జేసీ చెప్పారు.. అధికారులు సరే అన్నారు | Sakshi
Sakshi News home page

జేసీ చెప్పారు.. అధికారులు సరే అన్నారు

Published Sun, Mar 16 2014 8:19 AM

Tadipatri Officials Rejects YSR Congress Candidate Nomination

తాడిపత్రి: న్యూ డ్యూస్ సర్టిఫికెట్ ఇచ్చి.. తీరా నామినేషన్ల పరిశీలన రోజు జేసీ ప్రభాకర్ రెడ్డి ఫిర్యాదు చేశారనే కారణంతో వైఎస్‌ఆర్‌సీపీ అభ్యర్థి నామినేషన్‌ను అధికారులు తిరస్కరించారు. తాడిపత్రిలోని 10, 18 వార్డులకు వైఎస్‌ఆర్‌సీపీ అభ్యర్థి రమేష్‌రెడ్డి కౌన్సిలర్‌గా నామినేషన్ వేశారు. మునిసిపాలిటీలోని మొత్తం 34 వార్డులకు వైఎస్సార్‌సీపీ తరఫున 99 నామినేషన్లు దాఖలయ్యాయి. ఇందులో జేసీ సోదరులకు అత్యంత సన్నిహితంగా ఉన్న తాడిపత్రి ఇంజనీరింగ్ కళాశాల చైర్మన్, మాజీ కౌన్సిలర్ రమేష్‌రెడ్డి నాలుగు రోజుల క్రితం వైఎస్సార్‌సీపీలోకి చేరి, చురుకైన పాత్ర పోషించి అన్ని వార్డులకూ అభ్యర్థులతో నామినేషన్లు వేయించారు.

దీన్ని జీర్ణించుకోలేని జేసీ ప్రభాకర్‌రెడ్డి శనివారం నామినేషన్ల పరిశీలన సందర్భంగా రమేష్‌రెడ్డి మునిసిపాలిటీకి బకాయిపడ్డారని లిఖిత పూర్వకంగా రిటర్నింగ్ అధికారికి ఫిర్యాదు చేశారు. ఆరు గంటల హైడ్రామా అనంతరం రమేష్‌రెడ్డి నామినేషన్లను తిరస్కరిస్తున్నట్లు ఎన్నికల రిటర్నింగ్ అధికారి శివరామకష్ణ ప్రకటించారు. ఇది అన్యాయమని వైఎస్‌ఆర్‌సీపీ నేతలు రమేష్‌రెడ్డి, మునిసిపల్ మాజీ చైర్మన్ పేరం నాగిరెడ్డి, సీఈసీ సభ్యుడు పైలా నర్సింహయ్య, అశోక్‌రెడ్డి, రజనీకాంత్‌రెడ్డి మునిసిపల్ అధికారుల వైఖరిపై ఆగ్రహం వ్యక్తం చేశారు. టీడీపీ నాయకులకు అమ్ముడుపోయారని ఆరోపించారు.

Advertisement

తప్పక చదవండి

Advertisement