కౌన్సిలర్ భర్తపై టీడీపీ నేత దాడి | Sakshi
Sakshi News home page

కౌన్సిలర్ భర్తపై టీడీపీ నేత దాడి

Published Tue, Oct 7 2014 1:19 AM

TDP leader attacked Councillor husband

మార్కాపురం : జిల్లాలో టీడీపీ నేతలు బరితెగిస్తున్నారు. అధికారం ఉంది కదా.. అని ఇష్టం వచ్చినట్లు దాడులకు తెగబడుతున్నారు. వైఎస్సార్ సీపీ కార్యకర్తలు, నాయకులే టార్గెట్‌గా వ్యవహరిస్తున్నారు. చిన్నదానికి పెద్దదానికి రాద్దాంతం చేస్తున్నారు. పట్టణంలోని ఒకటో బ్లాక్ విశ్వేశ్వర థియేటర్ సమీపంలో పైపులైన్ నిర్మాణ వ్యవహారంలో వైఎస్సార్‌సీపీ కౌన్సిలర్ జి.ఆదిలక్ష్మి భర్త, ఆ పార్టీ నేత శివారెడ్డిపై టీడీపీ నేత సోమవారం దాడి చేశాడు. క్షతగాత్రుడు శివారెడ్డి కథనం ప్రకారం.. ఒకటో బ్లాక్‌లో పైపులైన్ నిర్మించేందుకు మున్సిపల్ కార్మికులు విశ్వేశ్వర థియేటర్ సమీపంలోకి వచ్చారు. టీడీపీ నేత జి.నారాయణరెడ్డి వచ్చి పైప్‌లైన్ నిర్మించకుండా కార్మికులను అడ్డుకున్నాడు.
 
 మున్సిపల్ సిబ్బంది ఈ విషయాన్ని శివారెడ్డితో చెప్పారు. విషయం తెలుసుకునేందుకు ఆయన సంఘటన స్థలానికి వెళ్లగా నారాయణరెడ్డి దాడి చేశాడు. అడ్డువచ్చిన తొమ్మిదో తరగతి చదువుతున్న శివారెడ్డి కొడుకు నాగ కల్యాణ్‌పై కూడా దాడికి తెగబడ్డాడు. ఇదే సంఘటనలో ఎస్.విజయలక్ష్మి, వెంకటేశ్వరరెడ్డిలకు స్వల్ప గాయాలయ్యాయి. క్షతగాత్రులను మార్కాపురం ఏరియా వైద్యశాలకు తరలించి చికిత్స చేశారు. ఈ సంఘటనలో నారాయణరెడ్డికి కూడా గాయాలయ్యాయి. ఇరువర్గాల ఫిర్యాదులు స్వీకరించి పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. గ్రామాల్లో ఘర్షణలకు పాల్పడితే చర్యలు తీసుకుంటామని పోలీసులు హెచ్చరిస్తున్నారు.
 

Advertisement
Advertisement