కేంద్రానికి రూ.1000 కోట్లతో ప్రతిపాదనలు | Sakshi
Sakshi News home page

కేంద్రానికి రూ.1000 కోట్లతో ప్రతిపాదనలు

Published Sat, Jan 17 2015 1:26 AM

కేంద్రానికి రూ.1000 కోట్లతో ప్రతిపాదనలు - Sakshi

  • ఆర్ అండ్ బీ మంత్రి తుమ్మల
  • సాక్షి, హైదరాబాద్: వామపక్ష తీవ్రవాద ప్రభావిత జిల్లాల సరసన ఆదిలాబాద్, కరీంనగర్, వరంగల్‌లను కేంద్రం ప్రభుత్వం చేర్చిందని తెలంగాణ రహదారులు, భవనాల మంత్రి తుమ్మల నాగేశ్వర్‌రావు పేర్కొన్నారు. దీంతో రాష్ట్రంలో తీవ్రవాద ప్రాబల్యమున్న జిల్లాల సంఖ్య నాలుగుకు పెరిగిందని, ఈ జిల్లాల్లో రూ.వెయ్యి కోట్లతో అభివృద్ధి పనులు చేపట్టేందుకు ప్రతిపాదనలు సిద్ధం చేసి కేంద్రప్రభుత్వానికి పంపించామన్నారు.

    శుక్రవారం సచివాలయంలో సీఎం కేసీఆర్‌తో సమావేశమైన అనంతరం ఆయన విలేకరులతో మాట్లాడారు. కమిషనరేట్ ఆఫ్ టెండర్స్ (సీఓటీ)ను బలోపేతం చేసే అంశంపై ఈ సమావేశంలో చర్చించామన్నారు. ప్రభుత్వ శాఖల ఆధ్వర్యంలో జరిగే పనులు/టెండర్లకు సీఓటీ అనుమతి తప్పనిసరి చేసే యోచనలో ఉన్నామన్నారు. సీఓటీ విధివిధానాలను పునః సమీక్షించి కొత్త విధాన రూపకల్పన చేస్తామన్నారు.

    ఈ అంశంపై నీటిపారుదల, పంచాయతీరాజ్, ఆర్‌అండ్‌బీ, మునిసిపల్ శాఖలతో చర్చించి నివేదిక అందజేయాలని సీఎం కేసీఆర్ సూచించారన్నారు. టెండర్లకు అనుమతుల జారీలో సీఓటీ రెండూ మూడు నెలల సమయం తీసుకుంటుండడంతో పనుల్లో తీవ్ర జాప్యం జరుగుతోందన్నారు. ఈ నేపథ్యంలో టెండర్ల అనుమతికి నిర్ణీత గడువు విధిస్తామన్నారు.

    ప్రస్తుత నిబంధనల ప్రకారం రూ.2 కోట్లకు పైగా వ్యయం చేసే పనులకు సీఓటీ అనుమతి తీసుకోవాల్సి ఉందని, ఖర్చులు పెరిగిన నేపథ్యంలో ఈ పరిమితిని పెంచే విషయాన్ని పరిశీలిస్తామన్నారు. గోదావరి, సీలేరు నదులపై ఖమ్మం జిల్లాలో నిర్మిస్తున్న వంతెనలను ఈ ఏడాది మేలోగా పూర్తిచేస్తామన్నారు. తీవ్రవాద ప్రభావిత జిల్లాలకు కేంద్రం మంజూరు చేసిన ప్రాజెక్టుల పురోగతిపై ఇటీవల కేంద్రమంత్రి నితిన్ గడ్కరీ నిర్వహించిన సమీక్షలో ఈ మేరకు హామీ ఇచ్చామని తెలిపారు.

Advertisement
Advertisement