టీచర్లకు షోకాజ్ | Sakshi
Sakshi News home page

టీచర్లకు షోకాజ్

Published Sat, Nov 14 2015 12:33 AM

Teachers to show cause

నిబంధనలకు విరుద్ధంగా పాయింట్ల    కేటాయింపుపై 3,850 మందికి నోటీసులు
246 మంది హెచ్‌ఎంలు,ఎంఈవోలు, డీవైఈవోలకు సైతం

 
మచిలీపట్నం : ఇటీవల జరిగిన ఉపాధ్యాయుల వెబ్ కౌన్సెలింగ్‌లో పాయింట్ల కేటాయింపులో తప్పుడు సమాచారం ఇచ్చిన ఉపాధ్యాయులకు జిల్లా విద్యాశాఖాధికారి ఎ.సుబ్బారెడ్డి శుక్రవారం సాయంత్రం షోకాజ్ నోటీసులు జారీ చేశారు. నిబంధనలకు విరుద్ధంగా పాయింట్లు ఎలా కేటాయించుకున్నారని ప్రశ్నిస్తూ.. దీనికి సమాధానం చెప్పాలని షోకాజ్ నోటీసులు ఇచ్చారు. 3,850 మంది టీచర్లు, 246 మంది ప్రధానోపాధ్యాయులు, అన్ని మండలాల  విద్యాశాఖాధికారులు, డీవైఈవోలకు ఈ షోకాజ్ నోటీసులను అందజేసినట్లు ఆయన చెప్పారు. పాయింట్ల కేటాయింపులో ఉపాధ్యాయులు తప్పులు చేస్తే హెచ్‌ఎంలు, ఎంఈవోలు, డీవైఈవోలు ఎలా కౌంటర్ సైన్ చేశారని, దీనికి సమాధానం చెప్పాలని నోటీసుల్లో పేర్కొన్నారు.

 నెల రోజుల పాటు వెబ్ కౌన్సెలింగ్ పేరుతో జాప్యం చేసిన ప్రభుత్వం కౌన్సెలింగ్ ప్రక్రియ ముగిసిన తరువాత ఉపాధ్యాయులకు షోకాజ్ నోటీసులు జారీ చేయటంపై పీఆర్టీయూ జిల్లా ఉపాధ్యక్షుడు డి.శ్రీను ఆగ్రహం వ్యక్తం చేశారు. వెబ్ కౌన్సెలింగ్ విధానంలోనే ప్రభుత్వం లోపభూయిష్టంగా వ్యవహరించిందని, గత డీఈవోను ఈ కారణం చూపి సస్పెండ్ చేశారని ‘సాక్షి’తో అన్నారు. విద్యాశాఖ వైఖరిపై పోరుబాట పట్టనున్నట్లు ఆయన చెప్పారు.
 

Advertisement

తప్పక చదవండి

Advertisement