలెత్తుతుంటాయి. ఇలాంటి వాటికి చెక్ పెట్టి నాణ్యత పెంచేందుకు మిట్స్ ఎంటెక్ విద్యార్థి కె.రాఘవేంద్ర కాశ్యప్ తన ప్రాజెక్టులో కనుగొన్నాడు. ఇంజెక్షన్ మోల్డింగ్‌లో పారామీటర్ యంత్రం ద్వారా ప్లాస్టిక్ ఉత్పత్తుల్లో ఉన్న లోపాన్ని గుర్తించి తగ్గించడానికి ఆస్కారం ఉంటుంది. తద్వారా ఆ ఉత్పత్తుల్లో నాణ్యతను పెంచుతుంది. దీన్ని ఎక్కువగా ఫాక్టరీలు, ప్లాస్టిక్ ఉత్పత్తుల్లో బ్యాటరీలను ఉంచి పంపడానికి ఎక్కువగా వాడుతారు.    
      
- ఇంజెక్షన్ మోల్డింగ్ యంత్రాన్ని చూపుతున్న రాఘవేంద్ర కాశ్యప్
 
మిట్స్ పరిశోధనలకు నిలయం

మిట్స్ కళాశాలలో పరిశోధన (ఆర్‌అండ్‌డీ) ఏర్పాటు చేశాం. ఇసీఈ, మెకానికల్, సీఎస్‌సీ, ఎంబీఏ, ఇంగ్లిషు, ఫిజిక్స్, కెమిస్ట్రీ, మ్యాధ్స్‌లపై పరిశోధనలకు అనువుగా ఉంది.  పీహెచ్‌డీలు చేయాలనుకునే వారికి ఇది తోడ్పడుతుంది. అనంతపురం జేఎన్‌టీయూ పరిధిలోనే ముఖ్యమైన పరిశోధన కేంద్రంగా మిట్స్ పరిశోధన కేంద్రం గుర్తింపు పొందింది.
- ఎన్.విజయభాస్కర్ చౌదరి, కరస్పాండెంట్, మిట్స్ కళాశాల, అంగళ్లు
 
 
ప్రపంచంతో పోటీ పడాలి
అత్యాధునిక ఆవిష్కరణలపై  విద్యార్థులు దృష్టి సారించాలి. నూతన ఆలోచనలతో ప్రపంచస్థాయిలో పోటీ పడాలి. నిరంతర సాధనతో భావి శాస్త్రవేత్తలుగా రాణిస్తారు. తద్వారా గుర్తింపు వస్తుంది. మానవాళి జీవన ప్రమాణాలు పెంచడంతో పాటు వాటికి ఉపయోగపడే వాటికి ఆదరణ ఎక్కువ.  దేశంలో పరిశోధకులను మరిన్ని ప్రోత్సాహకాలు కల్పించాలి.
- కె.శ్రీనివాసరెడ్డి, డెరైక్టర్, ఎస్‌వీటీఎం, విశ్వం విద్యా సంస్థలు, అంగళ్లు

Advertisement
Advertisement