హైదరాబాద్: సీమాంధ్రులు ఎంత రెచ్చగొట్టినా తెలంగాణా వాదులు రెచ్చిపోకుండా సహనం పాటించాలని తెలంగాణ కాంగ్రెస్ నేతలు విజ్ఞప్తి చేశారు. యూపీఏ సమన్వయ కమిటీ తెలంగాణ రాష్ట్ర ఏర్పాటుకు అనుకూలంగా నిర్ణయం తీసుకున్న నేపథ్యంలో తెలంగాణ కాంగ్రెస్ సారథ్య బృందం సద్భావనా గోష్టిని నిర్వహించారు. ఈ కార్యక్రమానికి మంత్రి జానారెడ్డి, ఎంపీలు వి.హనుమంతరావు, ఆనంద భాస్కర్, ఎమ్మెల్సీ డి.శ్రీనివాస్ సహా ఇతర కాంగ్రెస్ నేతలు హాజరైయ్యారు.సీమాంధ్ర ఉద్యోగులు, నేతలు ఎంత రెచ్చగొట్టినా తెలంగాణా వాదులు రెచ్చిపోకుండా సహనం పాటించాలన్నారు.
తెలంగాణ జాప్యంపై ఆందోళన ఉన్నందున ప్రత్యేక రాష్ట్ర బిల్లును వెంటనే పార్లమెంట్ లో ప్రవేశపెట్టాలని వారు ప్రభుత్వాన్ని కోరారు. సీమాంధ్ర సమస్యల పరిష్కారానికి టి.కాంగ్ నేతలు, తెలంగాణవాదులు సహకరిస్తారన్నారు. ఎటువంటి అవాంచనీయ సంఘటనలు జరుగకుండా తెలంగాణ వాదులు సామరస్యం పాటించాలన్నారు. హైకమాండ్ రాష్ట్ర విభజనకే కట్టుబడి ఉందని మరోమారు స్పష్టం చేశారు.
ప్రజల మధ్య ద్వేషాలు పెరగడానికి సీమాంధ్ర నేతలే కారణమని టీ.కాంగ్ నేతలు అభిప్రాయపడ్డారు.
సీఎం కిరణ్ కుమార్ రెడ్డి వ్యవహారంపై తెలంగాణ నేతలు మండిపడ్డారు. తెలంగాణ విభజన అనివార్యమనే సీఎం ఇష్టానుసారం జీ వోలు ఇస్తున్నారని, ఆయన వ్యవహారాన్ని తెలంగాణ మంత్రులు కనిపెట్టాలని వారు కోరారు. తెలంగాణ ప్రభుత్వం ఏర్పడ్డాక సీఎం కిరణ్ నిర్ణయాలన్నీ సమీక్షిస్తుందన్నారు. సెప్టెంబర్ 17ను తెలంగాణ ఆత్మగౌరవ దినంగా పాటించాలని తెలంగాణ ప్రజలకు తెలిపారు.