ప్రొద్దుటూరు : ‘వారం రోజుల్లో నిన్ను లేపేస్తా. నీ కథ ఏంటో తేలుస్తా’ అంటూ టీడీపీ కౌన్సిలర్ రామాంజనేయరెడ్డి.. వైఎస్సార్ జిల్లా ప్రొద్దుటూరు మున్సిపల్ కమిషనర్ వెంకటశివారెడ్డిపై చిందులు తొక్కాడు. మున్సిపాలిటీ పరిధిలో బుధవారం నుంచి పింఛన్ పంపిణీని ప్రారంభించగా, వైఎంఆర్ కాలనీలోని ప్రాథమిక పాఠశాల ఆవరణలో పింఛన్ పంపిణీకి సీనియర్ అకౌంటెంట్ నాగేంద్ర వెళ్లారు. 60 మంది వృద్ధులు పింఛన్ తీసుకునేందుకురాగా, ఇంతలో అక్కడికి వచ్చిన వార్డు కౌన్సిలర్ రామాంజనేయరెడ్డి పింఛన్ పంపిణీని అడ్డుకున్నారు.
విషయం తెలుసుకున్న కమిషనర్ అక్కడికి వెళ్లి, పింఛన్ పంపిణీని అడ్డుకోవడం సరికాదని, ఏదైనా సమస్య ఉంటే తనకు ఫిర్యాదు చేయాలన్నారు. అయితే పింఛన్ల కోసం తాను ముగ్గురి పేర్లు ఇవ్వగా, వారికి రాకపోవడంతో అడ్డుకుంటున్నానని కౌన్సిలర్ వెల్లడించారు. ఎన్నికల కోడ్ అమల్లో ఉన్నందున సమస్య రాకుండా పింఛన్ పంపిణీ చేస్తామని కమిషనర్ ఎంత చెప్పినా వినిపించుకోలేదు.
చివరికి పోలీసులకు ఫిర్యాదు చేస్తానని కమిషనర్ హెచ్చరించడంతో రామాంజనేయరెడ్డి రెచ్చిపోయారు. నిన్ను వారంలో చంపేస్తానంటూ తీవ్ర వ్యాఖ్యలు చేశారు. దీంతో కమిషనర్ త్రీటౌన్ పోలీసులకు ఫోన్ చేసి విషయాన్ని వివరించారు. పోలీసులు అక్కడికి వచ్చేలోపే కౌన్సిలర్ వెళ్లిపోగా, అక్కడున్న వృద్ధులకు పింఛన్ పంపిణీ చేశారు. ఈ వ్యవహారంపై పోలీసు స్టేషన్లో కమిషనర్ ఫిర్యాదు చేశారు. దీంతో కేసును వెనక్కి తీసుకోవాలంటూ కమిషనర్పై టీడీపీ నేతలు, మున్సిపల్ చైర్మన్ ఉండేల గురివిరెడ్డి బెదిరింపులకు పాల్పడ్డారు.