ఒక్క గ్రామాన్నీ వదులుకోం | Sakshi
Sakshi News home page

ఒక్క గ్రామాన్నీ వదులుకోం

Published Wed, Mar 12 2014 2:21 AM

telangana caved  residents in rehabilitation

 భద్రాచలం, న్యూస్‌లైన్:జిల్లాలోని ఏ ఒక్క గ్రామా న్నీ వదులుకునేది లేదని కేంద్ర మంత్రి పోరిక బలరామ్ నాయక్ అన్నారు.ఆయన మంగళవారం భద్రాచలంలో జరిగిన పార్టీ డివిజన్‌స్థాయి సమావేశంలో మాట్లాడుతూ.. పోలవరం ముంపు పరిధిలోని అన్ని గ్రామాలు తెలంగాణలోనే ఉం టాయన్నారు. ‘పోలవరం’ నిర్వాసితులకు తెలంగాణ రాష్ట్రంలోనే పునరావాసం కల్పిస్తామన్నారు. పోలవరం విషయంలో సీపీఎం రెండు నాల్కల ధోరణి అవలంబిస్తున్నదని ఆరోపించారు.

 ఇక్కడ పోలవరం ప్రాజెక్టు కట్టవద్దని పోరాడుతున్న సీపీఎం.. పార్లమెంటులో ఎందుకు నోరు మెదపలేదని ప్రశ్నించారు. వారికి ప్రజలు తగిన బుద్ధి చెప్పాలని కోరారు. ‘పోలవరం ముంపు ప్రాంతా లు కూడా తెలంగాణలోనే ఉంటాయని మీరు చెబుతున్నారు. కానీ, 134 రెవెన్యూ గ్రామాలను ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కలిపారు కదా..!’ అని విలేకరులడిగిన ప్రశ్నకు సమాధానమిచ్చేందుకు మంత్రి తడబడ్డారు. తమ ఒత్తిడితోనే ముంపు మండలాల విలీనం ఆర్డినెన్స్ ఆగిపోయిందన్నారు. వచ్చే ప్రభుత్వం అంగీకరిస్తేనే ముంపు మండలాల విలీనం జరుగుతుందని, లేదంటే ఆ గ్రామాలన్నీ తెలంగాణలోనే ఉంటాయని అన్నారు. జడ్పీటీసీ, ఎంపీటీసీ ఎన్నికల్లో అభ్యర్థుల ఎంపికకు కమిటీ వేయనున్నట్టు చెప్పారు.

 పోరికపై జైరాం రమేశ్ అసంతృప్తి
 విలేకరుల సమావేశానికి ముందు.. పోరిక బలరామ్‌నాయక్‌కు మరో కేంద్ర మంత్రి, జీవోఎం సభ్యుడు జైరాం రమేశ్ ఫోన్ చేశారు. వారిద్దరి సంభాషణనుబట్టి.. పోలవరం ప్రాజెక్ట్ నిర్మాణ విషయంలో ప్రభుత్వ నిర్ణయానికి వ్యతిరేకంగా మాట్లాడినట్లుగా పత్రికల్లో వచ్చిన కథనాలపై జైరాం అసంతృప్తి వ్యక్తం చేసినట్టుగా అర్థమైంది. దీనికి అనుగుణంగానే బలరామ్ నాయక్ సంజాయిషీ ఇచ్చుకున్నారు. తాను అలా అనలేదని, పత్రికల్లోనే తప్పుగా వచ్చిందని చెప్పారు.

Advertisement
Advertisement