- ప్రయాణికుల ఆగ్రహం
విజయనగరం
రైళ్లు ఆలస్యంగా నడవడం విన్నాం... కానీ విడ్డూరంగా ఓ రైలు నిర్ధిష్ట సమయం కంటే ముందే వెళ్లిపోయింది. దీంతో ప్రయాణీకులు, ఉద్యోగులు ఆగ్రహం వ్యక్తం చేశారు. వివరాల్లోకి వెళితే.. విశాఖ - కోరాపుట్ రైలు శనివారం ఉదయం 8.10 నిమిషాలకు విజయనగరం రైల్వే స్టేషన్కు వచ్చింది. నిర్ణీత సమయం ప్రకారం.. ఈ రైలు 8.20 కి బయల్దేరి వెళ్లాలి. కానీ, 8.12కే రైలు బయల్దేరి వెళ్లిపోవడంతో సుమారు 100 మంది వరకు ఉద్యోగులు, వ్యాపారులు రైలు ఎక్కడంలో విఫలమయ్యారు.
ఆగ్రహంతో సిగ్నల్ అధికారులను నిలదీశారు. అక్కడే బైఠాయించి నిరసన తెలిపారు. దీంతో స్టేషన్ మాస్టర్ చంద్రశేఖర్రాజు కల్పించుకుని వారికి సర్దిచెప్పారు. స్టేషన్ మాస్టర్ కథనం మేరకు.. రైలు 8.10కి స్టేషన్కు వచ్చింది. 8.18కి స్టార్టప్ చెప్పినట్టు రికార్డుల్లో నమోదు చేశారు. రెండు నిమిషాల ముందే స్టార్టప్ చెబుతారు. రైలు గార్డు పచ్చజెండాతో పైలట్ ముందే రైలును పోనిచ్చారు. గార్డు తప్పిందం వల్లే అలా జరిగినట్టు స్టేషన్ మాస్టర్ చెప్పారు. దీనిపై ఉన్నతాధికారులకు ఫిర్యాదు చేస్తానన్నారు.