కింకర్తవ్యం | Sakshi
Sakshi News home page

కింకర్తవ్యం

Published Sat, Nov 16 2013 4:41 AM

TDP party's chief Chandrababu Naidu have become eager to bring to its former glory

సాక్షి ప్రతినిధి, ఆదిలాబాద్ :  జిల్లాలో తెలుగుదేశం పార్టీకి పూర్వ వైభవం తీసుకురావాలని ఆ పార్టీ అధినేత చంద్రబాబు నాయుడు తహతహలాడుతున్నారు. ఈ క్రమంలో పార్టీ పటిష్టంపై ఆయన దృష్టి సారించారు. నియోజకవర్గం ఇన్‌చార్జీల మార్పులు, చేర్పులు, యువతరం నేతలకు అవకాశం కల్పించడం, వరుస కార్యక్రమాల ద్వారా పార్టీని ప్రజల్లోకి తీసుకువెళ్లేందుకు నేతలను సన్నద్ధం చేస్తున్నారు. ఈ క్రమంలోనే చంద్రబాబు రెండు రోజుల క్రితం జిల్లాకు చెందిన పొలిట్ బ్యూరో సభ్యులు, ఎంపీలు, ఎమ్మెల్యేలు, పార్టీ అధ్యక్షులు, సీనియర్ నేతలతో సమావేశం నిర్వహించారు.

 అయితే 2009 ఎన్నికల్లో ఒక పార్లమెంట్, నాలుగు ఎమ్మెల్యే స్థానాలను టీడీపీ కైవసం చేసుకుంది. తెలంగాణ రాష్ట్రం ఏర్పాటుపై ఆయన అనుసరించిన రెండుకళ్ల సిద్ధాంతానికి ఇప్పటికే ఇద్దరు ఎమ్మెల్యేలు ఆ పార్టీకి దూరం అయ్యారు. ఆ పార్టీ జిల్లా మాజీ అధ్యక్షుడు గోనె హన్మంతరావు సహా పలువురు సీనియర్లు, నియోజకవర్గం ఇన్‌చార్జీలు పార్టీకి గుడ్‌బై చెప్పారు. ఈ నేపథ్యంలో తెలంగాణపై స్పష్టత ఇవ్వకుండా తెలంగాణ జిల్లాల్లో టీడీపీని పటిష్టపరచడం ఎలా సాధ్యం అవుతుందన్న చర్చ ఆ పార్టీ నేతల్లో మొదలైంది.
 పార్టీ పూర్వవైభవం కోసం అభిప్రాయ సేకరణ
 హైదరాబాద్ పార్టీ కార్యాలయంలో నిర్వహించిన సమావేశానికి పొలిట్‌బ్యూరో సభ్యుడు, ఆదిలాబాద్ ఎంపీ రాథోడ్ రమేశ్, జిల్లా అధ్యక్షుడు, బోథ్ ఎమ్మెల్యే గోడం నగేశ్, ఖానాపూర్ ఎమ్మెల్యే సుమన్ రాథోడ్, రాష్ర్ట, జిల్లా నాయకులు యూనిస్ అక్బానీ, పాయల శంకర్, లోలం శ్యాంసుందర్‌తోపాటు పలువురు ఇన్‌చార్జీలు హాజరయ్యారు. ఆదిలాబాద్ జిల్లాలో పదికి పది అసెంబ్లీ స్థానాలు గెలిపించుకునేందుకు కార్యోన్ముఖులు కావాలని చంద్రబాబు సూచించినట్లు తెలిసింది. ఆయన వ్యాఖ్యలపై  స్పందించిన కొందరు నాయకులు తెలంగాణపై పార్టీ వైఖరి స్పష్టంగా లేకపోవడం వల్ల అనేక ఇబ్బందులు ఎదుర్కోవలసి వస్తుం దని, భవిష్యత్‌లో ఇదే పరిస్థితి ఉంటే జనాల్లోకి వెళ్లడం కూడా కష్టమేనని చెప్పినట్లు సమాచారం.

ఇందుకు బాబు స్పందిస్తూ ‘తెలంగాణపై టీడీపీ వైఖరి స్పష్టంగా ఉంది, మనం ఇచ్చిన లేఖ మేరకు కేంద్రం తెలంగాణకు ప్రకటించింది.. ఇదే విషయాన్ని ప్రజ లకు వివరించండి.. కాంగ్రెస్, టీఆర్‌ఎస్ విమర్శలను తిప్పికొట్టండి’ అని సూచించి నట్లు పార్టీ వర్గాలు చెప్తున్నాయి. కాగా పది నియోజకవర్గాల్లో ప్రస్తుతం పనిచేస్తున్న ఇన్‌చార్జీల పనితీరును సమీక్షించారు. అయితే చెన్నూరు నియోజకవర్గం నుంచి ప్రాతిని థ్యం వహించిన మాజీ మంత్రి బోడ జనార్దన్ రాజీనామా తర్వాత అక్కడ నేతల మ ధ్య సమన్వయం కుదరడం లేదు. చెన్నూరు ఇన్‌చార్జి కోసం అందుగుల శ్రీనివాస్, డాక్టర్ నరేశ్‌లు పోటీపడగా, జిల్లాలోనే పరిష్కరించుకోవాలని సూచించినట్లు తెలిసింది. కాగా, జిల్లా నేతలు, చంద్రబాబు జరిపిన సమావేశంలో భవిష్యత్ కార్యాచరణకు పలు అభిప్రాయాలు వెల్లడించినట్లు సమాచారం.

Advertisement
Advertisement