మగువలపై అంతేలేని అఘాయిత్యాలు | Sakshi
Sakshi News home page

నాలుగేళ్లుగా మగువలపై అంతేలేని అఘాయిత్యాలు

Published Sun, May 6 2018 4:14 AM

There are thousands of sexual assaults in the state - Sakshi

సాక్షి నెట్‌వర్క్‌: ఆడుతూ పాడుతూ ఆనందంగా గడపాల్సిన బాల్యం మృగాళ్ల విష కౌగిట్లో చిక్కుకుంటోంది. సుకుమారమైన లేతప్రాయం కామాంధుల ఉక్కు పిడికిళ్ల మధ్య నలిగిపోతోంది. గుంటూరు జిల్లా దాచేపల్లిలో ఐదు రోజుల క్రితం 9 ఏళ్ల చిన్నారిపై 55 ఏళ్ల వృద్ధుడు సాగించిన అత్యాచారం గురించి విని చెమర్చని కళ్లు లేవు, మౌనంగా రోదించని హృదయాలు లేవు. రాష్ట్రంలో మహిళలపై అత్యాచారాలు, లైంగిక దాడులు, అఘాయిత్యాలు, అరాచకాలకు అంతే ఉండడం లేదు. పసిపిల్లల నుంచి పండుటాకుల దాకా.. ఎవరూ లైంగిక దాడుల నుంచి తప్పించుకోలేకపోతున్నారు.

ఆంధ్రప్రదేశ్‌లో మహిళలపై అత్యాచారాలు, లైంగిక దాడుల ఘటనలు నానాటికీ పెరిగిపోతున్నాయి. ప్రతి జిల్లాలో ఏటా పదుల సంఖ్యలో కేసులు నమోదవుతున్నాయి. వెలుగులోకి రాని కేసులు అంతకు ఇంకెన్నో రెట్లు ఉంటాయన్న సంగతి తెలిసిందే. విషాదం ఏమిటంటే.. బాధితుల కన్నీరు ప్రభుత్వాన్ని, పాలకులను కదిలించలేకపోతోంది. మహిళలపై అత్యాచారాలు, లైంగిక దాడుల నియంత్రణకు ప్రభుత్వాలు పటిష్టమైన చర్యలేవీ తీసుకోకపోవడంతో కామాంధులు రెచ్చిపోతున్నారు. సర్కారు అలసత్వం, మగువల పట్ల నిర్లక్ష్యం వారికి వరంగా మారుతోంది.

నాలుగేళ్లలో లైంగిక దాడి కేసులు వేల సంఖ్యలో నమోదు కావడమే ఇందుకు నిదర్శనం రాష్ట్రంలో నాలుగేళ్ల గణాంకాలను పరిశీలిస్తే అతివలపై అత్యాచారాలు పెరగడమే తప్ప ఎక్కడా ఇసుమంతైనా తగ్గలేదని స్పష్టమవుతోంది. తాను ముఖ్యమంత్రిగా ఉన్నంతవరకూ మహిళలపై అఘాయిత్యాలు జరగబోవంటూ చంద్రబాబు నాయుడు చెబుతున్న మాటల్లోని డొల్లతనం ఇట్టే అర్థం చేసుకోవచ్చు. దాచేపల్లి ఘటనపై ప్రజాగ్రహం వెల్లువెత్తడం, అత్యాచారాలకు వ్యతిరేకంగా, ప్రభుత్వ తీరుకు నిరసనగా ప్రతిపక్ష వైఎస్సార్‌ కాంగ్రెస్‌ పార్టీ పెద్ద ఎత్తున ఉద్యమం ప్రారంభించడంతో సీఎం చంద్రబాబు నష్టనివారణ కోసం ఉత్తుత్తి ప్రకటనలు చేస్తున్నారన్న విమర్శలు వ్యక్తమవుతున్నాయి. నాలుగేళ్లుగా మహిళలపై అత్యాచారాలు జరుగుతున్నా ముఖ్యమంత్రి ఏనాడూ స్పందించకపోవడం గమనార్హం. 

