నిడదవోలు: అధికారం చేపట్టిన నాలుగేళ్లలో పథకాల అమలుతో పాటు అన్ని రంగాల్లో విఫలమైందని, అవినీతిలో మాత్రం నూటికి నూరు మార్కులు సాధించి పాసైందని వైఎస్సార్ సీపీ నిడదవోలు నియోజకవర్గ సమన్వయకర్త జి.శ్రీనివాసనాయుడు ధ్వజమెత్తారు. వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ జాతీయ అధ్యక్షుడు వైఎస్ జగన్మోహన్రెడ్డి ప్రజాసంకల్పయాత్రలో భాగంగా శనివారం నిడదవోలు చేరుకోగా భారీ బహిరంగ సభ నిర్వహించారు.
ఈ సందర్భంగా శ్రీనివాసనాయుడు మాట్లాడుతూ టీడీపీ నాయకులు దొంగల్లా దోచుకుంటున్నారని విమర్శించారు. ఇసుక, మట్టి మాఫియా నియోజకవర్గంలో చెలరేగిపోతుందన్నారు. దోచుకో దాచుకో అనే చందంగా టీడీపీ నాయకులు ఇసుకతో పాటు మట్టిని కూడా వదలడం లేదన్నారు. ప్రతి దాంట్లో అవినీతి రాజ్యమేలుతోందన్నారు. జన్మభూమి కమిటీల పేరుతో సంక్షేమ పధకాలను సైతం పేదలకు అందనివ్వడం లేదన్నారు. టీడీపీ గత ఎన్నికల్లో 600 హామీలు ఇచ్చి మాటతప్పిందన్నారు. ప్రత్యేక హోదా సాధన, రాజధాని నిర్మాణం, పోలవరం ప్రాజెక్టు నిర్మాణంలో టీడీపీ ప్రభుత్వం పూర్తిగా విఫలమైందన్నారు.
ఆర్వోబీ నిర్మాణం కూడా చేయలేరు
ఉభయ గోదావరి జిల్లాలకు వారథిగా ఉన్న ఆర్ఓబీ నిర్మాణం కూడా టీడీపీ వల్ల కాదని శ్రీనివాసనాయుడు అన్నారు. పట్టణంలో రోడ్లపై, అద్దె షాపుల్లో పనులు చేసకుని జీవనం సాగిస్తున్న ఆటో వర్కర్లకు ఆటో నగర్ నిర్మాణ హామిని కూడా నాయకులు మంటగలిపారని విమర్శించారు. పట్టణంలో ప్రధాన కాలువపై ఉన్న గడ్డర్ బ్రిడ్జి మరమ్మతులు చేపట్టిన అనతికాలంలోనే కూలిపోవడం టీడీపీ నాయకుల అవినీతికి నిదర్శనమన్నారు. వేలివెన్నులో రొయ్యల పరిశ్రమ ద్వారా నిత్యం దుర్గంధ వెదజల్లుతోందని ప్రజలు మెరపెట్టుకుంటున్నారన్నారు. అయినా ఎవరూ పట్టించుకోవడం లేదని పేర్కొన్నారు. ఫ్యాక్టరీ నుంచి దుర్వాసన రాకుండా చర్యలు తీసుకునేంత వరకు పోరాటం చేస్తామన్నారు. నియోజకవర్గ కేంద్రం నిడదవోలులో మార్కెట్ యార్డు కోసం కృషి చేస్తామన్నారు. రాజన్న రాజ్యం రానుందని, నవరత్నాల పథకాల ద్వారా ప్రజల జీవితాలకు భరోసా ఉంటుందని చెప్పారు.
జగన్మోహన్రెడ్డితోనే నిడదవోలుకు పూర్వవైభవం
మాజీ ఎమ్మెల్యే, పార్టీ కేంద్ర మండలి సభ్యులు జీఎస్ రావు మాట్లాడుతూ దివంగత మహానేత వైఎస్ రాజశేఖరరెడ్డి హయాంలో ఎంతో అభివృద్ధి చెందిన నిడదవోలుకు పూర్వ వైభవం రావాలంటే జగన్మోహన్రెడ్డిని ముఖ్యమంత్రిని చేయాల్సిన బాధ్యత అందరిపై ఉందన్నారు.
శ్రీనివాసనాయుడును ఎమ్మెల్యే చేయండి : రాజీవ్కృష్ణ
పార్టీ రాష్ట్ర కార్యదర్శి ఎస్.రాజీవ్కృష్ణ మాట్లాడుతూ నియోజకవర్గంలో స్పల్ప మెజార్టీతో విజయం సాధించలేకపోయానన్నారు. నా వ్యక్తిగత కారణం వల్ల ఇన్నాళ్లూ దూరంగా ఉన్నానన్నారు. ప్రస్తుతం మాజీ ఎమ్మెల్యే జీఎస్ రావు కుమారుడు, నా మంచి మిత్రుడు జి.శ్రీనివాసనాయుడును అత్యధిక మెజారిటితో గెలిపించి, జననేత జగన్మోహన్రెడ్డిని ముఖ్యమంత్రిని చేయాలని కోరారు. ఈ సభకు ప్రజలు పోటెత్తారు. సభలో పార్టీ పోలవరం కన్వీనర్ తెల్లం బాలరాజు, ఉండి కన్వీనర్ పాతపాటి సర్రాజు, రాజమండ్రి పార్లమెంటరీ జిల్లా అధ్యక్షుడు కొయ్యే మోషేన్రాజు, గోపాలపురం కన్వీనర్ తలారి వెంకట్రావు, రాష్ట్ర కార్యవర్గ సభ్యులు ముళ్లపూడి శ్రీనివాసచౌదరి, జిల్లా రైతు సంఘ అధ్యక్షుడు బూరుగుపల్లి సుబ్బారావు, జిల్లా మైనారిటీ సెల్ అధ్యక్షుడు ఎండీ అస్లాం, సత్తి వేణుమాధవరెడ్డి, పట్టణ అధ్యక్షుడు మద్దిపాటి ఫనీంద్ర, మండల అధ్యక్షుడు అయినీడి పల్లారావు, జక్కంశెట్టి రాకేష్, ఎంపీపీ ఎం.సూరిబాబు, జి.రంగారావు, పొలయ్య, కె.ప్రసాద్, భాస్కర రామయ్య, గోపిరెడ్డి శ్రీనివాస్, పి.రతీదేవి పాల్గొన్నారు.