తెలంగాణ రాష్ట్రంలోనే ప్రాజెక్టులకు మహర్దశ | Sakshi
Sakshi News home page

తెలంగాణ రాష్ట్రంలోనే ప్రాజెక్టులకు మహర్దశ

Published Fri, Sep 13 2013 3:22 AM

Telangana state will get projects boom

నిజాంసాగర్, న్యూస్‌లైన్: నిజాం నవాబు కాలంలో నిర్మించిన సాగు, తాగునీటి ప్రాజెక్టులు ప్రభుత్వ పాలకుల నిర్లక్ష్యం వల్లే మరమ్మతులకు నోచుకోవడం లేదని నిజాంపరిపాలనా చీఫ్ ఇంజినీర్ నవాబ్‌అలీ నవాజ్‌జంగ్ బహదూర్ మనుమళ్లు నవాబ్‌మీర్ అక్బర్‌అలీ, నవాబ్‌మీర్ హైమద్‌అలీ పేర్కొన్నారు. హైదరాబాద్ నుంచి వచ్చిన వారు గురవారం నిజాంసాగర్ ప్రాజెక్టుతో పాటు, గోల్‌బంగ్లా, రెస్ట్‌హౌస్‌లను  పరిశీలించారు. ఈసందర్భంగా స్థానిక విలేకరులతో మాట్లాడారు. గ్రానైట్‌రాళ్లు, డంగు సున్నంతో నిజాంసాగర్ ప్రాజెక్టును నిర్మించడం వల్ల ఇప్పటికీ పటిష్టంగా ఉందన్నారు. ప్రాజెక్టు కట్టకు అక్కడక్కడ పగుళ్లు వచ్చినా ప్రస్తుత పాలకులు మరమ్మతులు చేపట్టడం లేదన్నారు.
 
తెలంగాణ రాష్ట్రంలోనే తెలంగాణ ప్రాజెక్టులకు మహర్దశ లభిస్తుందని వారు ఆశాభావం వ్యక్తం చేశారు. ప్రాజెక్టు దిగువన నిర్మించిన స్విమ్మింగ్‌ఫూల్‌లో నీటి సౌకర్యం లేక మూతపడటం బాధాకరంగా ఉందన్నారు. ప్రాజెక్టు ఆధునికీకరణతో పాటు స్విమ్మింగ్‌పూల్, సమ్మర్‌బాగ్ మరమ్మతులు తెలంగాణ రాష్ట్రంలోనే సాధ్యమవుతాయన్నారు. ని జాంకాలంలో నిర్మించిన ప్రాజెక్టులు, అప్పటి ఇంజనీర్ల మేథోమధనం చిరకాలం గుర్తుంటుందని అన్నారు. ప్రాజెక్టును సందర్శించిన చీఫ్ ఇంజినీర్ మనుమళ్లకు స్థానిక నీటిపారుదల శాఖ అధికారులు కట్టడాలను చూపించి ప్రాజెక్టు సామర్థ్యం వివరాలను తెలియజేశారు. వారి వెంట స్థానిక నీటిపారుదలశాఖ అధికారులు, సిబ్బంది ఉన్నారు.
 

Advertisement
Advertisement