ప్లీజ్... చందాలివ్వండి.. | Sakshi
Sakshi News home page

ప్లీజ్... చందాలివ్వండి..

Published Fri, Dec 20 2013 3:08 AM

the government is expected to be very significant

ప్రొద్దుటూరు, న్యూస్‌లైన్: వ్యాయామ విద్యకు ఎంతో ప్రాధాన్యత ఇస్తున్నట్లు ప్రభుత్వం ప్రకటిస్తోంది.   వచ్చే ఏడాది నుంచి వ్యాయమ విద్యను పాఠ్యాంశంగా కూడా చేర్చబోతున్నారు. అయితే క్రీడల నిర్వహణపై మాత్రం ప్రభుత్వం దృష్టి సారించడం లేదు. ఈ కారణంగా నిర్వాహకులు ప్రతి సందర్భంలో దాతలపై ఆధారపడాల్సి వస్తోంది. ఇప్పటికే చాలా మంది వ్యాయామ ఉపాధ్యాయులకు చేతి చమురు వదిలింది.
 
 ఈ విధంగానే ప్రస్తుతం ప్రొద్దుటూరు జోనల్ స్పోర్ట్స్ మీట్ కూడా జరుగుతోంది. గతంలో మండల స్థాయి పోటీలు నిర్వహించగా ఈ నెల 20, 21 తేదీలలో ప్రొద్దుటూరులోని అనిబిసెంట్ ఉన్నత పాఠశాల మైదానంలో జోనల్ పోటీలను నిర్వహిస్తున్నారు. ఈ పోటీల నిర్వహణకు సంబంధించి ప్రభుత్వం నుంచి నిధులు రాకపోవడంతో వ్యాయామ ఉపాధ్యాయులతోపాటు పోటీలు నిర్వహించే ఊటుకూరి వీరయ్య ప్రభుత్వ బాలుర ఉన్నత పాఠశాల ప్రధానోపాధ్యాయుడు శివప్రసాద్  ప్రముఖులందరినీ కలిసి విరాళాలు సేకరించే పనిలో నిమగ్నమయ్యారు. ప్రొద్దుటూరు డివిజన్ పరిధిలోని ఉన్నత పాఠశాలల నుంచి 1500 మంది విద్యార్థులు హాజరు కానున్నారు.
 
 రెండు రోజుల పాటు కేవలం భోజన నిర్వహణకే భారీ మొత్తంలో డబ్బు ఖర్చయ్యే అవకాశం ఉంది. భోజన ఖర్చులు, ఏర్పాట్లకు గాను సుమారు రూ.లక్ష వరకు ఖర్చయ్యే అవకాశం ఉందని అంచనా వేస్తున్నారు. ఇందుకుగాను వ్యాయామ ఉపాధ్యాయులు విరాళాలు సేకరిస్తున్నారు. నిబంధనల ప్రకారం ప్రభుత్వం ఈ పోటీల నిర్వహణకు రూ.10వేలు చెల్లించాల్సి ఉండగా ఇంత వరకు ఇవ్వలేదు.
 
 ప్రముఖులనందరినీ కలిశాం
 జోనల్ స్పోర్ట్స్ మీట్ నిర్వహణకు ప్రముఖులనందరినీ కలిసి విరాళాలు సేకరిస్తున్నాం. ఇప్పటికే కొందరు చెప్పిన డబ్బు ఇవ్వగా మరికొందరు ఇస్తామని ప్రకటించారు. ఏది ఏమైనా స్పోర్ట్స్‌మీట్‌ను ఘనంగా నిర్వహిస్తున్నాం.
 

Advertisement
Advertisement