ఇంత గందరగోళానికి గత ప్రభుత్వమే కారణం:రమాకాంత్ రెడ్డి | Sakshi
Sakshi News home page

ఇంత గందరగోళానికి గత ప్రభుత్వమే కారణం:రమాకాంత్ రెడ్డి

Published Mon, Mar 10 2014 1:34 PM

ఇంత గందరగోళానికి గత ప్రభుత్వమే కారణం:రమాకాంత్ రెడ్డి - Sakshi

హైదరాబాద్: పరిషత్ ఎన్నికల ఫలితాలు వాయిదా వేయమనే అధికారం కేంద్ర ఎన్నికల సంఘానికి లేదని రాష్ట్ర ఎన్నికల సంఘం కమీషనర్ రమాకాంత్ రెడ్డి స్ఫష్టం చేశారు.  ఎన్నికల షెడ్యూల్ విడుదలకు సంబంధించిన పలు విషయాలను ఆయన సోమవారం మీడియాతో పంచుకున్నారు. ఎంపీటీసీ, జడ్పీటీసీ ఎన్నికల ఫలితాలను కనీసం వాయిదా వేయమని కొన్ని పార్టీలు ఎన్నికల సంఘాన్ని కోరిన విషయాన్ని ఈ సందర్భంగా గుర్తు చేశారు. ఆ అధికారం కేంద్ర ఎన్నికల సంఘానికి లేదని తెలిపారు. కాగా కోర్టు నియమావళికి లోబడే నిర్ణయం తీసుకుంటామని ఒక ప్రశ్నకు సమాధానం చెప్పారు.

ఈ ఎన్నికలు పార్టీ గుర్తులపైనే జరుగుతాయన్నారు. ఏప్రిల్ 6వ తేదీన జడ్పీటీసీ, ఎంపీటీసీ ఎన్నికలకు సంబంధించి ఈ నెల 17 నుంచి నామినేషన్ల స్వీకరణ కార్యక్రమం చేపట్టనున్నట్లు తెలిపారు. నామినేషన్ల స్వీకరణ ప్రక్రియను మార్చి 20వ తేదీతో ముగించి, 21తేదీన నామినేషన్లను పరిశీలిస్తామన్నారు. నామినేషన్ల ఉపసంహరణ కార్యక్రమం మార్చి 24తో ముగుస్తుందన్నారు. ఏప్రిల్ 8వ తేదీన ఎన్నికల కౌంటింగ్ ఉంటుందన్నారు.

 

ప్రస్తుతం చోటు చేసుకున్నపరిస్థితులకు గత ప్రభుత్వమే కారణమన్నారు. ప్రభుత్వం షరిషత్ ఎన్నికలకు సరైన సమయంలో సరైన నిర్ణయం తీసుకుని ఉంటే ఇంతటి గందరగోళం ఉండేది కాదని రమాకాంత్ రెడ్డి తెలిపారు.

Advertisement
Advertisement