గుంటూరు  జిల్లా
2018 మార్చి 22న మాచర్ల మండలం కొత్తూరు గ్రామానికి చెందిన నాలుగేళ్ల చిన్నారిపై ఇంట్లో పనిచేసే 35 ఏళ్ల బాలూ నాయక్‌ అత్యంత అమానుషంగా అత్యాచారానికి పాల్పడ్డాడు. తీవ్ర రక్తస్రావమై చిన్నారి మృతి చెందింది.
తెనాలిలో నరసింహా అనే 25 ఏళ్ల యువకుడు 10, 12 ఏళ్ల వయస్సు ఉన్న ఇద్దరు మైనర్‌ బాలికలను పొదల్లోకి తీసుకెళ్లి లైంగిక దాడికి పాల్పడ్డాడు.
గుంటూరు నగరం విద్యానగర్‌ 3వ లైనుకు చెందిన 13, 14 ఏళ్ల వయస్సు ఉన్న ఆరుగురు మైనర్‌ బాలురు అదే కాలనీకి చెందిన ఆరేళ్ల పాపపై లైంగిక దాడికి పాల్పడ్డారు.  
కారంపూడి మండలం ఒప్పిచర్ల గ్రామంలో ఏప్రిల్‌ 23న రాత్రి మైనర్‌ బాలుడు వివాహిత ఇంటిలోకి ప్రవేశించి నోట్లో గుడ్డలు కుక్కి రాత్రంతా మూడుసార్లు లైంగిక దాడికి పాల్పడ్డాడు.
నాదెండ్ల మండలం తూబాడు గ్రామానికి చెందిన గోళ్లమూడి లక్ష్మయ్య అనే టీడీపీ నాయకుడు అదే గ్రామానికి చెందిన 30 ఏళ్ల మూగ, మానసిక వైకల్యం ఉన్న యువతిపై ఏప్రిల్‌ 23వ తేదీ రాత్రి లైంగిక దాడికి పాల్పడ్డాడు.

చిత్తూరు  జిల్లా
2014 పిబ్రవరి 12న గుడిపాల మండలంలోని తుమ్మలవారిపల్లె హరిజనవాడకు చెందిన 14 ఏళ్ల బాలికపై అదే గ్రామానికి చెందిన బాషా అలియాస్‌ నరేష్‌ అత్యాచారానికి పాల్పడ్డాడు.  
2015లో చిత్తూరు నగరంలో స్థానిక షర్మన్‌ బాలికల ఉన్నత పాఠశాలలో 8వ తరగతి చదువుతున్న విద్యార్థినిపై ప్రధానోపాధ్యాయురాలి భర్త అత్యాచారం చేశాడు.
2016 జూలై 23 ఇరువారం దళితవాడకు చెందిన ఓ మైనర్‌ బాలికను దుండగులు అపహరించి అత్యాచారం చేశారు.
2017 ఫిబ్రవరిలో పల్లూరు మూలచేనుకు చెందిన 13 ఏళ్ల బాలికపై అదే గ్రామానికి చెందిన సుబ్రహ్మణి అనే వ్యక్తి అత్యాచారం చేయడంతో ఆమె గర్భం దాల్చింది.  

