కాలువలో మునిగి ఇద్దరు బాలురు మృతి | Sakshi
Sakshi News home page

కాలువలో మునిగి ఇద్దరు బాలురు మృతి

Published Sun, Aug 30 2015 2:25 AM

కాలువలో మునిగి ఇద్దరు బాలురు మృతి - Sakshi

ఈతకు వెళ్లి మృత్యుఒడికి..
ఖాజీపాలెం సమీపంలో  దుర్ఘటన
 
 పిట్టలవానిపాలెం : సరదాగా ఈతకు వెళ్లిన ఇద్దరు బాలురు ప్రమాదవశాత్తు ఊబిలో మునిగి మృతి చెందిన ఘటన జిల్లాలో శనివారం జరిగింది. స్థానికుల కథనం మేరకు... పిట్టలవానిపాలెం మండలం అలకాపురం గ్రామానికి చెందిన లారీ డ్రైవర్ సాగి సత్యనారాయణరాజు కుమారుడు సాగి వేణుగోపాలవర్మ (12), ఖాజీపాలెం గ్రామానికి చెందిన దండు నరసింహమూర్తి రాజు కుమారుడు దండు నితిన్ వర్మ (11) స్నేహితులు. వేణుగోపాలవర్మ ఖాజీపాలెం మంతెన సుబ్బరాజు జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో 9 వతరగతి చదువుతుండగా నితిన్ వర్మ స్థానిక ప్రయివేటు పాఠశాలలో 8 వతరగతి చదువుతున్నాడు.

శనివారం పాఠశాలలకు సెలవు కావడంతో వీరిద్దరు మరికొందరు స్నేహితులతో కలిసి ఖాజీపాలెం శివారు రామ్‌నగర్ సమీపంలోని తెనాలి మురుగు కాలువలో ఈతకు వెళ్లారు. ప్రమాదవశాత్తూ కాలుజారి వేణుగోపాలవర్మ, నితిన్‌వర్మ ఊభిలో పడి గల్లంతయ్యారు. స్నేహితులు ద్వారా విషయం తెలుసుకున్న గ్రామస్తులు వలలతో వచ్చి కాలువలో జాలర్లతో కలిసి వెతికారు. రెండు గంటల తర్వాత ఇద్దరు బాలుర మృతదేహాలు లభ్యమయ్యాయి.

 ఆరునెలల్లోనే మరో విషాదం...  సత్యనారాయణరాజు ఆరు నెలల క్రితం రోడ్డు ప్రమాదంలో మృతి చెందాడు. భర్త చనిపోయిన కొద్ది నెలల్లోనే కుమారుడు కూడా చనిపోవడంతో వేణుగోపాలవర్మ తల్లి శోకంలో మునిగిపోయింది.

Advertisement
Advertisement