వడమాలపేట, న్యూస్లైన్: మండలంలోని తడుకు రైల్వే స్టేషన్ వద్ద శనివారం రాత్రి ఘోర ప్రమాదం చోటు చేసుకుంది. కారును లారీ ఢీకొన్న ఘటనలో నలుగురు మృతి చెందారు. ఇరవై మంది గాయపడ్డారు. మృతుల్లో తండ్రీ కొడుకులు ఉన్నారు. తమిళనాడులోని తిరుత్తణికి చెందిన రఘుపతినాయుడు(48) తన కుమారుడు సూర్య (18)ను రైలు ఎక్కించేందుకు రేణిగుంటకు స్నేహితులతో కలసి కారులో బయలుదేరారు. ఏర్పేడు మండలం మల్లవరం గ్రామం నుంచి ఊత్తుకోటకు పెళ్లి బృందంతో లారీ బయలుదేరింది.
తడుకు రైల్వేస్టేషన్ వద్దకు వచ్చే సరికి కారును లారీ ఢీకొంది. కారులో ప్రయాణిస్తున్న రఘుపతినాయుడు, సూర్య, మేఘనాథం (42), మోహన్బాబు (38) అక్కడికక్కడే మృతి చెందారు. లారీలో ప్రయాణిస్తున్న ఇరవై మందికి గాయాలయ్యాయి. వీరిని పుత్తూరు ప్రభుత్వాస్పత్రికి తరలించారు. పుత్తూరు సీఐ చంద్రశేఖర్, వడమాలపేట ఎస్ఐ ఈశ్వర్ సంఘటన స్థలాన్ని పరిశీలించారు.