ఇక పల్లెపల్లెకూ ఇంటర్నెట్ | Sakshi
Sakshi News home page

ఇక పల్లెపల్లెకూ ఇంటర్నెట్

Published Fri, Aug 15 2014 2:00 AM

The Internet is composed of rural countryside

ఏపీలో 28 వేల కిలోమీటర్ల మేర ఫైబర్ ఆప్టిక్ కేబుల్ ఏర్పాటు

హైదరాబాద్: ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని అన్ని పల్లెలకు ఇంటర్నెట్ సౌకర్యాన్ని అందుబాటులోకి తీసుకురావాలని కేంద్రం బృహత్తర కార్యక్రమాన్ని చేపట్టింది. పూర్తిగా కేంద్ర ప్రభుత్వ నిధులతో ఏపీలోని అన్ని గ్రామ పంచాయతీలకు ఇంటర్నెట్ సౌకర్యం అందుబాటులోకి తేచ్చేలా ఫైబర్ ఆప్టిక్ కేబుల్ నెట్‌వర్క్‌ను ఏర్పాటు చేయనుంది. అక్కడినుంచి ఆయా గ్రామాల్లోని స్థానిక పాఠశాలలు, ఇతర కార్యాలయాలకు వైఫై ద్వారా ఇంటర్నెట్ సౌకర్యాన్ని కల్పించే బాధ్యతను రాష్ర్టం చేపట్టాల్సి ఉంది.

ఇందుకోసం కేంద్రం రూ.20 వేల కోట్ల వ్యయంతో రాష్ట్రంలో 28 వేల కిలో మీటర్ల మేర ఫైబర్ ఆప్టిక్ కేబుల్ నెట్‌వర్క్ ఏర్పాటు చేయనుంది. ఇప్పటికే రెండుసార్లు టెండర్లు రద్దవ్వగా, మూడోసారి దాఖలుకు ఈ నెల 15 చివరి తేదీ అని ఉన్నతాధికారి ఒకరు తెలిపారు. కనెక్టివిటీ వినియోగంపై భారత సంచార నిగమ్ లిమిటెడ్ (బీఎస్‌ఎన్‌ఎల్), భారత బ్రాడ్ బాండ్ నెట్‌వర్క్ లిమిటెడ్ (బీబీఎన్‌ఎల్) నోడల్ ఏజెన్సీలుగా కేంద్రం నియమించింది. రాష్ట్రంలో గ్రామ పంచాయతీలవరకు ఫైబర్ ఆప్టిక్ కేబుల్ నెట్‌వర్క్‌ను అమలు చేసే బాధ్యతను పవర్ గ్రిడ్ కార్పొరేషన్‌కు అప్పగించారు. ఫైబర్ ఆప్టిక్ కేబుల్ నెట్ వర్క్ ఏర్పాటునకు గ్రామస్థాయి వరకు అన్ని శాఖలు పూర్తి సహాయ సహకారాలు అందించాల్సిందిగా రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి ఐ.వై.ఆర్.కృష్ణారావు ఆదేశాలు జారీ చేశారు.
 

Advertisement
Advertisement