విశాఖ జిల్లా
2017 అక్టోబర్‌ 22న విశాఖ నగరంలోని రైల్వే న్యూకాలనీ సమీపంలో పట్టపగలు ఒక వృద్ధురాలిపై శివగంజీ అనే యువకుడు అత్యాచారం చేశాడు.
2017 మే 24న 19 ఏళ్ల యువతిపై 16 ఏళ్ల బాలుడు లైంగిక దాడికి పాల్పడ్డాడు.
2018 జనవరి 11న కైలాసపురం లక్ష్మీనారాయణపురంలో అనారోగ్యంతో మంచంపై కదలలేది స్థితిలో ఉన్న 65 ఏళ్లే వృద్ధురాలిపై అప్పన్న (55) అనే వ్యక్తి అత్యాచారానికి పాల్పడ్డాడు.
విశాఖ జిల్లా రూరల్‌ పరిధిలో గత రెండేళ్ల 38 లైంగిక దాడుల కేసులు నమోదయ్యాయి.
జిల్లాలోని నర్సీపట్నం, కొయ్యూరు, చింతపల్లి, అరకు, సీలేరు ప్రాంతాల్లో అత్యాచార ఘటనలు సంచలనం సృష్టించాయి.
2017 మే 15న చింతపల్లిలో ఓ యువతిపై అత్యాచారం జరిగింది.  సీలేరులో అడవిలో  కట్టెలు కొట్టడానికి వెళ్లిన ఒక బాలికపై అత్యాచారం చేశారు.  

వైఎస్సార్‌ జిల్లా
2014 మే 5న రైల్వేకోడూరు సమీపంలోని మైసూరావారిపల్లి పంచాయతీ శాంతీనగర్‌లో నివాసముంటున్న నాలుగేళ్ల చిన్నారిపై షేక్‌చాను లైంగికదాడికి పాల్పడ్డాడు.  
2015లో పెనగలూరు మండలం నారాయణ నెల్లూరు గ్రామానికి చెందిన బాలిక(15)పై మల్లికార్జున అనే యువకుడు అత్యాచారం చేశాడు.
2015లో పెనగలూరు మండలం ఈటమాపురం తూర్పుపల్లెకు చెందిన 20 ఏళ్ల దివ్యాంగురాలిపై అదే గ్రామానికి చెందిన ముగ్గురు వ్యక్తులు అత్యాచారానికి పాల్పడ్డారు.  
2016 మార్చి 8న కమలాపురం నియోజకవర్గం చింతకొమ్మదిన్నె మండలం కొప్పర్తి గ్రామంలో ఆరేళ్ల చిన్నారిపై వృద్ధుడు లైంగిక దాడి చేశాడు.  
2016లో పెనగలూరు మండలం నల్లపురెడ్డి పంచాయతీ నడింపల్లెకు చెందిన బాలిక(19)పై అదే గ్రామనికి చెందిన వెంకటరమణ లైంగిక దాడి చేశారు.
మైదుకూరు నియోజకవర్గం బ్రహంగారి మఠం మండలంలో 2014 నుంచి 2018 వరకు మే వరకు బాలికలపై నాలుగు చోట్ల అత్యాచాలు జరిగాయి.
2016లో పాపిరెడ్డిపల్లె గ్రామంలో శివ అనే వ్యక్తి 15 ఏళ్ల బాలికను పెళ్లి చేసుకుంటానని మాయమాటలు చెప్పి గర్భవతిని చేశాడు.
2015 నవంబరు 6న చాపాడు మండలం చియ్యపాడు గ్రామంలోరజక కుటుంబానికి చెందిన 15 ఏళ్ల బాలికపై వీరరాఘవరెడ్డి అత్యాచారం చేయడంతో ఆమె గర్భం దాల్చింది.

కృష్ణా జిల్లా
పెనమలూరు నియోజకవర్గం కానూరు గ్రామంలో గతేడాది వినాయకచవితి పండుగ రోజున భవన నిర్మాణ కార్మికుడి పదేళ్ల కుమార్తెపై అక్కడే పని చేస్తున్న ఒడిశాకు చెందిన ఓ యువకుడు లైంగికదాడికి పాల్పడ్డాడు.  
2017 జూన్‌లో కంచికచర్లలో మైనర్‌ బాలికపై లైంగికదాడి జరిగింది.
2017 జూలై 18న చెవిటికల్లులో మైనర్‌ బాలికపై దుండగులు లైంగికదాడికి పాల్పడ్డారు.
2018  జనవరి 11న కంచికచర్లలో బాలికపై అత్యాచారం చేశారు.  

