విద్యార్థిని వేధిస్తున్న ఉపాధ్యాయుడికి దేహశుద్ధి | Sakshi
Sakshi News home page

విద్యార్థిని వేధిస్తున్న ఉపాధ్యాయుడికి దేహశుద్ధి

Published Sat, Apr 23 2016 1:36 AM

విద్యార్థిని వేధిస్తున్న ఉపాధ్యాయుడికి దేహశుద్ధి - Sakshi

విజయపురిసౌత్ : పాఠశాల పూర్వ విద్యార్థినిని ప్రేమించమని వేధిస్తున్న ఉపాధ్యాయుడికి గ్రామస్తులు దేహశుద్ధి చేసిన సంఘటన మాచర్ల మండలంలోని తాళ్ళపల్లి గ్రామంలో శుక్రవారం చోటుచేసుకుంది. విజయపురిసౌత్ ఎస్‌ఐ వై.కోటేశ్వరరావు కథనం ప్రకారం.. గ్రామంలోని జిల్లా పరిషత్ హైస్కూల్‌లో ఇంగ్లిషు ఉపాధ్యాయుడిగా పనిచేస్తున్న రమావత్ రామునాయక్ పాఠశాలలో గతంలో చదివిన పూర్వ విద్యార్థినిని ప్రేమించాలంటూ కొంత కాలంగా వేధిస్తున్నాడు. అదే పాఠశాలలో చదువుతున్న పూర్వ విద్యార్థిని చెల్లెలిని అక్కకు ప్రేమలేఖలు అందించాలంటూ ఒత్తిడి చేస్తున్నాడు. ప్రేమలేఖలు ఇవ్వకపోతే పరీక్షల్లో మార్కులు తగ్గిస్తానంటూ బెదిరిస్తున్నాడు.

ఈ విషయాన్ని విద్యార్థిని తల్లిదండ్రులకు తెలపటంతో రామునాయక్‌కు గ్రామస్తులు  దేహశుద్ధి చేసి పోలీస్‌స్టేషన్‌లో అప్పగించారు. గతంలో కూడా రామునాయక్ విద్యార్థినులను తలకు కొబ్బరి నూనె రాయాలని, తలకు జండూబామ్ పూయాలని లైంగిక వేధింపులకు కూడా పాల్పడ్డాడని ఆరోపణలు ఉన్నాయని ఎస్‌ఐ తెలిపారు. ఎస్‌ఐ కోటేశ్వరరావు తాళ్ళపల్లికు చేరుకుని పాఠశాలలో విద్యార్థినులు, ఉపాధ్యాయులను విచారణ చేశారు. మాచర్ల ఎంఈవో వేముల నాగయ్య, మాచర్ల జెడ్పీటీసీ శేరడ్డి గోపిరెడ్డి పాఠశాలకు చేరుకుని సంఘటన వివరాలను తెలుసుకున్నారు. కేసు దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్సై తెలిపారు.

Advertisement
Advertisement