Sakshi News home page

టీడీపీలో అంతర్గత పోరు

Published Sat, Feb 28 2015 2:53 AM

TDP party

నెల్లూరు, సిటీ: నగర పాలక సంస్థ స్టాండింగ్ కమిటీ ఎన్నికలు తెలుగు తమ్ముళ్ళ మధ్య అంతర్గత పోరుకు తెరలేపుతోంది. స్టాండింగ్ కమిటీ ఎన్నికల్లో ఐదుగురిని ఎన్నుకోవాల్సి ఉంది. ప్రస్తుతం తెలుగుదేశం పార్టీ బలం 31 ఉండగా, వైఎస్సార్‌సీపీ బలం 19 ఉంది. వాస్తవానికి ఎన్నికల్లో టీడీపీ తరఫున 17 మంది ఎన్నిక కాగా, ఒక ఇండిపెండెంట్‌తో కలిపి 18 స్థానాలు ఉన్నాయి వైఎస్సార్‌సీపీ నుంచి 32 మంది ఎన్నికయ్యారు. అయితే మేయర్‌తో సహా వైఎస్సార్‌సీపీ కార్పొరేటర్లు టీడీపీలోకి వెళ్లారు.
 
 ఈ పరిస్థితుల్లో జరుగుతున్న స్టాండింగ్ కమిటీ ఎన్నికల్లో మేయర్ వెంట వెళ్లిన సభ్యులకు ప్రాధాన్యం లభించే అవకాశాలు కనిపించడం లేదు. టీడీపీ తరఫున ఎన్నికయిన సీనియర్‌లకు స్టాండింగ్ కమిటీల్లో చాన్స్ దక్కవచ్చని భావిస్తున్నారు. ముఖ్యంగా మేయర్ వెంట వెళ్లిన 10 మంది మహిళల్లో ఒక్కరికి కూడా స్టాండింగ్ కమిటీలో ఎంపికయ్యే అవకాశాలు లేవు. ఇది మహిళా సభ్యుల్లో అసంతృప్తికి దారితీస్తుంది. దీని ఫలితం ఎన్నిక రోజున (9వ తేదీన) బహిర్గతమయ్యే పరిస్థితులు ఉన్నాయి. టీడీపీ సీనియర్ కార్పొరేటర్లలో నలుగురికి స్టాండింగ్ కమిటీ ఎన్నికల్లో పోటీకి నిలబెట్టేందుకు నేతలు ఆసక్తి చూపుతున్నారు.
 
 వారిలో జెడ్ శివప్రసాద్, నూనె మల్లికార్జున్‌యాదవ్, కిన్నెర ప్రసాద్, దాసరి రాజేష్‌కు దక్కే అవకాశం ఉంది. మహిళా కోటాలో అంచూరి జానకి, కొత్తూరు శైలజ, బొల్లినేని శ్రీవిద్యలో ఒక్కరికి స్థానం దక్కనున్నట్లు సమాచారం. మేయర్ వర్గం నుంచి బాలకోటేశ్వరరావుకు మాత్రమే స్థానం దక్కనున్నట్లు సమాచారం. రహస్య ఓటింగ్ కావడంతో బలాబలాలు తారుమారయ్యే అవకాశం కనిపిస్తుంది. మేయర్ వర్గమైన మహిళా ఓట్లు చీలినట్లయితే వైస్సార్‌సీపీకి బలం చేకూరుతుంది. రెండు పార్టీల నుంచి స్టాండింగ్ కమిటీ ఎన్నికల్లో నిలబడే సభ్యుల పేర్లను నేడు ఖరారు చేయనున్నారు. సాయంత్రం 3 గంటల వరకు నామినేషన్ ప్రక్రియ జరుగుతుంది.
 

Advertisement

తప్పక చదవండి

Advertisement