ప్రకాశం  జిల్లా
పర్చూరు నియోజకవర్గం పర్చూరు మండలం చింతకుంటవారిపాలెంలో కన్నకూతురిపై ఏడాది కాలంగా లైంగిక దాడి సాగిస్తున్న తండ్రికి 2016 ఏప్రిల్‌ 18న న్యాయస్థానం యావజ్జీవ కారాగార శిక్ష విధించింది.
పర్చూరు మండలం ఏదుబాడు గ్రామానికి చెందిన ఐదేళ్ల బాలికపై అత్యాచారం చేసిన 60 ఏళ్ల వృద్ధుడికి కోర్టు యావజ్జీవ కారాగార శిక్ష విధించింది.
గత ఏడాది ఆగస్టులో కనిగిరి నియోజకవర్గం పీసీ పల్లి మండలం ఇర్లపాడులో ఐదేళ్ల బాలికపై లైంగిక దాడి, ఆపై హత్య కేసు సంచలనం సృష్టించింది.

పశ్చిమ గోదావరి  జిల్లా
2015 జూన్‌ 18న ఏలూరు మండలం వెంకటాపురం పంచాయతీ ఇందిరా కాలనీలో సురేష్‌ అనే వ్యక్తి ఏడేళ్ళ బాలికపై అత్యాచారం, హత్య.
2016లో తణుకు మండలం వేల్పూరు గ్రామంలో ఓ మహిళపై కొందరు వ్యక్తులు లైంగిక వేధింపులకు గురిచేయడంతో ఆమె ఆత్మహత్యకు పాల్పడింది.  
2017లో మేలో నిడదవోలు మండలం డి.ముప్పవరం గ్రామ శివారున చెరుకుతోటలో ఓ యువతి హత్యాచారానికి గురైంది. తెల్లవారితే ఆ యువతికి పెళ్లి జరగాల్సివుండగా అదే గ్రామానికి చెందిన యువకుడు అత్యాచారానికి ఒడిగట్టాడు.  
2017లో నిడదవోలు మండలం పురుషోత్తపల్లి గ్రామంలో    7వ తరగతి చదువుతున్న బాలికలపై అదే గ్రామానికి చెందిన    యువకుడు హత్యాచారానికి పాల్పడ్డాడు.  
2018 ఏప్రిల్‌ 29న పోలవరం మండలం గాజులగొంది గ్రామంలో5 ఏళ్ల గిరిజన బాలికపై అదే గ్రామానికి చెందిన నేరం శేఖర్‌ అత్యాచారానికి పాల్పడ్డాడు.

తూర్పుగోదావరి  జిల్లా
2016లో పిఠాపురం మండలం నరిసింగపురంకు చెందిన మానసిక వికలాంగురాలైన మైనర్‌ బాలికపై ఎండ్ల భీమరాజు అత్యాచార యత్నానికి పాల్పడ్డాడు.
2016 ఆగస్టు 19న  కిర్లంపూడి మండలం జగపతినగరం గ్రామానికి చెందిన ఓ వృద్ధుడు మూడేళ్ల బాలికపై అత్యాచారం చేశాడు.
2017జూన్‌ 23వ తేదీన కిర్లంపూడి మండలం బూరుగుపూడికి చెందిన 14ఏళ్ల బాలికలపై 19ఏళ్ల యువకుడు అత్యాచారం చేశాడు.
2017 డిసెంబర్‌ 6న చింతూరు మండలం విద్యానగరం ఆశ్రమ పాఠశాల వార్డెన్‌ లక్ష్మయ్య అదే పాఠశాలలో ఎనిమిదో తరగతి చదువుతున్న విద్యార్థినిపై అత్యాచారం చేశాడు.
2018 మే 2న కత్తిపూడి గ్రామానికి చెందిన టీడీపీ నేత, ఎంపీటీసీ భర్త శ్రీనివాస్, మరో ముగ్గురు వ్యక్తులు  తొండంగి మండలం తమ్మయ్యపేట గ్రామంలోని జాతీయ రహదారి వద్ద టీ దుకాణం నడుపుతున్న మహిళపై అత్యాచార యత్నానికి పాల్పడ్డారు.  

అనంతపురం  జిల్లా
2016లో కల్యాణదుర్గం మండలం పాలవాయి గ్రామంలో టీడీపీ నాయకుడు రాము కుమారుడు, మైనర్‌ బాలుడు బోయ సాయికీర్తి అదే గ్రామానికి చెందిన మైనర్‌ బాలికపై  అత్యాచారం చేశాడు.
2014 సెప్టెంబర్‌ 8న  శెట్టూరు మండలం బలపంపల్లిలో మైనర్‌ బాలికపై ఈరన్న అనే వ్యక్తి అత్యాచారం చేశాడు.
2017 ఆగసు6న కంబదూరు గ్రామంలో రామాంజినేయులు అనే వ్యక్తి తన కుమార్తెపైనే  అత్యాచారానికి పాల్పడ్డాడు.
2018 మార్చి 18న తాడిపత్రి పట్టణంలోని అంబేడ్కర్‌ నగర్‌కు చెందిన ఆరేళ్ల చిన్నారిపై శేషాద్రి(28) అనే వ్యక్తి ఆత్యాచారయత్నానికి పాల్పడినట్లు బాలిక తల్లి పోలీసులకు ఫిర్యాదు చేసింది.
2017 నవంబర్‌ 3న పెద్దవడుగూరు మండల పరిధిలోని కొండూరులో ఓ దళిత వివాహితపై సుంకిరెడ్డి అనే వ్యక్తి అత్యాచార యత్నానికి పాల్పడ్డాడు.
2015 ఏప్రిల్‌ 25న యాడికి మండల కేంద్రంలోని కొండకింద గేరి వీధిలో9 ఏళ్ల మైనర్‌ బాలికపై లింగం ఓబులేసు అనే వ్యక్తి అత్యాచారయత్నానికిపాల్పడ్డాడు.

నెల్లూరు  జిల్లా
2014 జనవరి 23న తోటపల్లిగూడూరు మండలం మల్లికార్జునపురంలో ఇద్దరు యువకులు ఓ బాలికపై అఘాయిత్యానికి పాల్పడ్డారు.  
2015 ఫిబ్రవరి 6న నెల్లూరు నగరంలోని సీఆర్‌పీ డొంకలో మూడేళ్ల చిన్నారిపై లైంగిక దాడి జరిగింది.
ఫిబ్రవరి 4న వెంకటాచలంలో గిరిజన బాలికలపై వరుసకు తండ్రి అయ్యే వ్యక్తి లైంగిక దాడి చేశాడు.
2017 ఆగస్టు 22న ఓజిలి మండలం కుందాల గ్రామంలో అంకయ్య అనే వ్యక్తి తన కుమార్తెను ఇంట్లో నిర్బంధించి తరచూ లైంగికదాడికి పాల్పడ్డాడు. ఫలితంగా సదరు చిన్నారి గర్భం దాల్చింది.
2017సెప్టెంబర్‌ నెల్లూరు సుందరయ్యకాలనీలో కుమార్తెపై కన్న తండ్రి సుబ్బారావు లైంగిక దాడిచేశాడు.
2018 మే 3న బుచ్చిరెడ్డిపాళెంలో ఎనిమిదేళ్ల గిరిజన బాలికపై ఓ యువకుడు లైంగిక దాడికి పాల్పడ్డాడు.  

కర్నూలు  జిల్లా
2014లో హాలహర్విలో గోపాలప్ప అనే వృద్ధుడు 15 ఏళ్ల బాలికపై అత్యాచారం చేశాడు.
2015లో కర్నూలులోని ఓల్డ్‌సిటీకి చెందిన 7 ఏళ్ల బాలికపై ఖాజాఖాన్‌ అనే కామంధుడు  అత్యాచారం చేశాడు.
2017 సెప్టెంబర్‌ 10న ఉయ్యాలవాడ మండలం అల్లూరు గ్రామానికి చెందిన కొప్పుల నాగేంద్ర అనే యువకుడు ఐదేళ్ల చిన్నారిపై అత్యాచారానికి పాల్పడ్డాడు.  
2017 నవంబర్‌లో కర్నూలుకు చెందిన మహిళపై కొడుకు వరసయ్యే  పవన్‌ అనే విద్యార్థి అత్యాచారం చేసి బండరాయితో మోది చంపేశాడు.  
2018లో కర్నూలులో 13 ఏళ్ల బాలికపై చెన్నయ్య(55) అత్యాచారం.

శ్రీకాకుళం  జిల్లా
2014 అక్టోబర్‌ 11న సారవకోట మండలం సూరపు లక్ష్మణరావు అదే గ్రామానికి చెందిన ఇక వితంతువుపై అత్యాచారానికి పాల్పడ్డాడు.
2015 జులై 29న పోలాకి మండలం చింతువానిపేటకు చెందిన ఇల్లప్ప అనే ఆటో డ్రైవర్‌ పదోతరగతి చదువుతున్న బాలికపై లైంగికదాడి చేశాడు.
2016 ఫిబ్రవరి 23న నరసన్నపేట పురుషోత్తంనగర్‌ కాలనీకి చెందిన వర్రు ఎర్రయ్య పోలాకి మండలం గుప్పడిపేటలో ఒక మైనర్‌పై లైంగిక దాడికి పాల్పడ్డాడు.
2017 జూన్‌ 30న నరసన్నపేట మండలం లింగాలపాడుకు చెందిన ఒక బాలికపై ఇదే మండలం చోడవరానికి చెందిన లోపింటి నాగరాజు అత్యాచారానికి ఒడిగట్టాడు.
2018 ఏప్రిల్‌ 21న  సీతంపేట మండలం సోమగండి గ్రామానికి చెందిన గంటా సంతోష్‌ అనే వివాహితుడు ఎనిమిదేళ్ల బాలికపై అత్యాచారం.

విజయనగరం  జిల్లా
గత నాలుగేళ్లలో గజపతినగరం నియోజకవర్గం గంట్యాడ మండలంలో 6 అత్యాచారం కేసులు నమోదయ్యాయి.
2014 మే 22న నరవ గ్రామంలో 20 ఏళ్ల యువతిపై అదే గ్రామానికి చెందిన సుంకర భూలోక రాజు అత్యాచారం చేశాడు.
2015లో సిరిపురం గ్రామానికి చెందిన 18 ఏళ్ల యువతిని కర్రుబోతు రమణ ప్రేమ పేరుతో లోబర్చుకున్నాడు. అవసరం తీరాక వదిలేశాడు.  
2017 మార్చి 4న నరవ గ్రామంలో ఓ బాలికపై టి.గణేష్‌ అత్యాచారానికి పాల్పడ్డాడు.
2017 ఆగస్టు 20న కె.వెలగాడ గ్రామంలో 9 ఏళ్ల బాలికపై కోనూరు శ్రీను అత్యాచారానికి పాల్పడ్డాడు.
2018 ఫిబ్రవరి 2న చీపురుపల్లి నియోజకవర్గం గరివిడి మండలం కొండపాలెంలో ఉన్న ఓ ప్రభుత్వ పాఠశాలలో తొమ్మిదో తరగతి చదువుతున్న విద్యార్థినిపై ముగ్గురు వ్యక్తులు లైంగిక దాడికి పాల్పడ్డారు.

Advertisement
Advertisement